గమనిస్తున్నారా? పలు ప్రభుత్వ విభాగాలకు ఉన్నట్టుండి చురుకు పుట్టింది. 'అసంభవం' అనుకున్నవి అనేకం జరిగాయి. ఉదాహరణలు చెప్పాలా!
'వందలమంది ఎంపీల మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే, నా మీదా ఉన్నాయి. నేను మాత్రం  ఎందుకు దిగి పోవాలి?'... అని బల్లగుద్ది వాదించిన సీవీసీ థామస్  ఒక్కదెబ్బతో రాజీనామా చేశారు. 
'నేను తప్పు చేయలేదు. రాజీనామా చేసేది లేదు' అంటూ 'సెల్లు' కబుర్లు చెప్పిన  డీఎంకే నేత ఎ.రాజా చివరికి టెలికం మంత్రి పదవిని వదులుకున్నారు.
వేలకోట్ల నల్లధనం కేసులో చోద్యం చూస్తూ కూర్చున్న సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పరుగులు తీసి మరీ హసన్ అలీని అరెస్టు చేశారు. 
వీటన్నింటికీ ఒకే కారణం! అది... భారత సర్వోన్నత న్యాయస్థానం! ఇంకొంచెం  నిర్దిష్టంగా చెప్పాలంటే... భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  ఎస్.హెచ్.కపాడియా. గత ఏడాది మే 12న ఆయన ఈ పదవి చేపట్టారు. ఆ రోజు నుంచే...  అన్ని వ్యవస్థలకు చురుకు పుట్టిస్తున్నారు. ప్రభుత్వాలు ఎంతమాత్రం  జీర్ణించుకోలేని, సహించలేని 'న్యాయ వ్యవస్థ క్రియాశీలత'కు ఆయన మళ్లీ  తలుపులు తెరిచారు. అదికూడా... మరెవరూ ప్రశ్నించలేనంత సమర్థంగా! 
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణన్ హయాంలో సుప్రీంకోర్టుకు  పట్టిన మరకలు, కర్ణాటక మాజీ ప్రధాన న్యాయమూర్తి దినకరన్ దెబ్బతో మొత్తం  న్యాయ వ్యవస్థకు పట్టిన మసకలు... జస్టిస్ కపాడియా వచ్చాక తొలగిపోతున్నాయి.  'ఆయన వచ్చాక పరిస్థితి మారిపోయింది. సుప్రీంకోర్టు పనితీరూ మారిపోయింది'  అని సీనియర్ న్యాయవాదులు స్వయంగా చెబుతున్నారు. 
జస్టిస్ కపాడియా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సహా సీబీఐ,  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ వంటి ప్రతిష్ఠాత్మక  సంస్థలపై పడిన అక్షింతలకు లెక్కేలేదు. సుప్రీంకోర్టు ఆ స్థాయిలో  ప్రతిస్పందించడం వల్లే అనుకోని సంఘటనలెన్నో జరిగాయి. కీలక కేసుల్లో సుప్రీం  చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 
ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయాలంటే... న్యాయమూర్తి వద్ద సత్తా ఉండాలి.  వేలెత్తి చూపలేని వ్యక్తిత్వం ఆయన సొంతం కావాలి. జస్టిస్ కపాడియా  ఆస్తిపాస్తులన్నీ... అవే! "నాకు ఉన్న ఏకైక ఆస్తి... వ్యక్తిత్వమే'' అని  జస్టిస్ కపాడియా సగర్వంగా చెప్పుకొంటారు. ఆఫీస్ బాయ్గా సీనియర్ న్యాయవాదుల  ఫైళ్లను మోసిన జస్టిస్ కపాడియా... ఇప్పుడు న్యాయ వ్యవస్థలోనే అత్యున్నత  స్థానానికి ఎదగడానికి ఆయన పట్టుదలేకాదు... వ్యక్తిత్వమూ దోహద పడింది.
ఆర్డర్... ఆర్డర్
అన్ని వ్యవస్థలపై వ్యాఖ్యలు చేస్తూ, తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ  స్వచ్ఛంగా ఉండాలన్నది జస్టిస్ కపాడియా అభిప్రాయం. కానీ... ఈ వ్యవస్థలోనూ  లోపాలు ఉన్నాయని ఆయన నిర్భయంగా అంగీకరించారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే వ్యవస్థను 'ఆర్డర్'లో  పెట్టే పని ప్రారంభించారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ హయాంలో మూడేళ్లపాటు  నడిచిన పద్ధతులకు స్వస్తి పలికారు. 
కేసులను విచారణకు చేపట్టాల్సిందిగా మౌఖికంగా కోరడం కుదరదని తేల్చిచెప్పారు.  "ఓరల్ మెన్షనింగ్ను అనుమతించేది లేదు. కేసులు సంబంధిత విభాగం ద్వారానే  రావాలి'' అని తెలిపారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (పిల్స్) ప్రాధాన్యం  ఇస్తూనే... ఆషామాషీగా పిల్స్ వేస్తే సహించేది లేదని తొలి రోజునే  హెచ్చరించారు. పిల్ విచారణార్హమైనదని భావిస్తే మాత్రం... అది ఎవరిదైనా,  ఎవరిపైనైనా సరే స్వీకరిస్తారు. 
దీనికి... జస్టిస్ బాలకృష్ణన్పై అందిన వ్యాజ్యమే ఉదాహరణ. 'న్యాయ వ్యవస్థ  లోపాలకు అతీతం కాదు' అంటూ ఈ పిల్ను విచారణ చేపట్టారు. జస్టిస్ కపాడియా బడా  వ్యవస్థలు, బడా బాబులపై ఎంత నిక్కచ్చిగా ఉంటారో... సామాన్యుల విషయంలో అంతే  మానవత్వం ప్రదర్శించే న్యాయమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. 
"కేసు ఏదైనా సరే! కార్మికులు ఉద్యోగం కోల్పోకూడదు'' అంటూ కార్మికులకు  సంబంధించిన కేసులపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించారు. జస్టిస్ కపాడియా  నేతృత్వంలో సుప్రీం వెలువరించే తీర్పులపై కేంద్ర ప్రభుత్వం కూడా  శిరసావహిస్తోంది. విపక్షాలు, మీడియా ఎంత గగ్గోలు చేసినా పట్టించుకోని  ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం థామస్ విషయంలో తప్పు చేశానని అంగీకరించాల్సి  వచ్చింది. దటీజ్... జస్టిస్ కపాడియా! 
ఆయన వచ్చాక...
జస్టిస్ కపాడియా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన  తర్వాత వెలువడిన సంచలన తీర్పులు, చోటు చేసుకున్న పరిణామాలు...
*   2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలు, ఆదేశాల వల్లే  ఇందులోని విషయాలన్నీ ఒకొక్కటిగా బయటపడ్డాయి. సీబీఐ దర్యాప్తు గాడిన  పడింది. రాజా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో  సుప్రీంకోర్టు ప్రధానిని కూడా వదల్లేదు. 'ఏమిటీ మౌనం! బదులివ్వండి' అంటూ  ప్రధానిని ఆదేశించింది. 
*  సీవీసీగా థామస్ నియామకం చెల్లదని జస్టిస్ కపాడియా తేల్చిచెప్పారు. దీంతో థామస్ రాజీనామా చేయక తప్పలేదు. 
* హసన్ అలీఖాన్ కేసులో సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను పరుగులు తీయించింది. 
*  అత్యాచారానికి గురైన మానసిక వికలాంగులు కూడా పిల్లల్ని కనొచ్చని సుప్రీం చెప్పింది. 
* నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ వంటి సత్యశోధన పరీక్షలను నిందితుడు అంగీకరిస్తేనే చేయాలని ఆదేశించింది. 
* కేంద్ర ప్రభుత్వ విధానాలు, సిద్ధాంతాలతో విభేదించారనే నెపంతో గవర్నర్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది. 
*  తాజాగా... కారుణ్య హత్యలకు ససేమిరా అంటూనే, కొ న్ని నిర్దిష్ట  మార్గదర్శకాలకు లోబడి ప్రాణాధార వ్యవస్థలను స్తంభింప చేయడంద్వారా బాధితులకు  'విముక్తి' కల్పించవచ్చని తెలిపింది. జూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిపై కేసులు పెట్టడం తగదని పేర్కొంది.  'వారికి సాయం చేయాలి. శిక్షించొద్దు' అని తెలిపింది.  గౌరవనీయులైన కృష్ణయ్యర్గారికి
నేను సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాను. నాలుగో తరగతి ఉద్యోగిగా జీవితం  ప్రారంభించాను. నా ఏకైక ఆస్తి... నాకున్న వ్యక్తిత్వమే. సుప్రీంకోర్టు  న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ... తీర్పులు చెప్పే సమయంలో పీడితులు, గిరిజనులు,  కార్మికుల సంక్షేమానికి దోహదపడే పరిజ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించాను.  ప్రధాన న్యాయమూర్తిగా రాజ్యాంగం నాకు అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగలననే  నమ్మకం ఉంది.
- తనకు అభినందన సందేశం పంపిన జస్టిస్ కృష్ణయ్యర్కు జస్టిస్ కపాడియా రాసిన లేఖ
ఇదీ ప్రస్థానం...
జస్టిస్ సరోష్ హోమీ కపాడియా గుజరాత్కు చెందిన పార్సీ కుటుంబంలో  జన్మించారు. ఆయన తండ్రి గుమాస్తా. తల్లి గృహిణి. కుటుంబానికి ఆర్థికంగా  సహకరించేందుకు, తమ్ముడి చదువుల కోసం కపాడియా తన చదువులను త్యాగం చేశారు.  బెహ్రామ్జీ జీజీభాయ్ న్యాయవాద కార్యాలయంలో బాయ్గా చేరారు. లాయర్ల ఫైళ్లు  మోయడం, వాళ్లు చెప్పిన పనులు చేయడం ఆయన బాధ్యతలు. ఆ తర్వాత న్యాయవాది  అయ్యారు. 
 1974లో ఇన్కమ్ ట్యాక్స్ తరఫు న్యాయవాది అయ్యారు. 1991లో బొంబాయి హైకోర్టు  అదనపు జడ్జిగా నియమితులయ్యారు. రెండేళ్లలోనే ఆయన పర్మినెంట్ జడ్జి అయ్యారు.  పర్యావరణం, బ్యాంకింగ్, పరిశ్రమలు, పన్నులకు సంబంధించిన కేసులను  చేపట్టారు. 1999లో కేతన్ ఫరేఖ్ కేసులో విచారణ జరిపింది ఆయనే. 2003 ఆగస్టు  5న కపాడియా ఉత్తరాంచల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లారు. అదే  సంవత్సరం డిసెంబర్లో సుప్రీం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 మే 12వ  తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో పొందుపరిచినము