'మౌలిక' నిరశన

దళితులు, ఆదివాసులు, పట్టణ పేదలు, కౌలుదార్ల సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఆ పార్టీకి చెందిన కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, ఎస్, వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావులు ఆమరణ నిరశన దీక్షను చేపట్టారు. ఐదురోజులుగా నిరశన దీక్ష చేస్తున్న వారిని శనివారం అర్ధరాత్రి అరెస్టుచేసి గాంధీ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ వారు తమ దీక్షలను కొనసాగించారు.

ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న వారితో ప్రభు త్వం చర్చించకుండా అరెస్టు చేసి దీక్షను భగ్నం చే సేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవాప్తంగా ఆందోళనలు జరిగాయి. వివిధ జిల్లాల్లో వందలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు పి.శంకరరావు, డొక్కా మాణిక్య వరప్రసాదరావులు దీక్ష చేస్తున్న నేతలను సోమవారం పరామర్శించారు. నిర్దిష్టమైన హామీలేమీ ఇవ్వకపోయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రులు ప్రకటించారు.

దళిత, ఆదివాసుల సమస్యల పట్ల స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించిన సీపీఎం నేతలు రాష్ట్ర మంత్రులు పితాని, బాలరాజుతో మరో విడత చర్చించిన అనంతరం దీక్ష విరమణకు సమ్మతించారు. పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్న కార్యకర్తల సమక్షంలో ఈ నిరశనోద్యమం పాక్షిక విజయం సాధించిందని ప్రకటిస్తూ రాఘవులు తదితర నేతలు దీక్షను విరమించారు.

గత కొంత కాలంగా ప్రత్యేక తెలం గాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, పార్టీలలో తలెత్తిన అంతర్గత వివాదాల చుట్టూ దాదా పు అన్ని రాజకీయపార్టీలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. సమాజంలోని అట్టడుగు ప్రజానీకపు మౌలిక సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోని ఈ సమయంలో వాటి పరిష్కారానికై సీపీఎం నేతలు నిరవధిక నిరశన దీక్షకు సిద్ధపడటం హర్షించదగ్గది.

సీపీఎం నేతలు చేస్తున్న నిరశన దీక్షలకు సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమస్యలకు చెందిన ప్రజా సెక్షన్‌లను కదిలిస్తూ ఆ పార్టీ స్థానిక కార్యకర్తలు ఆందోళన లు చేపట్టారు. ఆ క్రమంలో మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఎం నేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాలు మహార్యాలీని నిర్వహించాయి.

అయితే దళిత, ఆదివాసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలన్న నిరశనకారుల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కచ్చితంగా అమలయ్యేందుకు ప్రత్యేక చట్టం చేయాలని సోమవారం సీపీఎం సభ్యలు ఉభయసభలలో డిమాండ్ చేశారు. గత కొద్ది సమావేశాల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను తేల్చుకునే వేదికలుగా మారిపోయాయి.

దిగజారిపోతున్న ప్రజల జీవన ప్రమాణాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఆహార, ఆరోగ్య భద్రతలు, దారిద్య్రం లాంటి మౌలిక ప్రజా సమస్యలపై రాజకీయపక్షాలు లోతుగా, సమగ్రంగా చర్చించకుండా స్కాంలపై మాత్ర మే తీవ్రంగా స్పందిస్తున్నాయి. దాంతో ప్రజా సంక్షేమం కుప్పకూలింది. ఈ నిరశనోద్యమం విస్మృత ప్రజా సమస్యలను తిరిగి తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి సీపీఎం ముందుకు తెచ్చిన 51 డిమాండ్లు ఈనాడు కొత్తగా ముందుకొచ్చినవి కావు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోయినవే. వాటిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్, స్కెషల్ కాంపొనెంట్ అమలు డిమాండ్‌లు ఇందిరాగాంధీ పాలనా కాలంలో రూపొందినా ఇప్పటికీ అమలుకు నోచుకోని దుస్థితి.

దళిత, ఆదివాసీ ప్రజానీకం కోసం రూపొందించిన ఉప ప్రణాళిక, నోడల్ ఏజెన్సీ పనితీరు, నిధుల కేటాయింపులు, వాటి అమలు తీరుతెన్నులు వగైరాలు ఆ ప్రజలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఈ ప్రభుత్వాలు పరిగణిస్తున్నట్లు రుజువు చేస్తున్నాయి. అదే సమయంలో దళితులు, ఆదివాసులు విద్య, వైద్య సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్నారు. 2009-10 ప్రణాళికలో కేటాయించిన నిధులలో 10 శాతాన్ని కూడా ప్రభు త్వం ఖర్చుపెట్టకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి ప్రబల తార్కాణమని సీపీఎం విమర్శిస్తోంది.

జనాభాకు అనుగుణంగా, అంతకంటే అధికంగా ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయించాలని 1981లో ప్రణాళికా సంఘం సూచించింది. ఆ సూచ నలు రాష్ట్రంలో 2005లో ఉత్తర్వులుగా వచ్చాయి. ఈ నిధులను అమలులోకి తెచ్చే లక్ష్యంతో 2007లో ఒక నోడల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన్పటికీ అది ఏరోజూ పనిచేసిన పాపాన పోలేదు. ఉప ప్రణాళిక ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవైఒక్క వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం కోరలులేని పులిగా మార్చివేయడంతో వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోయిన తర్వాత వేరే రంగాలకు తరలిపోతున్నాయి. కేటాయించిన నిధులను మురగబెట్టేది, వాటిని వేరే ప్రయోజనాల కోసం వినియోగించేదీ ఈ ప్రభుత్వాలే. ఈ అంశంపై ప్రణాళికా సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టింది.

దళిత, ఆదివాసుల సంక్షేమ కోసం కేటాయించిన నిధుల నిర్వహణ కోసం కేంద్రీయ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దగ్గర లేదు. ఆదివాసేతరులు అక్రమణలో ఉన్న ఆదివాసుల భూమిని విడిపించేందుకు ఉద్దేశించిన 1/70 చట్టానికే దిక్కులేదు. ఇక ఎస్టీల అనుభవంలోని 25 లక్షల హెక్టార్ల భూమికి పట్టాలిచ్చే ముచ్చట ఎక్కడిది? సమగ్రమైన, శాస్త్రీయమైన ఆదివాసీ భూముల సర్వేను చేపట్టకుండా కేవలం నాలుగు లక్షల హెక్టార్లకు మాత్రమే పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

వ్యసాయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని సమకూరుస్తున్న కౌలుదార్లకు బ్యాంకు రుణ సౌకర్యం కోసం గుర్తింపు కార్డులు, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ల నియామకం, చివరికి దళిత, ఆదివాసులకు స్మశాన స్థలం కేటాయింపులాంటి వివిధ డిమాండ్లపై సీపీఎం ఆందోళన చేపట్టింది.

ప్రజల మౌలిక సమస్యలపై జరుగుతున్న నిరశన ఉద్యమం అనవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివిధ ప్రతిపక్షపార్టీలు, అనేక ప్రజా సంఘాలు సీపీఎం దీక్షకు మద్దతు ప్రకటించి ప్రభుత్వ అలక్ష్యాన్ని ఆక్షేపించాయి. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఒకవైపు రాత పూర్వకంగా అనుమతినిస్తూ మరోవైపు జిల్లాల నుంచి తరలివస్తున్న ప్రజలను అరెస్టు చేయడం, నాయకులను ముందస్తుగా నిర్బంధించడం ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని బట్టబయలు చేసిందని సీపీఎంతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుపట్టాయి.

ఈ నిరశన దీక్షతో ప్రజల మౌలిక సమస్యల తక్షణ పరిష్కార అవసరాన్ని, సందర్భాన్ని తిరిగి తెరపైకి తెచ్చినట్లయింది. కుల, మత, ప్రాంత, జాతి అస్తిత్వ ఉద్యమాలు, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమాలు పరస్పరం భిన్నమైనవి కావు. ఒకదానికి ఇంకొకటి అవరోధమూ కావు. అవి పరస్పరపూరకమైనవి. రాజకీయపార్టీలు, ఉద్యమ సంస్థలు ఈ రెండు రకాల ఉద్యమాలను నేర్పుగా అనుసంధానించడంలోనే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉంది.andhra jyothi soujanyamutho