దళితుల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలి

ప్రజాశక్తి - యంత్రాంగం   Mon, 28 Mar 2011, IST  
  • సమస్యలు పరిష్కరించకుంటే మరో దఫా ఉద్యమం
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వక్తల హెచ్చరిక
దళిత, గిరిజనవాడల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలని వ్యవసాయ కార్మిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. దళిత, గిరిజనుల అభివృద్ధి కోరుతూ 44 సూచనలతో ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచాయి. వీటిని తక్షణం పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటం తప్పదనీ హెచ్చరించాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు, అనంతపురాల్లో ఆదివారం జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించాయి. 'దళిత, గిరిజన గ్రామాల అభివృద్ధికై ఉద్యమాలు-అనుభవాలు-భవిష్యత్తు పోరాటాలు' అంశంపై విశాఖ ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగం ఆచార్యులు ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ, దళితులు చదువుకొని చైతన్యవంతులై పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.లోకనాధం మాట్లాడుతూ దళితుల సంక్షేమం పట్ల నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి కేటాయించిన రూ.21 వేల కోట్లను ఎందుకు దారి మళ్లించిందని ప్రశ్నించారు. పాలకవర్గాలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, కెవిపిఎస్‌ నగర ఉపాధ్యక్షులు వై.రాజు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, ఉత్తరాంధ్ర దళిత ఐక్యవేదిక నాయకులు బి.గోపాలరావు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ నాయకులు బి.కల్యాణరావు తదితరులు మాట్లాడారు.
విజయవాడలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో 'దళితపేటల అభివృద్ధి' అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రక్షిత మంచినీటి వసతి కల్పించడానికి ప్రతి దళితవాడకూ రెండు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాధికారులూ, పోలీసులు వారంలో ఒక రోజు దళితవాడల్లో పర్యటించాలని కోరారు. సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు నాగేశ్వరరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలం పుల్లయ్య, చౌటపల్లి రవి, నగర అధ్యక్ష కార్యదర్శులు పి.కోటేశ్వరరావు, జి.నటరాజు, నాయకులు పి.రాజేష్‌ పాల్గొన్నారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో 'దళిత, గిరిజన వాడల అభివృద్ధి - ప్రభుత్వ హామీలు' అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.వీరన్న, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ఓబుళకొండారెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లాలో దళితులు, గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో బిసి కులాల ఐక్య వేదిక నాయకుడు నాగరాజు, మాలమహానాడు నాయకుడు పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూల్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం బాలఉశెని అధ్యక్షత వహించారు.
కెవిపిఎస్‌ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడి ఆశోక్‌ రత్నం, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపి నాయుడు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 44 సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. వాటిని పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటాన్ని చేపడతామని వారు తెలిపారు.