ఉచిత పంపిణీ

రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలంటే సామాజిక పరివర్తనకు, అభివృద్ధికి పార్టీలు (అధికారంలోకి వస్తే) అనుసరించే విధానాలు పొందుపరిచిన పత్రం అనేది సర్వసాధారణ భావన. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో సాఫల్య వైఫల్యాలు తదుపరి ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యేవి. అది ఒకప్పటి మాట. ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యంగా నయా ఉదారవాద మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను బూర్జువా పార్టీలన్నీ ఆలింగనం చేసుకున్నాక విధానాలపరంగా భేదాలు అంతర్ధానమయ్యాయి. అధికారం కొరకు పోటీలో అధికార-ప్రతిపక్ష స్థానాలను బట్టి పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం, ఓటర్లకు గాలమేసేందుకు ఉదార లేక ఉచిత పంపిణీ వాగ్దానాలు పెరిగాయి. ఎన్నికల అవినీతి కిందకు రాని రాచబాట ఇది. ప్రజలు అధికారమిస్తే ప్రజలు పన్నుల రూపంలో ఖజానాకు చెల్లించిన సొమ్ముతో ఉభయ తారకంగా వాటిని అలవోకగా అమలు చేయవచ్చు. డి.ఎం.కె. ఇందులో ఆరితేరింది. 1967లో డి.ఎం.కె. తొలిసారి అధికారంలోకి రావటానికి కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలతో పాటు రూపాయికి పడి (మూడుసేర్లు) బియ్యం బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. 2006 ఎన్నికల్లో కరుణానిధి నాయకత్వంలోని డి.ఎం.కె. రూపాయికి కిలోబియ్యం, కలర్‌ టెలివిజన్‌ల ఉచిత పంపిణీని వాగ్దానం చేసింది. ఈ పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికలు ప్రకటించగానే ఎన్నికల సంఘం టి.వి.ల పంపిణీని నిలుపుచేసింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు డి.ఎం.కె. ఉచిత పంపిణీల జాబితాను విస్తరించింది. విద్యార్ధులకు లాప్‌ట్యాప్‌, గృహిణులకు గ్రైండర్‌ లేదా మిక్సీ, పేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ఉచిత బియ్యం, వృద్ధులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, గర్భిణులకు నగదు సహాయం పెంపుదల, మత్స్యకారులకు సబ్సిడీలు పెంపు వగైరా కొత్తగా చేరాయి. కుటుంబపాలనపై అసంతృప్తిని, 2జి స్పెక్ట్రం అవినీతిని ఈ 'ఉచితాలు' పరిహరిస్తాయని, ప్రజలు తిరిగి తమకే అధికారం కట్టబెడతారన్నది కరుణానిధి ఆశ! ప్రతిపక్షం ఇంతకు మించి ఏమివ్వగలుగుతుంది!
సినీ నటజీవితమంతా మద్రాసులో (ఇప్పుడు చెన్నై) గడిపిన ఎన్‌.టి.రామారావు 1982లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అడుగిడి ఆ ప్రభావంతో రెండ్రూపాయలకు కిలో బియ్యం ప్రకటించారు. కాంగ్రెస్‌ దుష్పరిపాలన పట్ల ప్రజల్లో వున్న అసంతృప్తికి ఇది తోడైంది. 1983 జనవరిలో ఆయన టిడిపి అధికారంలోకి వచ్చింది. బి.జె.పి. ముఖ్య మంత్రు లు-మధ్య ప్రదేశ్‌లో శివరాజ్‌ చౌహాన్‌,చత్తీస్‌ ఘర్‌లో రమణ్‌ సింగ్‌, కర్నాటకలో ఎడ్యూరప్ప, గుజరాత్‌లో నరేంద్ర మోడీ ఇదే ధాన్యం రాజకీయం నుండి లబ్దిపొం దారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ ఉచిత విద్యుత్‌ వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది. 2004 లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దశాబ్దం తర్వాత తిరిగి అది óకారం లోకి రావటంలో వ్యవసా యానికి ఉచిత విద్యుత్‌ వాగ్దానం ప్రభావం తక్కువేమీకాదు. ప్రతిపక్ష టిడిపి 'నగదు బదిలీ' పథకం ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఉచిత పంపిణీలు పేదలకు తాత్కాలిక ఊరట, వెసులుబాటు కల్పించే చర్యలే అయినప్పటికీ, ఎన్నికల్లో చేసే అటువంటి వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లంచంతో సమానం. కాని వాటిని నిరోధించే శక్తి ఎన్నికల చట్టాలకు, వాటిని అమలు జరిపే ఎన్నికల కమిషన్‌కు లేకపోవటం వల్ల రాజకీయ పార్టీలు పోటీపడి ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నాయి.
బూర్జువావర్గ పార్టీలు పేదల గూర్చి మొసలి కన్నీరు పెడుతూ ప్రలోభాలతో (వెచ్చించే ధనానికివి అదనం) వారి ఓట్లు పొందటంలో ఆరితేరాయిగాని భూపంపిణీ, శాశ్వత ఉపాధికి చర్యలు తీసుకోవటం ద్వారా వారి కాళ్ళపై వారిని నిలబెట్టేందుకు కృషి చేయవు. వారలా పేదరికంలో వుండటంలోనే వాటికి స్వార్ధం వుంది. అయితే అన్నివేళలా 'ఉచిత' వాగ్దానాలు రాజకీయపార్టీలను గట్టెక్కించలేవు. ఎన్నికల సమయానికున్న రాజకీయ వాతావరణం, పాలకపార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఫలితాలు నిర్ణయించటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. పేదలు కూడా 'ఉచిత' వాగ్దానాల భ్రమల్లో కొట్టుకుపోకుండా రాజకీయంగా మంచి చెడులు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు 'ఉచిత' వాగ్దానాలతో తాత్కాలికంగా పబ్బంగడుపుకునే అవకాశవాద రాజకీయాన్ని పక్కనపెట్టి పేదల జీవనాన్ని మెరుగుపరిచే శాశ్వత లాభ చర్యలు చేపట్టిన ప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం. ఉచితంగా ఇస్తే అది ఆ రోజుతో సరి. కాని ఆహారం సంపాదించుకునే మార్గం చూపితే అది శాశ్వతం.