దళితులు, గిరిజనులు,

దళితులు, గిరిజనులు, పట్టణ పేదలు, కార్మికులు, కౌలు రైతుల సమస్యలపై గురువారం నుండి సిపిఎం సమరభేరీ మోగించనుంది. ఈ తరగతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు, లోక్‌సభ మాజీ సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు నిరవధిక నిరాహారదీక్షను చేపడుతున్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం ఉదయం 11.30 గంటలకు ఈ దీక్షను ప్రారంభిస్తారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ప్రజా సమస్యలకు అటు శాసనసభలోను, ఇటు బయటా ప్రాధాన్యతలేకుండా పోయిన సంగతి తెలిసిందే. రాజకీయ కారణాలు, తన సొంత కారణాలను చెప్పి ప్రభుత్వం వీటిని పరిష్కరించకుండా తప్పించుకుంటోంది. ఇదే సమయంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు సైతం ఈ సమస్యల్ని ద్వితీయ శ్రేణికి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల్ని మళ్లీ రాజకీయ అజెండాలోకి తీసుకొచ్చేందుకు సిపిఎం ఈ దీక్షలను చేపడుతోంది. ఎస్సీ, ఎస్టీ, పట్టణ పేదల సమస్యలపై ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విడివిడిగా ఆందోళనలు జరిగాయి. ఇదే సమయంలో కెవిపిఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన జిల్లాల్లో సైకిల్‌ యాత్రలు జరిగాయి.

వాడవాడలా తిరిగి ప్రచారం నిర్వహించారు. తద్వారా ఆయా సమస్యలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లటమే కాకుండా నిర్ధిష్టమైన డిమాండ్లతో కోర్కెల పత్రాన్ని రూపొందించారు. నల్లగొండ జిల్లాలో ఫిబ్రవరి 18 నుండి 28 వరకు రెండు జాతాలు 2,250 దళితవాడలు, 810 గిరిజన తండాల్లో పర్యటించాయి. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో కలెక్టరేట్‌ను 48 గంటలపాటు దాదాపు 5 వేల మంది దిగ్బంధించి వంటవార్పు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో జిల్లా కెవిపిఎస్‌ గౌరవాధ్యక్షులు తమ్మినేని వీరభద్రం జనవరి 20న సైకిల్‌ యాత్రను ప్రారంభించారు. ఏప్రిల్‌ 5 వరకు ఇది కొనసాగుతుంది. జిల్లాలోని దళితవాడలన్నింటినీ కవర్‌ చేస్తూ ఈ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఈ యాత్ర 58 రోజులు పూర్తి చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంతెన సీతారాం 19 రోజులపాటు సైకిల్‌ యాత్రలు నిర్వహించారు. 250 దళితవాడలు, 6 పట్టణ ప్రాంతాల్లో ఆయన సైకిల్‌ యాత్రలు నిర్వహించారు. దీక్షను ప్రారంభించటానికి ముందు పదిహేను రోజుల నుండే ఈ కోర్కెల పత్రాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రితోపాటు సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రులకు, ఆయా శాఖల కార్యదర్శులకు కోర్కెల పత్రాలను అందజేశారు. మరోవైపు శాసనసభలో ఈ అంశాలను ప్రస్తావించాలని, దీక్షకు మద్దతు తెలియజేయాలని కోరుతూ టిడిపి, సిపిఐ, పిఆర్పీ, లోక్‌సత్తా, టిఆర్‌ఎస్‌, ఎంఐఎం శాసనసభపక్ష నేతలకు వినతిపత్రాలు సమర్పించారు.

మరోవైపు దీక్షకు సంఘీభావం తెలపాలని కోరుతూ సిపిఐ ఎంఎల్‌-న్యూ డెమోక్రసీ, సిపిఐ (ఎంఎల్‌) ఎంసిపిఐ(యు), ఆరెస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ఎస్‌యుసిఐ, సిపిఐ (ఎంఎల్‌-రామన్నగౌడ్‌) పార్టీలకు, వివిధ పార్టీలకు చెందిన ప్రజా సంఘాలు, దళిత, గిరిజన సంఘాలకు లేఖలు రాశారు. సిపిఎం డిమాండ్‌ చేస్తున్న ప్రధానాంశాలు..... ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల విధానాన్ని ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాను అమలుకు నోడల్‌ ఏజన్సీ జి.ఓ నెం.117 అమలును సమీక్షించాలి. దళిత, గిరిజన ఆవాసాల అభివృద్దికి ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలి. అటవీ హక్కుల చట్టం అమలును తిరిగి ప్రారంభించాలి. తిరస్కరించిన దరఖాస్తుల రీసర్వేకు ఆదేశించాలి. కొత్తగా వ్యక్తిగత దరఖాస్తులకు గడువు ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు చైర్మన్‌ను, సభ్యులను నియమించాలి. మహిళా కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలి. వృత్తిదారుల పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి. ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు థర్డ్‌పార్టీ, గౌరవ వేతన కంటింజెంట్‌ తాత్కాలిక ఉద్యోగులందరికీ జీవోనెం.3ను అమలు చేయాలి. భూ కమిటి (కోనేరు రంగారావు కమిటీ) నివేదిక సిఫార్సులపై ఇచ్చిన జీవోనెం.1049 అమలును సమీక్షించాలి. ఈ జీవో అమలుకు అధికారాలు గల ఎపెక్స్‌ కమిటీని నియమించాలి