ప్రమాణాలు పాటించని కాలేజీల యాజమాన్యాలకు

ప్రమాణాలు పాటించని కాలేజీల యాజమాన్యాలకు..
జైలు.. జరిమానా!
మూడేళ్ల ఖైదు.. 3 లక్షల ఫైను

వృత్తి విద్యా కాలేజీలపై రాష్ట్ర సర్కారు పట్టు
కోచింగ్ సెంటర్లు, డిగ్రీ కాలేజీలపైనా నియంత్రణ
తనిఖీలు, చర్యలకు అధికారం
రాష్ట్ర విద్యా చట్టానికి సవరణ
ఈ సమావేశాల్లోనే బిల్లు
హెచ్చరిక!
ఫీజులే తప్ప ప్రమాణాలు పట్టని...
పైపై మెరుగుల భవనాలు తప్ప
లోపల వసతులు కల్పించని...
విద్యార్థులున్నప్పటికీ
తగిన ఫ్యాకల్టీని నియమించని...
సరైన ప్రయోగ శాలలు,
మౌలిక సదుపాయాలు లేని...
ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరిక! ఇలాంటి కాలేజీల యాజమాన్యాలు కటకటాలు లెక్కించక తప్పదు. భారీ జరిమానా కట్టక తప్పదు. గరిష్ఠంగా రూ.3 లక్షలు జరిమానా విధించేందుకు, మూడేళ్లపాటు జైలుకు పంపేందుకు తగిన చట్టం తయారవుతోంది. ఈ కాలేజీల గుర్తింపును ఉపసంహరించే అవకాశమూ ఉంది.

హైదరాబాద్, మార్చి 8 : ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కళాశాలలతోపాటు... డిగ్రీ, పీజీ కాలేజీలన్నింటిపైనా పట్టుబిగించేందుకు సర్కారు సిద్ధమైంది. ఉన్నా లేనట్లుగా, అసలు ఉందో లేదో అన్నట్లుగా తయారైన విద్యా చట్టం - 1982కు కొత్త కోరలు తొడుగుతోంది. ఈ చట్టానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే సవరణ చేపట్టాలని నిర్ణయించింది. అదే జరిగితే... ఈ కళాశాలలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ కిందకు వచ్చినట్లే! మరి... ఇప్పటిదాకా ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలపై సర్కారు నియంత్రణ లేదా అనే సందేహం రావచ్చు!

ఔను... నిజంగానే లేదు! చలో అంటూ ఢిల్లీకి వెళ్లడం, అక్కడ ఏఐసీటీఈకి వెళ్లి అనుమతులు తెచ్చుకోవడం! ఇక్కడ కాలేజీలు పెట్టడం! ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలన్నింటికీ ఏఐసీటీఈ అనుమతులు ఇస్తుంది. బీఈడీ కళాశాలలకు మాత్రం ఎన్‌సీటీఈ అనుమతి అవసరం. వెరసి... ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలపై మొత్తం ఆజమాయిషీ ఢిల్లీదే. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర శూన్యం. ఇప్పటికే అవసరానికి మించి ఉన్నాయంటున్నా, ఇక ఏమాత్రం అవసరం లేదంటున్నా... ఏఐసీటీఈ తన మానాన తాను ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇస్తూనే ఉంది.

దీంతో... రాష్ట్రంలో ఇవి పుట్టగొడుల్లా వెలిశాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ ప్రమాణాలు పడిపోతున్నాయి. కొన్ని పేరున్న కాలేజీలు మినహా... మిగిలిన కళాశాలల యాజమాన్యాలు వసతుల కల్పనకు తిలోదకాలు ఇచ్చేశారు. సీట్లు అమ్ముకోవడం, డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజుల రూపంలో డబ్బు పిండుకోవడం అంతా వాళ్ల ఇష్టారాజ్యం. ఢిల్లీలో ఉండే ఏఐసీటీఈ అధికారులు ఇవేమీ పట్టించుకోరు. తూతూ మంత్రపు తనిఖీలే తప్ప... కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. కళ్లముందు ఘోరాలు జరుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూస్తూ కూర్చోవాల్సిందే!

ఈ కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదు. ఒకవేళ ఏవైనా చర్యలు తీసుకున్నా... కాలేజీలు వెంటనే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయి. మన విద్యా చట్టం బలహీనంగా ఉండటమే దీనికి కారణం. ఈ పరిస్థితిని గమనించిన కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమతమ విద్యా చట్టాన్ని సవరించుకున్నాయి. ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలపై నియంత్రణ సాధించాయి. ఇప్పుడు... మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది.

కోట్లు వెచ్చిస్తున్నా...
వృత్తి విద్యా కాలేజీలో చదివే బడుగు, బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం సర్కారు ఈ ఏడాది రూ.2815 కోట్లు ఖర్చు చేసింది. సరైన వసతులు లేని కాలేజీలకు ప్రభుత్వం చెల్లించే సొమ్ము బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఇటీవల ఫీజుల చెల్లింపు విషయంలోనే రచ్చ రచ్చ అయిన సంగతి కూడా తెలిసిందే. 'ఖర్చు పెట్టే సొమ్ముకు సార్థకత, విద్యార్థులకు న్యాయం' జరగాలంటే కాలేజీలు ప్రమాణాలు పాటించేలా చూడాలని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వ ఆజమాయిషీ కూడా ఉండాలని భావించారు.

'ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం కాలేజీల బెదిరింపులు సరే! మరి... వాటిలో వసతుల మాటేమిటి?' అంటూ గవర్నర్ నరసింహన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజానికి... దామోదర రాజ నరసింహ ఉన్నత విద్యా శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే ఈ అంశంపై దృష్టి సారించారు. రాష్ట్ర విద్యా చట్టానికి అవసరమైన సవరణలు తీసుకురావడం ద్వారా వివిధ వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్నిరకాల కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణాధికారం ఉండేలా చూడాలని భావిస్తున్నారు.

"ఉన్నత విద్యలో ప్రమాణాలు పాటించాలంటే కఠినంగా ఉండక తప్పదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రానికి కూడా అధికారాలు ఉండాలి. ఈ దిశగా రాష్ట్ర విద్యా చట్టాన్ని సవరించడం కేంద్రాన్ని సవాల్ చేసినట్లు కాదు'' అని మంత్రి పలుమార్లు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐసీటీఈ నిబంధనలకు లోబడే మన విద్యా చట్టానికి సవరణలు తీసుకువస్తున్నందున ఇబ్బందులు తలెత్తబోవని ఆయన తెలిపారు. అందుకే... విద్యా చట్టం-1982కు సవరణలు సిఫారు చేయాల్సిందిగా కమిటీని ఏర్పాటు చేశారు.

ఉన్నది చాలదు...
రాష్ట్రంలో విద్యా చట్టం - 1982 ఇప్పటికే అమలులో ఉంది. కానీ... ఇది కోరలు లేని పాములాంటిది. దీని రూపకల్పన సమయంలో అనేక విషయాలు విస్మరించారు. జేఎన్‌టీయూ వంటి విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ చట్టం పరిధిలో లేవు. ఈ చట్టం సవరణపై నియమించిన కమిటీ మరో రెండు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అన్ని రకాల అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కాలేజీలన్నింటినీ చట్ట పరిధిలోకి తీసుకు రావాలని కమిటీ సిఫారసు చేయనుంది. అలాగే... ఎలాంటి జవాబుదారీతనం లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, బిజినెస్ స్కూళ్లపైనా ప్రభుత్వానికి నియంత్రణ వస్తుంది. ప్రమాణాలు, నిబంధనలను కాలరాసే కాలేజీ యజమానులకు చట్టం ఉల్లంఘనల తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా కసరత్తు జరుగుతోంది.

ప్రస్తుతం గరిష్ఠంగా ఆరు నెలల జైలు, రూ.వెయ్యి వరకు మాత్రం జరిమానా విధించే అవకాశముంది. ఇకపై... చట్ట విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేసినా, ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకున్నట్లు రుజువైనా చర్యలు తీసుకుంటారు. చట్టాన్ని అమలు చేయకపోతే ఒక రకమైన శిక్ష , అధికారులను తనిఖీలు చేయకుండా అడ్డుకుంటే మరో రకమైన శిక్ష ఉండాలని కమిటీ సిఫారసు చేయనున్నట్లు తెలిసింది.

మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం

మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు
త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం
లోక్‌సభలో చర్చ సందర్భంగా నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పనకు రాజకీయ పార్టీలు ఓటేశాయి. అయితే, వారికి ఎంత కోటా కల్పించాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగింది. అయితే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రస్తుత రూపంలోనే బిల్లును ప్రవేశపెడితే ఒప్పుకొనేది లేదని సమాజ్‌వాదీ, ఆర్జేడీ, జేడీయూలు హెచ్చరించాయి.

తొలుత ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. "16 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన సమయం ఇదే'' అని స్పీకర్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో, సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని లోక్‌సభాపక్ష నేత ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా మీరాకుమార్‌ను కోరారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమావేశం ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అంగీకరించారు.