ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరిస్తున్నాం

ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరిస్తున్నాం
మార్గదర్శకాల ప్రకారం పని చేస్తాం

సంబంధం లేని ఫిర్యాదుల వల్లే కాలయాపన
ఏడునెలల్లో 4,682 కేసులు పరిష్కరించాం
హెచ్చార్సీ తాత్కాలిక చైర్మన్ పెదపేరిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 1 : జనవరి మాసం నుంచి ఏ రోజు కేసులను ఆ రోజే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డి తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా హెచ్చార్సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. హెచ్చార్సీకి సంబం దం లేని పిటిషన్లే దాదాపు 70% వరకూ వస్తున్నాయని, వాటివల్లనే కాలయాపన జరుగుతోందన్నారు.

కేసు నేపథ్యాలను బట్టి రకరకాల ఫోరాలున్నా, ఎక్కువ మంది పనిలో పనిగా ఒక కాపీని హెచ్చార్సీకి పంపుతున్నారని చెప్పారు. ఈ ఏడు నెలల కాలంలో 4,682 కేసులను పరిష్కరించామన్నారు. దాఖలైన ప్రతి పిటిషన్‌పై తుదితీర్పును ఏడాది లోపుగా ఇవ్వాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నామని, అందుకు తోటి సభ్యులు, సిబ్బంది చక్కగా సహకరిస్తున్నారని తెలిపారు. మరో ఇరవై మంది సిబ్బందిని ఇవ్వడంతో పాటు, ప్రస్తుత బడ్జెట్‌ను మరికొంత పెంచితే ఇంకా సమర్థంగా సేవలందించగలమన్నారు.

దరఖాస్తుదారులు 3 నుంచి 5 వాయిదాలకు హాజరు కాకపోతే నోటీసులిచ్చి కేసులను మూసేస్తున్నామని చెప్పారు. నేరుగా ఫిర్యాదుదారుల వాదనలనే విని సమస్యలను పరిష్కరిస్తున్నామని, అవసరమనుకునే వారు న్యాయవాదుల సాయం తీసుకోవచ్చని, అయితే అది తప్పనిసరి కాదని పెదపేరిరెడ్డి తెలిపారు.

పిటిషనర్ స్వయంగా రాలేని సందర్భాల్లో అధికార పత్రాలు అందజేయడానికి న్యాయవాదుల వకాలత్ స్వీకరిస్తున్నట్టు చెప్పారు. గృహహింస, వృద్ధుల నిరాదరణ, పెన్షన్లు-ప్రావిడెంట్ ఫండ్ల చెల్లింపులో జాప్యం, పిల్లల హక్కులు, పోలీసుల నిష్క్రియలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నామన్నారు. తగిన ఫోరం ఉన్న కేసులను మాత్రం తిరస్కరిస్తున్నట్టు ఆయన చెప్పారు.