దళితులపై దాడి కేసు

దళితులపై దాడి ఘటనకు సంబంధించి తమిళనాడులోని రామనాథపురం పార్లమెంటు సభ్యుడు జెకె రితీష్‌ (డిఎంకె)ను సెంట్రల్‌ జైలుకు పంపారు. తిరువాడనై నియోజకవర్గంలో డిఎంకె అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర మంత్రి శుభా తంగవేలన్‌ సోలాందూర్‌ గ్రామంలోని దళితవాడలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ పరిధిలోని కలవాకుడి గ్రామానికి వెళ్లే దారి సరిగాలేదని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు. తమ సమస్య పరిష్కారం కాలేదని, అందువల్ల తమ కాలనీలో ప్రచారం నిర్వహించరాదంటూ అభ్యంతరం తెలిపారు. ఇది డిఎంకె అభ్యర్థి కోసం ప్రచారానికి వచ్చిన రామనాథపురం ఎంపీ రితీష్‌కు ఆగ్రహం తెప్పించింది. తన వెంట వచ్చిన రౌడీ మూకతో కాలనీపై దాడి చేయించారు. ఆ దాడిలో కాలనీకి చెందిన ఒక వ్యక్తి తీవ్ర
గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాలనీకి చెందినవారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు సోమవారం తెల్లవారు ఝామున రితీష్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రితీష్‌ను 15 రోజుల రిమాండ్‌కు, మిగిలిన వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు రితీష్‌ను మదురై సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతో జైలులో ఉన్న డిఎంకె పార్లమెంటు సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే 2జి స్పెక్ట్రమ్‌ అవినీతి కేసులో డిఎంకె పెరంబలూర్‌ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా తీహార్‌ జైలులో ఉన్న విషయం విదితమే.