హైదరాబాద్ (వి.వి) : తెలంగాణా సాయుధ పోరాట  యోధుడు, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ బొమ్మగాని  ధర్మభిక్షం(89) శనివారం సాయంత్రం 6 గంటలకు ఎల్.బి. నగర్లోని కామినేని  ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్ధం  ఆదివారం ఉదయం 8.30 గం||ల నుండి 10.30 గంటల వరకు సిపిఐ రాష్ట్ర ప్రధాన  కార్యాలయం హిమాయత్ నగర్లోని మఖ్దూంభవన్ ఆవరణలో ఉంచుతారు. అనంతరం  మధ్యాహ్నం మూడు గంటలకు నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఆయన అంత్యక్రియలు  జరుగుతాయి.
జీవితసంగ్రహం : మిడిల్స్కూల్ వయసులోనే నిజాంనవాబు  జన్మదినోత్సవాలను విద్యార్థులందరిచేత బహిష్కరించి నిజాం సంస్థానమంతటా  ప్రకంపనలు సృష్టించిన ఆ ఉద్యమ నెలబాలుడు, ఎనిమిది దశాబ్ధాల అలుపెరుగని  సమరశీల పోరాటాల మహాప్రస్థానంలో ప్రజాకంఠక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై  కొరడా ఝుళిపి మెడలు వంచడమే కాదు, 'విశ్వ రాజకీయ యవనికపె'ౖ కమ్యూనిస్టు  విజయపతాకను ఎగరేసిన తెలంగాణ సాయుధపోరాటయోధుడు,ఉద్యమాలఎర్ర 'సూర్యుడు'  బొమ్మగాని ధర్మభిక్షం. పీడిత, తాడిత, అట్టడుగు బడుగు బలహీనవర్గాల  ఆరాధ్యులుగా ఇంటి మనిషై, యావత్ ఆంధ్రరాష్ట్ర ప్రజల నోట ఆయనపేరు  తారకమంత్రమై, అఖండ భారతావని గర్వించదగిన ప్రజాప్రతినిధిగా, 'ప్రజల మనిషి'గా  చరిత్ర పుటల్లో సుస్థిరస్థానాన్ని దక్కించుకున్నారు. ఫిబ్రవరి 7న ఇంట్లో  జారిపడిన ధర్మబిక్షాన్ని చికిత్సకోసం హైదరాబాద్ కామినేని హాస్పిటల్లో  చేర్చారు. 10న కుడికాలు తొడ ఎముక ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స జేశారు.  ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్సోకి పరిస్థితి విషమంగా తయారైంది. తెలంగాణ  సాయుధ పోరాటానికి కేంద్రబిందువైన 'పోరాటాల పోతుగడ్డ' సూర్యాపేటలో నిరుపేద  కల్లుగీత కార్మిక కుటుం బంలో 1922, ఫిబ్రవరి 15న బిక్షం జన్మించారు.  బొమ్మగాని ముత్తిలింగయ్య, గోపమ్మలు తల్లిదండ్రులు. అక్కలు ఎల్లమ్మ,  తిరుపతమ్మలు కాగా, వెంకటయ్య, ముత్తయ్యలు ఆయన సోదరులు. వీరందరిలో మిగిలిన  సోదరుడు బొమ్మగాని వెంకటయ్య ఆయన పోరాటాల అడుగుజాడల్లో నేటికీ  'లక్ష్మణుడిన్ని' తలపిస్తారు. సోవియట్ దేశప్రజలు సాగించిన వీరోచిత  పోరాటాలు, విజయాలు, భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల వెల్లువ  నుంచి సూర్యాపేటలో నల్గొండజిల్లాలోనే ప్రథమ కమ్యూనిస్టు సెల్ ఏర్పడేందుకు  పురికొల్పింది. తొలి కమ్యూనిస్టుపార్టీ సెల్ను ఏర్పాటు చేయడంలో ధర్మబిక్షం  పాత్ర అత్యంత కీలకమైనది. ఆంధ్రమహాసభ కార్యకర్తగా పనిచేస్తూ, 1942లో  ధర్మబిక్షం కమ్యూనిష్టు పార్టిలో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి  వ్యాపించిన వందేమాతరం ఉద్యమజ్వాల నల్లగొండకు విస్తరించి, అది ధర్మబిక్షం  నాయకత్వంలో ఉధృతమైంది. కేంద్రంలో సమ్మె విరమించినా, నల్గొండలో 23 రోజుల  పాటు సమ్మె కొనసాగింది. ధర్మబిక్షంతో సహా 30మంది విద్యార్థులను పాఠశాలనుండి  తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనగామ తాలూకా విసునూరు దేశ్ముఖ్కు  వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా సూర్యాపేటలో సమ్మె జరిపినందుకు నిజాం  ప్రభుత్వం ఈయనపై అరెస్ట్వారెంట్ జారీచేసింది. కనిపిస్తే కాల్చివేత  ఉత్వర్వులు కూడా జారీచేసింది. ఒకటిన్నర సంవత్సరం పాటు ధర్మబిక్షం  'రహస్యజీవితం' గడిపారు. తర్వాత అరెస్ట్కాబడిన ఆయన సూర్యాపేట, నల్గొండ,  చంచల్గూడ సెంట్రల్జైల్, ఔరంగాబాద్, జాల్నా జైళ్ళలో ఐదున్నరేళ్ళపాటు  ప్రమాదకర రాజకీయఖైదీగా జైలుజీవితం గడిపారు. జాల్నాజైల్ కాన్సంట్రేషన్  క్యాంపులో ధర్మబిక్షాన్ని వేసిన బ్యారక్స్ చుట్టూ మిషన్గన్స్,  స్టెన్గన్స్, రైఫిల్స్తో మిలిటరీవాళ్ళ కాపాలా నడుమ కఠినజైలు జీవితం  సాగింది. నల్లగొండ జిల్లా కమ్యూనిష్టు పార్టీకి తొలి కార్యదర్శిగా సారధ్యం  వహించి 'నల్లగొండ పేరు చెప్పితే ఢిల్లీ కోటలో గుండె ఝల్లుమనేలా'  సమరశీలపోరాటాలకు ధర్మబిక్షం రూపకల్పన చేశారు. భారతదేశంలో కమ్యూ నిష్టు  ఉద్యమాల్లో బలమైన కేంద్రంగా పరిఢవిల్లుతోన్న నల్గొండ జిల్లాను కమ్యూనిష్టు  పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దుతూ, పటిష్టపునాదులు నిర్మించ డంలో  ధర్మబిక్షం చేసిన అవిశ్రాంత కృషి అనితరసాధ్యం.1988లో హైదరా బాద్లో జరిగిన  అఖిల భారత గీతపనివారల, కార్మిక సమాఖ్యకు అధ్యక్షులుగా ఎన్నికై నేటివరకూ  గీతపనివారల హక్కులసాధనకై మడమతిప్పని పోరాటాలు చేస్తున్నారు.
విద్యార్థి  ఉద్యమాలకు ఆద్యుడు : పేదరికం శాపమైనప్పటికీ, చదువుల తల్లి ముద్దుబిడ్డగా  ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫోరం వరకూ క్లాస్లో ఎల్లప్పుడూ మొదటి ర్యాంక్ను  సాధించే భిక్షం మానిటర్గా కూడా ఎన్నికయ్యేవారు. హైదరాబాద్ రెడ్డి  హాస్టల్ సందర్శన అనంతరం సూర్యాపేటలోని తాను చదివే పాఠశాలలో గ్రంథాలయం  ఏర్పాటు, పత్రికలు, మ్యాగజైన్స్ అందించడం, విద్యార్థుల చర్చావేదిక ఏర్పాటు  అనే 3 ప్రధాన డిమాండ్ల సాధనకు ఒకరోజు సమ్మె భిక్షం నాయకత్వంలో జరిగింది.  హెడ్మాస్టర్ కరీముల్లాఖాన్ దిగివచ్చి వెంటనే సమస్యల పరిష్కారానికి  అంగీకరించడం నల్లగొండజిల్లా అంతటా చర్చనీయాం శమైంది. ఇదే పాఠశాలలో నైజాం  ప్రభుత్వపు ఏడవ నవాబు జన్మదినోత్సవ వేడుకలకు నిజాం ప్రధానమంత్రి  కిషన్ప్రసాద్ హాజరవుతున్న దృష్ట్యా విద్యార్థులంతా మాస్డ్రిల్ యూనిఫారం  ధరించి పరేడ్ చేయాలన్న హెడ్మాష్టర్ కరీముల్లాఖాన్ హుకూంను భిక్షం  నాయకత్వంలో విద్యార్థులంతా సంఘటితమై బహిష్కరించడం పత్రికల  పతాకశీర్షికలకెక్కి నిజాం సంస్థానం అంతటా సంచలనం సృష్టించింది.  విద్యార్థినాయకుడు భిక్షంపై నిజాం ప్రభుత్వం అప్పటి నుంచే 'నిఘా'  పెట్టింది. నల్గొండలో హైస్కూల్ చదువుకెళ్ళిన భిక్షం అక్కడ కూడా హాస్టల్ను  నెలకొల్పి, వందేమాతరం ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించారు. నల్గగొండ  జిల్లాలో తొలి విద్యార్థినాయకుడుగా గణతికెక్కారు.
హైదరాబాద్ నగర  కొత్వాల్చే 'ధర్మ' బిరుదు ప్రదానం : బొమ్మగాని భిక్షం తన స్నేహితుడు రౌతు  జనార్ధన్రావు (హైదరాబాద్లో విద్యార్థిగాఉన్న తరుణంలో) తండ్రి ఊళ్ళో  హత్యకు గురయ్యారన్న వార్తను తెలియజేసేందుకు భిక్షం హైదరాబాద్కు వెళ్ళిన  సందర్భంగా రెడ్డిహాస్టల్ను సందర్శించారు. అది విద్యార్థులను  దేశస్వాతంత్య్రం కోసం పోరాడే దేశభక్తులుగా, క్రీడాకారులుగా,  చైతన్యవంతులుగానూ తీర్చిదిద్దే కేంద్రంగా దర్శనమిచ్చింది. దీంతో  చిన్నవయసైనప్పటికీ సూర్యాపేటలో వెంపటి బుచ్చయ్య ఇంట్లో హాస్టల్ను  ప్రారంభించారు. హాస్టల్ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన  హైదరాబాద్నగర కొత్వాల్ (పోలీస్ కమిషనర్) రాజ బహద్దూర్  వెంకట్రామారెడ్డి తన ఉపన్యాసంలో 'ఈ హాస్టల్ విద్యార్థులను కేవలం  ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న హాస్టల్ మాత్రమే కాదు. దేశానికి  వన్నెతెచ్చే యువకులను సృష్టిస్టోందన్నారు.' ఒక చేత్తో దానమడుగుతూ రెండో  చేత్తో ధర్మం చేస్తోన్న వ్యక్తి భిక్షం ఎలా అనబడతాడు ఆయన ఇకనుంచి  'ధర్మభిక్షం'గా పిలవబడతాడు అని సభాముఖంగా బిరుదునిచ్చారు. ఆ నామమే నేడు  ప్రజల నోట తారకమంత్రమయ్యింది.
ప్రజాప్రతినిధిగా 'ధర్మబిక్షం'  అఖండవిజయం : సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్ మొదలు పార్లమెంట్సభ్యుడి  వరకూ ధర్మభిక్షం విజయయాత్రలో ప్రతీ ఎన్నిక ఒక విశిష్టతతో కూడిన రికార్డును  నమోదు చేసి చరిత్రపుటల్లో కెక్కింది. ఆయనను 'ప్రజలమనిషి'గా ప్రజల  హృదయసీమలపై ప్రతిష్ఠింప జేసింది. ఆయన ఎన్నికల్లో పోటీచేసినప్పుడల్లా  జిల్లాలోని లక్షలాది జనం ఆయన గెలుపువార్త వినేందుకు తహతహలాడుతూ రేడియో  వార్తలు వినేందుకు చెవులురిక్కించేవి. హైదరాబాద్ సంస్థానంలో  రాజరికవ్యవస్థకు చరమగీతం పాడబడి, 1952లో హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీకి  జనరల్ ఎన్నికలు జరిగాయి. దేశానికి స్వాతంత్య్రం తామే తెచ్చామని  కమ్యూనిష్టులకు డిపాజిట్దక్కకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ధనబలం,  అంగబలంతో సర్వశక్తులు ఒడ్డినా ధర్మభిక్షం నాయకత్వంలో ఎన్నికల రణరంగంలోకి  దిగిన పి.డి.ఎఫ్ అభ్యర్థు లంతా అధికసంఖ్యలో గెలుపొంది జిల్లాలో విజయఢంకా  మోగించారు. భారీ మెజార్టీ రికార్డుతో సూర్యాపేట శాసనసభ్యులుగా ధర్మభిక్షం  అసెంబ్లీలో అడుగు పెట్టడం జిల్లా అంతటా పెద్ద చర్చనీయాంశమైంది. 1957లో  నూతనంగా ఆవిర్భవించిన నకిరేకల్ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఘనవిజయం  సాధించారు. 1962లో నల్లగొండ అసెంబ్లీకి సి.పి.ఐ. శాసనసభ్యుడిగా ఎన్నిక  య్యారు. నల్లగొండ జిల్లాలో మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాలనుంచి  ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన రికార్డు ఆయనకే దక్కింది. 1991లో  10వ లోక్సభకు జరిగిన ఎన్నికలో ఆయన సి.పి.ఐ తరపున నల్లగొండ లోక్సభ  నియోజకవర్గంలో సుమారు 68 వేలఓట్లతో విజయం సాధించారు. దక్షిణభారతదేశం నుంచి  గెలిచిన ఏకైక సిపిఐ ఎంపిగా ధర్మబిక్షం లోక్సభలో తనవాణిని విన్పించారు.  1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో కూడా తిరిగి ఆయన సిపిఐ అభ్యర్ధిగా  రంగంలోకి దిగి మరోసారి విజయదుందుభి మోగించారు. 484 మంది అభ్యర్ధులు నల్గొండ  లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. లోక్సభ చరిత్రలోనే తొలిసారి ఎన్నికల  సంఘానికి ఎదురైన ఈ అనుభవంతో ప్రత్యేకంగా తయారుచేయించిన న్యూస్ పేపర్సైజ్  బ్యాలట్ పేపర్, డ్రమ్ము సైజ్ బ్యాలట్ బాక్స్లు ఏర్పాటుచేసి ఎన్నికలు  నిర్వహించింది. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఎన్నికలో ధర్మబిక్షం  76 వేల ఓట్లతో ఘనవిజయం సాధించి పార్లమెంట్ చరిత్ర పుటల్లో  విశిష్టస్థానాన్ని సంపాదించడం జాతీయ మీడియాలో పతాకస్థాయి  వార్తల్లోకెక్కింది. నల్లగొండ జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యలపై ఆయన  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై పార్లమెంట్సభ్యులుగా ఒత్తిడితెచ్చి  సాధించడంలో కృతకృత్యులయ్యారు. ప్రభుత్వం నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల  పరిధిలో రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్ రేంజిను ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన  సందర్భంలో పార్లమెంట్లో ఆ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రతిబింబి ంపజేసి ఆ  ప్రయత్నాన్ని విరమింపజేశారు. ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నల్లగొండ,  రంగారెడ్డి, హైదరాబాద్లకు రక్షితనీటి పథకాలపై ఎంపీగా పార్లమెంట్లో  తీవ్రస్థాయిలో గళమెత్తారు. పోచంపల్లిలో ప్రతిపాదించబడిన గ్రామీణ  విశ్వవిద్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాన్ని ఆయన తీవ్రంగా  ప్రతిఘటించారు. ధర్మబిక్షం సహచర శాసనసభ్యుడైన కీ.శే. మాజీ ప్రధాని  పివి.నర్సింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ ధర్మబిక్షం సలహాలు, సూచనలూ  చట్టసభల్లో చట్టాలు రూపకల్పన చేసే తరుణంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని  పేర్కొనడం ఆయన సమర్థతకు గీటురాయి.
ముఖ్యమంత్రి సంతాపం:  తెలంగాణసాయుధ పోరాటయోధుడు, ప్రముఖ సిపిఐ నేత,మాజీ ఎంపి బొమ్మగాని  ధర్మబిక్షం(89) మృతి పట్ల ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి విచారం  వ్యక్తం చేశారు. ధర్మబిక్షం అనేక పోరాటాల్లో పాల్గొని ప్రజల ఆకాంక్షలకు  అనుగుణంగా సేవలందించారని, హైదరాబాద్ శాసనసభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో  సభ్యునిగానేగాక రెండు పర్యాయాలు నల్గొండ ఎంపిగా విశేష సేవలందించారని  ముఖ్యమంత్రి కొనియాడారు. ధర్మబిక్షం కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ  సానుభూతిని తెలియజేశారు. పేద ప్రజల కోసం తన జీవితాంతం పోరాటమే ఊపిరిగా  జీవించిన పేదల పెన్నిది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు  బొమ్మగాని ధర్మబిక్షం ఆకాల మరణం పట్ల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  డి.శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు,  లోక్సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షులు కెసిఆర్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, సిపిఎం  రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి.రాఘవులు, నల్లగొండ ఎంపి గుత్తా  సుఖేందర్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఐజెయు సెక్రటరీ జనరల్  కె.శ్రీనివాస్రెడ్డి, ఎపియుడబ్ల్యుజె అధ్యక్షులు డి.సోమసుందర్, ప్రధాన  కార్యదర్శి వై.నరేందర్రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కరుణాకర్రెడ్డి,  దైవాదీనం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు ఎం.సోమయ్య,  కన్వీనర్ కప్పర ప్రసాద్ వేర్వేరు ప్రకటనల్లో తమ ప్రగాఢ సంతాపాన్ని  వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
సిపిఐ  జాతీయ, రాష్ట్ర సమితుల సంతాపం: తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్ర  సమరయోధులు బొమ్మగాని ధర్మబిక్షం మృతిపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ ఉప  ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి  డాక్టర్ కె. నారాయణ సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని  తెలిపారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు, జాగీర్దార్లకు  వ్యతిరేకంగా, వెట్టి చాకిరి నిర్మూలించబడాలని, తెలంగాణా సాయుధ పోరాటంలో  ప్రముఖ పాత్ర నిర్వహించిన ధర్మబిక్షం పోరాట పటిమను సిపిఐ జాతీయ, రాష్ట్ర  సమితులు శ్లాఘించాయి. ఘనంగా జోహార్లు అర్పించాయి. ఆనాటి నుండి ఈనాటి వరకు  గీత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో, గీత వృతి పరిరక్షణలో అనేక  సమరశీల పోరాటాలను ధర్మబిక్షం నిర్వహించారు. వేలాది మంది గీత కార్మికులను  సమీకరించి, పోరాటాలు నిర్వహించిన యోధులు ధర్మబిక్షం అని. పార్లమెంటు  సభ్యునిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పార్లమెంటు లోపల, బయట అనేక పోరాటాలు  నిర్వహిచారని, ప్రత్యేకించి నల్లగొండ జిల్లాలో ఆయన నిర్వహించిన పోరాటాల  ఫలితంగా ఆయన గుర్తు పట్టని వారెవ్వరూ లేరని సిపిఐ జాతీయ ఉప ప్రధాన  కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ నుండి రెండు సార్లు  పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావటమేగాక, ఆ జిల్లాలోని మూడు వేర్వేరు  అసెంబ్లీ నియోజకవర్గాల నుండి శాసనసభ్యునిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన  ఘనత బొమ్మగాని ధర్మబిక్షందేనని సుధాకరరెడ్డి, నారాయణ పేర్కొన్నారు.
అరుణ పతాక అవనతం: ధర్మబిక్షం మృతికి సంతాప సూచికంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయంపై ఉన్న అరుణ పతాకాన్ని అవనతం చేశారు.
ప్రముఖుల  నివాళి: ధర్మబిక్షం మృతి వార్త తెలిసిన వెంటనే సిపిఐ జాతీయ కార్యవర్గ  సభ్యులు-ఎంఎల్సి పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ  సభ్యులు కె. రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, వి. రాంనరసింహారావు, శాసనసభ్యులు  కూనంనేని సాంబశివరావు, యాదగిరిరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్  రెడ్డి ,నాయకులు బండారు దత్తాత్రేయ, ఎన్. ఇంద్రసేనా రెడ్డి, ఎమ్మెల్సీ  చుక్కా రామయ్య, మాజీ ఎం.ఎల్.ఎ.రమావత్ రవీంద్రకుమార్, సిపిఐ (యం) నాయకులు  నోముల నర్సింహయ్య, ఐజెయు సెక్రటరి జనరల్ కె. శ్రీనివాస్రెడ్డి, సిపిఐ  నాయకులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి యం.  ఆదిరెడ్డి, హైదరాబాద్ నగర కార్యదర్శి వి.ఎస్.బోస్ ఎస్టియు నాయకురాలు  కమలారెడ్డి, హైదరాబాద్ నగర నాయకులు దేవయ్య, రవీంద్రాచారి, ప్రవీణ్గౌడ్,  సూర్యాపేట మాజీ మునిసి పల్ ఛైర్మన్ సత్యనారాయణ ప్రభృతులు ఎల్బినగర్  కామినేని హాస్పటల్కు వెళ్ళి భౌతికకాయాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛాలుంచి  నివాళులు అర్పించారు.
పలువురి సంతాపం : ధర్మభిక్షం మృతిపట్ల  బికెఎంయు వర్కింగ్ ప్రసిడెంట్, సి.పి.ఐ. శాసనసభా పక్ష నాయకులు  జి.మల్లేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు  సిద్ధి వెంకటేశ్వర్లు, జల్లి విల్సన్, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు  కొల్లి నాగేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ  శ్రమజీవులైన గీత కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన  పోరాటాలు, కృషి మరువలేనిదన్నారు. సి.పి.ఐ. రాజ్యసభ సభ్యులు సయ్యద్  అజీజ్పాషా, మాజీ శాసనసభ్యుల ఫోరం కన్వీనర్ కె. సుబ్బరాజు, ఆంధ్రప్రదేశ్  ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు పులి  సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మ, నాయకులు గని, ఎఐవైఎఫ్  రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ పత్తిరైతుల సంక్షేమ  సంఘం అధ్యక్షులు గుర్రం యాదగిరిరెడ్డి, శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర ప్రధాన  కార్యదర్శి కడారు ప్రభాకరరావు, ఏపి చేతివృత్తిదారుల సమాఖ్య అధ్యక్షులు టి.  వెంకట్రాములు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మడత కాళిదాస్,  మహిళా సమాఖ్య నాయకులు చండ్ర రాజకుమారి, అఖిలభారత అభ్యుదయ రచయతల సంఘం  అధ్యక్షవర్గ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు పెనుగొండ  లక్ష్మీనారాయణ, వరంగల్ జిల్లా కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస రావు,  సహాయ కార్యదర్శి టి. సత్యం, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, సి.పి.ఐ.  పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి నెక్కంటి సుబ్బారావు, ఇందుకూరి  సుబ్బరాజు, సి.పి.ఐ. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎన్. బాలమల్లేష్,  సి..పి.ఐ. జాతీయ సమితి సభ్యురాలు పశ్య పద్మ, ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర  అధ్యక్షులు బి. ఆంజనేయులు, కార్యదర్శి లెనిన్బాబు తదితరులు ధర్మభిక్షం  మృతికి సంతాపం తెలియజేసిన వారిలో వున్నారు.