చట్టాన్ని అమలు పరచేందుకు 15 ఏళ్ళు చాలదా: సుప్రీం కోర్టు

కార్మికలోకం
వి.వి.ఎస్‌.మూర్తి
భవన తదితర నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమ బద్ధీకరణ చట్టాలను అమలు పరచడంలో రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలవైఫల్యాల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టు మార్చి 15న సంబంధిత అధికారులకు నోటీసులు పంపించింది. వారికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌ ఎందుకు చేపట్టకూడదో తెలియజేయమని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్‌ కపాడియా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆ అధికారులను తదుపరి విచారణ రోజున కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై, చట్టాన్ని అమలు జరపడంలో వారి వైఫల్యాలకు గల కారణాలను వివరించుకోవాలని తెలియజేసింది.
సుప్రీం కోర్టు- ఉత్తర ప్రదేశ్‌, జమ్మూ-కాశ్మీర్‌, అస్సాం తదితర రాష్ట్రాల కేసును ప్రస్తావిస్తోంది. అక్కడి ప్రభుత్వాలు భవన తదితర నిర్మాణ కార్మికుల (ఉపాధి క్రమబద్దీకరణ, సర్వీసు నిబంధనల) చట్టం, 1996ను అమలు జరపడంలో విఫలమయ్యాయి.
అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కోర్టు ధిక్కారణ కింద ఎందుకు చర్య తీసుకో కూడ కారణం చూపమని కోరుతూ వారికి నోటీసులు పం పించడం తప్ప కోర్టు ముందు మరో మార్గం లేదని తేల్చిచెప్పింది.
దేశ సర్వోన్నతన్యాయస్థానం పైన పేర్కొన్న చట్టం అమలుకు సంబంధించి జారీ చేసిన వివిధ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, వారి చట్టబద్ధమైన విధులను నెరవేర్చడంలో విఫలమైనాయని పేర్కొంది.
భవన, నిర్మాణ కార్మికుల చట్టాన్ని అమలు పర చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వాజ్యం (పిఐఎల్‌-పిల్‌) పై విచారణ జరుగుతోంది.
ఈ ఫిర్యాదును ఎన్‌జివో నిర్మాణ కార్మికుల జాతీయ ప్రచారోద్యమ కమిటీ ఫైల్‌ చేసింది. మహారాష్ట్ర, గోవా నాగాలాండ్‌, ఛత్తీస్‌ఘర్‌తో సహా అనేక రాష్ట్రాలు చట్టాన్ని అమలు పరచడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తోంది. ఈ చట్టం అసంఘటిత నిర్మాణ కార్మికులను క్రమబద్ధీక రించేందుకు ఉద్దేశించబడింది.
ఈ చట్ట ప్రకారం ఆయా ప్రభుత్వాలు రిజిస్టరింగ్‌ అధికారులను నియమించాలి, ప్రతి యజమాని తమ సంస్థను రిజిస్టర్‌ చేయాల్సి ఉంది.
ఈ చట్ట ప్రకారం నిర్మాణ కార్మికులకు వివిధ ప్రయోజనాలు సమకూర్చాలి. కార్మికులు ఈ ప్రయోజ నాలను పొందేందుకు ప్రతీ రాష్ట్రం, రాష్ట్ర సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈ బోర్డుకు చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నామినేట్‌ చేసిన వ్యక్తి ఉండగా, ఇతర సభ్యులుగా 15 మందికి మించకుండా రాష్ట్ర ప్రభు త్వం నియమించాల్సి ఉంది.
చట్ట ప్రకారం, సంక్షేమ బోర్డుల నేర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చేందుకు అధికారం కలిగిన కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని వినియోగించుకోక పోవడం పట్ల సర్వోన్నతన్యాయస్థానం ఆందోళనను వ్యక్తం చేసింది. ఇది సెస్‌ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని కార్మిక ప్రయోజనాల కోసం వెచ్చించేందుకు అవ రోధంగా ఉందని కోర్టు పేర్కొంది. భవన తదితర నిర్మాణ కార్మికుల చట్టంలోని సెక్షన్‌ 60 కింద రాష్ట్రాలు బోర్డులనేర్పాటు చేయడంపై ప్రాథమిక చర్యలు కూడా కేంద్రం తీసుకోలేదని ఇంతకుముందు జరిగిన కేస్‌ హియరింగ్‌లలో (విచారణలలో) కోర్టు వ్యాఖ్యానించింది.
ఎన్‌జివోకు పిటీషనర్‌గా హాజరౌతున్న సీనియర్‌ అడ్వకేట్‌ కాలిన్‌ గొంజాల్వెజ్‌ తమిళనాడు, కేరళలు తప్ప ఇతర రాష్ట్రాలన్నీ చట్టాలను అమలు జరపడంలో విఫలమయ్యాయని చెబుతున్నారు.
చట్టాలు చేసి 15 ఏళ్ళు గడుస్తున్నా, ఇటు కేంద్రం గాని, అటు రాష్ట్ర ప్రభుత్వాలుగాని, వాటిని అమలు జరిపిన దాఖలాలు లేవని పిఐఎల్‌ ఆరోపిస్తోంది.