ఏబీసీడీ రానట్టే!
కోల్డ్ స్టోరేజీలోకి ఎస్సీ వర్గీకరణ
రాజ్యాంగ సవరణ యోచన విరమణ
రాష్ట్రాలతో సంప్రదింపులకు కేంద్రం నిర్ణయం!

ఇక ప్రతి రాష్ట్రంలో కమిషన్‌లు,అధ్యయనాలు తప్పనిసరి
అసెంబ్లీలూ తీర్మానాలు చేయాల్సిందే
రెండింట మూడొంతల రాష్ట్రాల అంగీకారం కావాలి
ఇదంతా జరగడం దాదాపు అసాధ్యం
ఓటు బ్యాంకు చేజారొద్దనే ఈ జాగ్రత్త !!
దళితుల్లో వెనుకబాటు గుర్తించండి
అభ్యున్నతికి చర్యలు చేపట్టండి
ఎస్సీ కమిషన్ తాజా యోజన
ఎస్సీ వర్గీకరణ అంశం అటకెక్కనుందా? ఇక 'ఏ, బీ, సీ, డీ'లు రానట్టేనా? ఎన్నాళ్లుగానో ఇదిగో అదిగో అంటున్న రాజ్యాంగ సవరణ కొండెక్కినట్టేనా? మొత్తం వర్గీకరణ ప్రక్రియే కోల్డ్ స్టోరేజీలోకి పోబోతోందా? ..కేంద్ర సామాజిక న్యాయ శాఖ తాజా వైఖరి చూస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.

హైదరాబాద్, మే 26 : ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ విషయంలో రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియకు తెర తీయాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్.. దళిత సమస్యలతో ఇకపై దాగుడుమూతలు ఆడరాదని, కొత్తగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోరాదన్న నిశ్చయించుకున్నట్టు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లను, అభిప్రాయ సేకరణ పేరిట, పూర్తిగా పక్కనపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయించినట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు వచ్చిన డిమాండ్లతో పాటు, కొత్తగా వచ్చే వాటిని సైతం రాష్ట్రాల మీదికే తోసేసి, చేతులు దులుపుకోవాలని అది భావిస్తోంది. ఇదే జరిగితే.. గడచిన మూడేళ్లుగా మాదిగలు, ఇతర ఎస్సీ ఉప కులాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు.. పూర్తిగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్ఆర్‌పీఎస్) పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చింది.

మాలలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం సుప్రీంకోర్టు మాలల పిటిషన్లను విచారించి, ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ కొట్టివేసింది. అనంతరం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాదిగల పోరాట ఫలితంగా.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఒత్తిడితో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

దాని నివేదిక అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన గడచిన మూడేళ్లుగా ఏ దశలోనూ కేంద్ర మంత్రివర్గం ముందు చర్చకు రాలేదు. కేంద్ర స్థాయిలో లోతైన చర్చ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరగలేదు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అనేక పర్యాయాలు ఆమరణ దీక్షలకు దిగారు. జాతీయ పార్టీల నేతలను కలిసి వర్గీకరణకు మద్దతుగా లేఖలు సంపాదించారు. వాటిని ప్రధానికి అందించారు. వీటిపైనా కేంద్రం స్పందించలేదు.

ఇకపై ఇలా..
కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా.. ఎస్సీ వర్గీకరణ అంశంపై సామాజిక న్యాయ శాఖ హఠాత్తుగా నిర్ణయం మార్చుకుందన్నది విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగలు.. ఇతర రాష్ట్రాల్లో పైచేయిగా ఉన్నారు. చమర్లుగా పిలిచే ఈ వర్గం వారు ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గంగాను, గణనీయమైన ఓటు బ్యాంకుగాను ఉన్నారు. ఈ వర్గానికి చెందిన బడా నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహానికి గురికాకుండా చూసుకునే లక్ష్యంతో.. వ్యవహారాన్ని తెర వెనక్కి పంపుతున్నారు.

సంప్రదింపులు అంటే..
ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు అంటే.. వర్గీకరణ డిమాండ్‌ను కనీసం మరో పదేళ్లపాటు కోల్డ్ స్టోరే జీలో పెట్టడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎస్సీ వ ర్గీకరణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నిచోట్లా వర్గీకరణ అమలు రద్దయింది. సామాజిక న్యాయ శాఖ తాజా నిర్ణయం ప్రకారం చూస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయా ప్రభుత్వాలు చర్చించాలి. అంటే వర్గీకరణ అవసరం ఉందా లేదా అనే అంశపై అధ్యయనం చేయించాలి.

అవసరమైతే కమిషన్‌లు ఏర్పాటు చేసి పరిశీలన జరిపించాలి. అంటే.. ప్రతీ రాష్ట్రానికి ఉషా మెహ్రా లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలన్న మాట! ఆ తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై తీర్మానం చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని దేశంలో మూడింట రెండొంతుల మెజారిటీతో అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అప్పుడు మాత్రమే కేంద్రం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజీ నుంచి బయటకు తీయగలదు.

ఒకవేళ.. ఎక్కువ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని తీర్మానం చేస్తే, వర్గీకరణ అంతే! పునియా మాట ఇదీ! ఇదంతా ఒక ఎత్తైతే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా కూడా ఎస్సీ వర్గీకరణపై దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి, దాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్
ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ సర్కారు సంప్రదింపుల ప్రక్రియను చేపడుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మాదిగలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.