'శతకోటి'

శతకోటి' ఘనులు
- సంపాదకీయం

ప్రపంచ సంపన్నులను లెక్కగట్టే ఫోర్బ్స్ వార్షిక జాబితాలో భారతీయ శతకోటీశ్వర్ల (బిలియనీర్లు) సంఖ్య ఏటికేటికీ పెరుగుతోంది. ఆ జాబితాలో గత ఏడాది 49 మందికి స్థానం దక్కగా ఈసారి 55 మంది చోటు చేసుకోవడం విశేషం. మన రాష్ట్రం నుంచి జీఎమ్ఆర్, అంజిరెడ్డిలు కూడా ప్రపంచ శ్రేణి సంపన్నులుగా గుర్తింపు పొందారు. గత ఏడాదితో పోలిస్తే ప్రపంచ సంపన్నులు 2011లో రికార్డు స్థాయిలో 199 మంది అదనంగా పుట్టుకొచ్చారు.

74 బిలియన్ డాలర్ల సంపదతో మెక్సికో దేశపు టెలికాం దిగ్గజం కార్లోస్ స్లిమ్ ఈసారి కూడా ప్రపంచ సంపన్నుడుగా నిలిచారు. భారత సంతతికి చెందిన లక్ష్మీనివాస్ మిట్టల్ ఆరవ స్థానంలోను, ముకేశ్ అంబానీ 9 స్థానంలోను నిలిచారు. ఈ జాబితా ప్రకారం ప్రపంచ సంపద సృష్టి కేంద్రం అభివృద్ధి చెందిన అమెరికా, యూరోపు దేశాల నుంచి వర్థమాన ఆర్థిక వ్యవస్థలైన బ్రిక్ దేశాలకు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా దేశాలు) మళ్ళినట్లయింది. బ్రిక్ దేశాలలో శతకోటి డాలర్ల సంపన్నుల సంఖ్య పెద్దఎత్తున పెరగడమే అందుకు నిదర్శనం.

దాదాపు మూడే ళ్ళ నుంచి పీడిస్తున్న మహామాంద్యంతో ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయి, ప్రపంచదేశాల్లో దారిద్య్ర మహా సముద్రాలు ఏర్పడగా, మరోవైపు చిన్న చిన్న దీవుల్లా సంపన్నుల సంఖ్య ఎన్నడూ లేనంతగా పెరగడం ఆశ్చర్యమేమీ కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సంపదలు మేటవేసే కొద్దీ అనివార్యంగా, వాటికి అనులోమంగా దారిద్య్రం కూడా పెరుగుతుందని వారు చెబుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల తో సహా మొత్తం ప్రపంచంలో పెద్దఎత్తున నిరుద్యోగం, జీతాల కోత, నిత్యావసరాల ధరల పెరుగుదల, రికార్డుస్థాయిలో దివాళాలు, దేశాల, నగరాల ఖజానాలు దివాళా తీసి ప్రజా సంక్షేమం కుప్పకూలిపోవడంలాంటి మాంద్యపు చీకట్లలో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోపక్క పిడికెడు మంది ధనికస్వాములు (ప్లూటోక్రాట్స్) జాతి సంపదను దిగమింగి కోట్లకుకోట్లకు పడగలెత్తుతున్న పరిస్థితి విశ్వవ్యాప్త అంశంగా ముందుకొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా పేద, గొప్పల మధ్య అంతరాలు పూడ్చలేనంతగా పెరిగిపోయాయి. ఫోర్బ్స్ జాబితాలోని 1,210 మంది సంసన్నుల మొత్తం సంపద 4.5 లక్షల కోట్ల డాలర్లుగా అంచనా. ఇది అనేక అభివృద్ధి చెందిన దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువ. ప్రపంచంలో 300 కోట్ల మంది ప్రజలు రోజుకు 100 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. 57కోట్ల మంది జనాభా కలిగిన 41 రుణగ్రస్త దేశాల మొత్తం జీడీపీ ఫోర్బ్స్ జాబితాలోని ఏడుగురు సంపన్నుల సంపదకు సాటి రాకపోవడం ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అసమానతల తీవ్రతను తెలియజేస్తుంది.

ఫోర్బ్స్ జాబితాలోని భారతీయ సంపన్నుల మొత్తం ఆస్తి విలువ ఆరులక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా. ఇది మన జీడీపీలో 10వ వంతుగా ఉంది. అలాగే దేశ జనాభాలో దాదాపు 50కోట్ల మంది పైచిలుకు ప్రజలు రోజుకు 60 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకులీడుస్తున్నారు. దేశంలో సంపద అంతరాలు పెరిగిపోయి సమాజం పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

అభివృద్ధి అనేది వస్తూత్పత్తి పరిమాణంగా అంచనా వేసి, వృద్ధిరేటును దేశాభివృద్ధికి కొలమానంగా ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆర్థికవృద్ధిరేటు ఉత్పాదతకత ను సూచిస్తుందే దాని ఫలాలు సామాన్యునికి ఏ మేరకు లభిస్తున్నాయో వివరించదు. జీడీపీలో ధనికుల, సామాన్యు ల వాటాల మధ్య అంతరం రోజురోజకు వేగంగా పెరిగిపోతోంది. అభివృద్ధి అనేది వస్తూత్పత్తిలో కాకుండా, సమాజంలోని వ్యక్తుల అభివృద్ధి రూపంలో సాగకపోతే సామాజిక ఉత్పాతా లు తలెత్తుతాయని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ సూచించారు. కంప్యూటర్ విప్లవం తో ప్రపంచ ంలో సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగిపోయినా, తప్పుడు ఆర్థిక విధానాల పర్యవసానంగా ఆర్థిక మాంద్యపు చీకటిలోకి జారిపోవడం ఆయన అంచనాలకు సజీవ తార్కాణం.

వందల కోట్ల రూపాయల ఖరీదయిన ఆకాశహర్మ్యాలలో బతుకుతున్న ముకేశ్ అంబానీలాంటి సంపన్నులు ఒకవైపు, సురక్షితమైన తాగునీటికి నోచుకోక మురికివాడల్లో దుర్భరమైన జీవితాలు గ డుపుతున్న కోట్లమంది ప్రజలు మరోవైపు, ఇలా రెండు సమాంతర సమాజాలు ఉనికిలో ఉన్నాయి. సరైన కూడు, గూడు, గుడ్డకు నోచుకోక పెరిగిన నిత్యావసరాల ధరలతో ఆకలి చావులు, అర్ధాకలి, అనారోగ్యానికి గురై ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇలాంటి సంకట పరిస్థితుల్లో పుట్టిన రోజు కానుకగా ఒక కోటీశ్వరుడు ఖరీదైన విమానాన్ని భార్యకు బహూకరి స్తే, మరో కోటీశ్వరుడు విలాసవంతమైన నావను ఇవ్వడం సంచలనమే. అయితే ఈ విలాసా ల ప్రదర్శన దేశ ప్రజలకు ఎలాంటి సంకేతాలను పంపుతుందో సులభంగా ఊహించవచ్చు. ఈ నేపథ్యంలో సంపదను ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించి ప్రజల ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు కృషి చేయాలని, కార్పొరేట్ శక్తులు ప్రదర్శన తత్వానికి స్వస్తి పలకాలని మన ప్రధాని మన్మోహన్‌సింగ్ గంభీరమైన సూచన చేశారు. దేశం సాధిస్తున్న ప్రగతి ఫలాలు సామాన్యునికి కూడా అందాలని, అందుకు సమ్మిళిత ఆర్థిక విధానాన్ని చేపట్టాలని లేకపోతే సామాజిక అసంతృప్తి పెరిగి పలు ఉపద్రవాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావుల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచీకరణకు గురయింది. ప్రపంచంలో అప్పుడే దూసుకెళుతున్న సాఫ్ట్‌వేర్ విప్లవాన్ని అందుకునేందుకు మనదేశం ఆలస్యంగా స్పందించినా వేగంగా పోటీ పడింది. అదే సమయం లో ప్రపంచమార్కెట్‌లో సహజ వనరుల, ముడిసరుకులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది.

ఆ వాణిజ్యం వల్ల దేశంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దాంతో మూడున్నర దశాబ్దాలకు పైగా లైసెన్స్‌రాజ్ కాలంలో అణగారి, నిద్రాణమైన కార్పొరేట్ శక్తులు ఒకసారిగా వివృతమయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో భారతీయుల వాటా క్రమంగా పెరిగింది. కొత్త సంపన్నులు పుట్టుకొచ్చారు. అయితే ఈ సంపదలు దేశ, విదేశ కార్పొరేట్ శక్తుల, గనుల మాఫియాల, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మధ్యనే పంపిణీ అయ్యాయి.

ఆ క్రమంలో లక్షల కోట్ల రూపాయల స్కాంలు వెల్లువెత్తాయి. అధికారం, సంపదల కేంద్రీకరణలు సజావుగా సాగేందుకు అనుత్పాదక, జనరంజక సంక్షేమ పథకాలతో ప్రజలను బుజ్జగించే కార్యక్రమాలకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అది ఆర్థిక అస్థిరత్వానికి దారితీసింది. ప్రభు త్వం ప్రజా సంక్షేమ స్వభావాన్ని విడనాడి కార్పొరేట్ సీఈఓగా అవతారమెత్తింది. పెట్టుబడిదారులు సమాజ సంపదలకు ట్రస్టీలుగా వ్యవహరించాలన్న గాంధీ సూత్రాన్ని మన కార్పొరే ట్ వ్యవస్థ విస్మరించింది.

వస్తువ్యామోహం, విచ్చలవిడి వినిమయతత్వం, హోదా ప్రదర్శన మన కార్పొరేట్ శక్తుల్లో బాగా పెరిగిపోయింది. ఈ స్వభావం సామాజిక సంక్షోభానికి దారి తీసే అవకాశాలున్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సంపన్నుడు వారెన్ బఫెట్, బిల్‌గేట్స్‌లు చాలా సాదాసీదా జీవనం గడుపుతూ, తమ సంపాదనలో కొద్ది మొత్తాన్ని మాత్రమే తమ కుటుంబానికి అట్టిపెట్టి, అందులో అధిక భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకోసం ఖర్చుచేస్తున్నారు.

ఆనేక విషయాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకునే మన కార్పొరేట్ శక్తులు బఫెట్‌లాంటి వ్యక్తుల ఆదర్శాలను తీసుకోవడంలో తటపటాయిస్తున్నాయి. కార్పొరేట్ శక్తుల విలాసాల ప్రదర్శన మాట ఎలా ఉన్నప్పటికీ సంపద కేంద్రీకరణను పెంచి అసమానతలకు కారణమైన ఆశ్రిత పెట్టుబడీదారి ఆర్థిక విధానం మారడం కీలకం. ఆర్థికాభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ దక్కడంలోనే నిజమైన ప్రగతి ఉంది.andhra jyothi soujanyamutho