అపశ్రుతులు - సంపాదకీయం

అపశ్రుతులు
- సంపాదకీయం

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికీ తెలంగాణ ఉద్యమానికీ మధ్య కొద్దిరోజులుగా వివాదానికీ ఉద్రిక్తతకీ కారణమైన 'మిలియన్ మార్చ్' గడచిపోయింది. ఉద్యమనేతలు ఆశించినట్టు మహాజన సమీకరణ కాకుండా అడ్డుకోగలిగామని పోలీసు యంత్రాంగం సంతృప్తి చెందవచ్చు. ఎన్ని అవరోధాలు కల్పించినా ఎన్ని అరెస్టులు చేసినా చివరకు టాంక్‌బండ్‌లోకి చొచ్చుకుని వెళ్లామని ఉద్యమనాయకులు గర్వపడవచ్చు.

ప్రజాస్వామిక స్ఫూర్తి, సామరస్యం, శాంతియుత వ్యవహారసరళి-విలువలుగా అంగీకరించి ఉంటే - ఎవరి జయగీతికను వారు పాడుకోవడం కాకుండా ఉభయ వర్గాలూ తమ తమ లక్ష్యాలు సాధించగలిగి ఉండేవి. దురదృష్టవశాత్తూ అట్లా కాక, నిరంకుశమైన నిర్బంధ చర్యలకు, అనాగరికమైన విగ్రహ విధ్వంసాలకు, మీడియా ప్రతినిధులపై దౌర్జన్యానికీ 'మిలియన్ మార్చ్' సందర్భం వేదిక అయింది.

ప్రభుత్వాలు అమలుచేసే అణచివేతలను, ఉద్యమాలలో జరిగే అరాచక చర్యలను ఒకే గాటన కట్టకూడదు నిజమే కానీ, ప్రజా లక్ష్యాల కోసం, మెరుగైన వ్యవస్థల కోసం పనిచేసే ఉద్యమాల సరళి ఆదర్శవంతంగా ఉండాలనీ, ప్రజాస్వామికంగా ఉండాలనీ. కోరే మార్పును ముందే స్ఫురింపజేసేంత న్యాయంగా ఉండాలనీ సభ్య సమాజం ఆశిస్తుంది.

'మిలియన్ మార్చ్' కార్యక్రమమే పట్టింపుల కారణంగా వివాదాస్పదం అయింది. అక్కడికీ ఉద్యమనాయకత్వం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాన్ని కుదించుకుని, పరిమితమైన సమయంలో జరపాలని నిర్ణయించింది. జనసమీకరణను నివారించాలనో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో తెలియదు కానీ, పోలీసు యంత్రాంగం అవసరానికి మించి వ్యవహరించిందనే అభిప్రా యం కలిగింది.

గురువారం ఉదయం నుంచి నగరాన్ని పోలీసు వలయంలో దిగ్బంధంచేయడం వల్ల పరీక్షార్థులకు, సాధారణ పౌరులకు కూడా ఇబ్బంది కలిగింది. పోలీసుల వ్యూహాన్ని ధిక్కరించి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉత్సాహంలో ఉద్యమనేతలు వారి పథకాలు వారు రచించారు. అవరోధాలను అ«ధిగమించి చెప్పిన సమయానికి తెలంగాణవాదులు టాంక్‌బండ్‌పైకి చేరుకోగలిగారు. రకరకాల మార్గాలనుంచి వచ్చిన బృందాలు టాంక్‌బండ్‌పై వేలాది జనసమూహంగా మారారు.

నాయకులను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడంతో, టాంక్‌బండ్ మీద సమీకృతులైన జనంపై నియంత్రణ లేకపోయింది. పొద్దుటినుంచి టాంక్‌బండ్‌ను నిర్మానుష్యం చేసిన పోలీసులు తీరా 'మార్చ్' సమయానికి ప్రేక్షకమాత్రులుగా మిగిలిపోయారు. ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఆందోళనకారుల్లో కొందరు విధ్వంసకులుగా అవతారమెత్తారు. విగ్రహాలను పగులగొట్టడం ఖాళీ చేతులతో అయ్యే పని కాదు కాబట్టి, ఆ పనిచేసిన వారు ముందస్తు ఏర్పాట్లతోనే వచ్చి ఉంటారు.

ఎన్టీయార్ హయాంలో టాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించిన తెలు గు ప్రముఖులు, వైతాళికుల విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్నిటిని హుస్సేన్‌సాగర్‌లో విసిరివేశారు. ఆందోళనకారులు దాడి చేసిన విగ్రహాలలో జాషువా, త్రిపురనేని రామస్వామిచౌదరి, బ్రహ్మనాయుడు, శ్రీశ్రీ వంటి సామాజిక సంస్కర్తలు, ప్రజాకవులు కూడా ఉన్నారు. దాడికి గురైన విగ్రహాలు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహావ్యక్తులవి అయినప్పటికీ, వారికి అభిమానులు, అనుయాయులు తెలంగాణతో సహా అన్ని ప్రాంతాలలో నూ ఉన్నారు.

విగ్రహ విధ్వంసం ఆయా అభిమానులకు తీరని మనస్తాపం కలిగిస్తుంది. ఈ దుందుడుకు చర్య తెలంగాణ ఉద్యమానికి తెచ్చే అప్రతిష్ఠ కూడా చిన్నదేమీకాదు. వివేకం స్థానంలో ఉద్వేగాలకూ ఉద్రేకాలకూ పెద్దపీట వేస్తే ఉద్యమాలే న ష్టపోతాయి. విగ్రహ విధ్వంసాన్ని తాము సమర్థించబోమని, అటువంటి చర్యలు వాంఛనీయాలు కావని తెలంగాణ ఉద్యమ ప్రముఖ నేతలందరూ ప్రకటించడం ఆహ్వానించదగింది. మున్ముందు ఇటువంటివి జరగకుండా వారు జాగ్రత్తపడితేనే వారి ప్రకటన సార్థకమవుతుంది. ఇక, మీడియామీద జరిగిన దాడి అయితే దుర్మార్గమైనది.

తెలంగాణ ఉద్యమాన్ని చిత్రీకరిస్తూ, పోలీసుల చేతిలో దౌర్జన్యానికి గురిఅయేదీ, ఇటువంటి సందర్భాలలో ఉద్యమకారుల ఆగ్రహావేశాలకు లక్ష్యమయ్యేదీ మీడియాసంస్థల ప్రతినిధులూ, వాహనాలే కావడం విషాదకరం. టాంక్‌బండ్ మీద ఆందోళనకారుల చేతిలో అన్ని మీడియా చానెళ్లకు చెందిన ఇరవైకి పైగా కెమెరాలు ధ్వంసమయ్యాయి. ఒక చానెల్ ఓబీ వ్యాన్‌ను దగ్ధం చేశారు, మరోదాన్ని ధ్వంసం చేశారు. కెమెరామన్‌లపై, పత్రికా ప్రతినిధులపై చే యిచేసుకున్నారు.

ఉద్యమ సందర్భంలో పోలీసు అణచివేతలను చూపిస్తే పోలీసులకు, ఆందోళనకారుల అరాచకాన్ని చిత్రిస్తే ఉద్యమకారులకు సహించకపోతే, ఇక పత్రికాసంస్థలు, చానెళ్లు ఏమిచేయాలి? ప్రతి మీడియా సంస్థా, ఉద్యమాలను, సంఘటనలను తమదైన ప్రత్యేకమైన రీతిలో చూస్తాయి, వ్యాఖ్యానిస్తాయి. అవి కొన్నిసార్లు ప్రభుత్వానికి, మరి కొన్ని సందర్భాలలో ప్రజలలోని వివిధ వర్గాలకు రుచించకపోవచ్చు.

తాము ఇష్టపడనిదాన్ని నిరోధించాలనే వైఖరి ఎవరు అనుసరించినా గర్హనీయమే. అటువంటి నియంత్రణ ఎవరు చేసినా అది అప్రజాస్వామిక మే. మీడియా అంటూ ఒకటి ఉంటేనే, సత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒకరూపంలో కనీసంగానైనా ప్రజల ముందుకు వస్తుంది. దాన్ని కోల్పోతే, దాని నోరుమూస్తే మొదట నష్టపోయేది ప్రజా ఉద్యమాలే. మీడియా మీద ఒంటికాలితో లేవడం ఈ మధ్య ప్రతి ఉద్యమానికీ అలవాటుగా మారింది. ఆ ధోరణి తమకు తాము హాని చేసుకునేదే తప్ప, మేలుచేసేది కాదు.

సమస్యలను పరిష్కరించే దిశగా కాక, నిరవధికంగా నానబెట్టే తీరులో వ్యవహరించ డం వల్ల శాంతియుత ఉద్యమాలు కూడా ఎట్లా కలుషితమవుతాయో గురువారం నాటి పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆందోళనకారుల్లో వ్యక్తమైన అసహనం, ఉద్యమానికి సానుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలను కూడా వదలలేదు. సాక్షాత్తూ కెసిఆర్ కూడా దూషణలను ఎదుర్కొన్నారు.

తెలంగాణ విషయంలో పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌పార్టీకి-వాటి సొంత సమస్యలు వాటికి ఉండి ఉండవచ్చు. ఉద్యమాన్ని నిర్వహిస్తున్న పార్టీలకు సంస్థలకు ఎవరి ఒత్తిళ్లు వారికి, ఎవరి పరిమితులు వారికి ఉండవచ్చు. నిర్ణయంకోసం నిరీక్షిస్తున్న ప్రజలకు ఎవరిమీదా విశ్వా సం లేని పరిస్థితి నెలకొన్నది. అది సమాజానికి మంచిది కాదు. పారదర్శకమైన, వాస్తవికమైన ఆచరణశైలి ద్వారా ఉద్యమనాయకత్వం తమ కార్యకర్తల, సానుభూతిపరులలోని అవిశ్వాసాన్ని తొలగించడం అవసరం.
ఈ అపశ్రుతులను మినహాయిస్తే, మిలియన్ మార్చ్ మొత్తం మీద ప్రశాంతంగానే జరిగినట్టు భావించి ప్రభుత్వం ఊపిరిపీల్చుకోవచ్చు. వ్యాపించిన భయాందోళనల దృష్టి తో చూస్తే, జరిగింది తక్కువే కావచ్చు. కానీ, గురువారం నాటి టాంక్‌బండ్ సంఘటనల నుంచి అన్నిపక్షాలూ నేర్చుకోవలసింది, గ్రహించవలసింది చాలా ఉన్నది. అనిశ్చితస్థితి ఎక్కువకాలం కొనసాగితే అది అరాచకానికి దారితీసే ప్రమాదం ఉన్నది. ఏ నిర్ణయమూ లేకుండా ఇదేస్థితి కొనసాగితే, అసహనం పెరిగిపోయి, పరిస్థితి చేయిదాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆకులు పట్టుకుని లాభం లేదు.ఆంధ్ర జ్యోతి సౌజన్యముతో