ఏబీసీడీ రానట్టే!
కోల్డ్ స్టోరేజీలోకి ఎస్సీ వర్గీకరణ
రాజ్యాంగ సవరణ యోచన విరమణ
రాష్ట్రాలతో సంప్రదింపులకు కేంద్రం నిర్ణయం!

ఇక ప్రతి రాష్ట్రంలో కమిషన్‌లు,అధ్యయనాలు తప్పనిసరి
అసెంబ్లీలూ తీర్మానాలు చేయాల్సిందే
రెండింట మూడొంతల రాష్ట్రాల అంగీకారం కావాలి
ఇదంతా జరగడం దాదాపు అసాధ్యం
ఓటు బ్యాంకు చేజారొద్దనే ఈ జాగ్రత్త !!
దళితుల్లో వెనుకబాటు గుర్తించండి
అభ్యున్నతికి చర్యలు చేపట్టండి
ఎస్సీ కమిషన్ తాజా యోజన
ఎస్సీ వర్గీకరణ అంశం అటకెక్కనుందా? ఇక 'ఏ, బీ, సీ, డీ'లు రానట్టేనా? ఎన్నాళ్లుగానో ఇదిగో అదిగో అంటున్న రాజ్యాంగ సవరణ కొండెక్కినట్టేనా? మొత్తం వర్గీకరణ ప్రక్రియే కోల్డ్ స్టోరేజీలోకి పోబోతోందా? ..కేంద్ర సామాజిక న్యాయ శాఖ తాజా వైఖరి చూస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.

హైదరాబాద్, మే 26 : ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ విషయంలో రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియకు తెర తీయాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్.. దళిత సమస్యలతో ఇకపై దాగుడుమూతలు ఆడరాదని, కొత్తగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోరాదన్న నిశ్చయించుకున్నట్టు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లను, అభిప్రాయ సేకరణ పేరిట, పూర్తిగా పక్కనపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయించినట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు వచ్చిన డిమాండ్లతో పాటు, కొత్తగా వచ్చే వాటిని సైతం రాష్ట్రాల మీదికే తోసేసి, చేతులు దులుపుకోవాలని అది భావిస్తోంది. ఇదే జరిగితే.. గడచిన మూడేళ్లుగా మాదిగలు, ఇతర ఎస్సీ ఉప కులాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు.. పూర్తిగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్ఆర్‌పీఎస్) పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చింది.

మాలలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం సుప్రీంకోర్టు మాలల పిటిషన్లను విచారించి, ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ కొట్టివేసింది. అనంతరం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాదిగల పోరాట ఫలితంగా.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఒత్తిడితో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

దాని నివేదిక అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన గడచిన మూడేళ్లుగా ఏ దశలోనూ కేంద్ర మంత్రివర్గం ముందు చర్చకు రాలేదు. కేంద్ర స్థాయిలో లోతైన చర్చ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరగలేదు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అనేక పర్యాయాలు ఆమరణ దీక్షలకు దిగారు. జాతీయ పార్టీల నేతలను కలిసి వర్గీకరణకు మద్దతుగా లేఖలు సంపాదించారు. వాటిని ప్రధానికి అందించారు. వీటిపైనా కేంద్రం స్పందించలేదు.

ఇకపై ఇలా..
కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా.. ఎస్సీ వర్గీకరణ అంశంపై సామాజిక న్యాయ శాఖ హఠాత్తుగా నిర్ణయం మార్చుకుందన్నది విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగలు.. ఇతర రాష్ట్రాల్లో పైచేయిగా ఉన్నారు. చమర్లుగా పిలిచే ఈ వర్గం వారు ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గంగాను, గణనీయమైన ఓటు బ్యాంకుగాను ఉన్నారు. ఈ వర్గానికి చెందిన బడా నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహానికి గురికాకుండా చూసుకునే లక్ష్యంతో.. వ్యవహారాన్ని తెర వెనక్కి పంపుతున్నారు.

సంప్రదింపులు అంటే..
ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు అంటే.. వర్గీకరణ డిమాండ్‌ను కనీసం మరో పదేళ్లపాటు కోల్డ్ స్టోరే జీలో పెట్టడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎస్సీ వ ర్గీకరణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నిచోట్లా వర్గీకరణ అమలు రద్దయింది. సామాజిక న్యాయ శాఖ తాజా నిర్ణయం ప్రకారం చూస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయా ప్రభుత్వాలు చర్చించాలి. అంటే వర్గీకరణ అవసరం ఉందా లేదా అనే అంశపై అధ్యయనం చేయించాలి.

అవసరమైతే కమిషన్‌లు ఏర్పాటు చేసి పరిశీలన జరిపించాలి. అంటే.. ప్రతీ రాష్ట్రానికి ఉషా మెహ్రా లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలన్న మాట! ఆ తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై తీర్మానం చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని దేశంలో మూడింట రెండొంతుల మెజారిటీతో అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అప్పుడు మాత్రమే కేంద్రం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజీ నుంచి బయటకు తీయగలదు.

ఒకవేళ.. ఎక్కువ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని తీర్మానం చేస్తే, వర్గీకరణ అంతే! పునియా మాట ఇదీ! ఇదంతా ఒక ఎత్తైతే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా కూడా ఎస్సీ వర్గీకరణపై దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి, దాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్
ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ సర్కారు సంప్రదింపుల ప్రక్రియను చేపడుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మాదిగలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్మిక చట్టాల అమలకు దేశ స్థాయిలో ఉద్యమం !
విజయనగరం,మేజర్‌న్యూస్‌ః కార్మిక చట్టాల అమలకు 5లక్షల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టి.నరసింహన్‌ తెలియజేశారు.ఆదివారం స్థానిక అమర్‌ భవన్‌లో జరిగిన పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా పీఏసీఎస్‌ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.కార్మిక చట్టాల 150కి పైగా ఉన్నప్పటికీ అవేవీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ధరలు అదుపు చెయ్యడంలేదన్నారు.కార్మిక చట్టాలను అమలు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నాయన్నారు. జట్లు,ముఠాల పేరుతో 46 కోట్ల మంది కార్మికులు దయనీయంగా జీవితాలు నెట్టుకొస్తున్నారన్నారు.2004 నుంచి పింఛన్లు ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.పింఛను ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.46 కోట్లలో 40 కోట్ల మంది అసంఘటిత రంగాలలో కార్మికులగా ఉన్నారన్నారు.కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కార్మికులగానే ఉద్యోగ,సామాజిక భద్రత కోల్పోయారన్నారు.

మన రాష్ట్రంలో 5లక్షల మంది అసంఘటిత రంగంలో కార్మికులగా ఉన్నారన్నారు. ఈ వ్యవస్థను రూపు మాపి సామాజిక భద్రత కల్పించాలని తాము అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలు అధికంగా ఉన్న, లాభాలు ఆర్జించే బీహెచ్‌ఈఎల్‌ లాంటి సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు పరం చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకునే పెట్రో ఉత్పత్తుల కంపెనీలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పి నేడు ప్రైవేటు రంగాలు చెప్పిన మాటను జవదాటలేని కేంద్ర ప్రభుత్వం తొమిది నెలల్లో ఎనిమిది దఫాలు ధరలు పెంచిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్‌ ధర 34 శాతం ఉంటే మన ప్రభుత్వాలు 75 శాతం ధరలు పెంచి మధ్య, సామాన్య తరగతులు జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నెలకు రూ. కోటి తీసుకున్న జీతగాళ్ళు ప్రైవేటు ఆర్గనైజేషన్లలో ఉన్నారన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకు రూ. లక్ష గౌరవ వేతనంగా పొందుతున్న నేపథ్యంలో సామాన్యునికి కనీసం రూ. 10వేలు జీతంగా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు.

వీటిపై ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించి ఉద్యమాలను తీవ్రతరం చేసి కార్మిక చట్టాలు అమలకు ముందుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆయన విలేకరులకు వివరించారు.
జీఓ 151 యధాతదంగా అమలు చెయ్యాలి ః రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 జూన్‌ నెలలో చేసిన 151 జీఓ నేటికీ అమలు కాకపోవడంపట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా జీఓలు ప్రటించడం ఆ తరువాత వాటిని అమలు చెయ్యకపోవడం జరుగుతోందన్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ జీఓ చేసి మూడేళ్ళు అయినప్పటికీ ఏదో ఒక వంకపెట్టి పీఏసీఎస్‌ సిబ్బందిని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సొసైటీలకు వచ్చిన లాభాలపై వీరి జీతాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు.

ఒకపక్క రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సబ్సీడీలు ప్రకటిస్తూ, ఉచిత విద్యుత్తు ఇస్తూవుంటే ఏ విధంగా సొసైటీలకు లాభాలు వస్తాయని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇచ్చిన రుణాలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలన్నారు. సొసైటీలకు వచ్చే లాభాలతో సిబ్బంది జీతాలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.ఆధాయంతో వీరి జీతాలకు ముడిపెట్టినట్లైతే.. ఆదాయం రాని పాఠశాలలు, పోలీసు, మెడికల్‌ తదితర శాఖలు ఏమి లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.. వీరికి నెలయ్యేసరికి జీతాలు ఖజానాల ద్వారా అందజేయడం లేదా అని ఆయన నిలదీశారు. నేడు పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 1000, రూ. 1,500లు, రూ. 2000లు జీతంతో మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారో అనేది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న దేశంలో యూపీఏ, ఇక్కడ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు.

రాష్ట్రంలో పీఏసీఎస్‌లలో 10వేల మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా వీరు అరకొర జీతాలతో జీవితాలు సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం జీఓలమీద జీఓలు చెయ్యడమే తప్ప అమలు చెయ్యడం లేదని ఆయన విమర్శించారు. గత నెలలో పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ రాష్ట ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు నిరాహార దీక్షకు పూనుకోగా.. ఆ శాఖ కార్యదర్శి, మినిస్టర్‌ కాసు కృష్ణారెడ్డి తదితరులు వచ్చి రాజీమంత్రంతో దీక్షను విరమింపజేశారన్నారు. నాబార్డు, ఆప్కాబ్‌ స్టేట్‌, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లతో సమీక్షించి జీఓను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇటీవల సహకార శాఖలో ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వం తలచిందన్నారు.

ఈ భర్తీలో ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఒడుదొడుకులకు, ఒత్తిళ్ళకు సతమతమై పనిచేస్తున్న సిబ్బందిలో సీనియర్లను, అర్హత ప్రాతిపదికగా ఈ ఉద్యోగాల్లో భర్తీ చెయ్యాలని తమ యూనియన్‌ డిమాండు చేస్తోందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో మిగిలిన సంఘాలతో కలిసి సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా పీఏసీఎస్‌ సిబ్బంది తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు, ఉపాధ్యక్షుడు సాగి రంగరాజు, పీఏసీఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. రామునాయుడు, కార్యదర్శి వర్రి. సన్యాసిరావు, ఉపాధ్యక్షుడు బి. బాస్కరరావు, ఏఐబీఈఏ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యదర్శి నల్లా బాబాజీ, పీఏసీఎస్‌ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్‌పై కొమురం విగ్రహం
KomaramBheemహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ సాయుధ పోరా ట యోధుడు కొమురం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం గిరిజన శాఖ రూ.8 లక్షలను విడుదల చేయ నుంది. కొమురం భీమ్‌ విగ్రహం నమూనా ఇప్పటికే తయారైందని, నిధులు విడుదలైన వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే పనులను వేగవంతం చేస్తామని సాంస్కృతిక శాఖ మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి, డైరెక్టర్‌ కాంతారావు తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయని, వాటికి అదనంగా అదే వరుసలో కొమురం భీమ్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు.

ధ్వంసమైన విగ్రహాల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షలను మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు. విగ్రహాల రూపురేఖలు, ఎత్తు వంటి అంశాలపై చర్చించడానికి ఈ నెల25న ప్రముఖ శిల్పాచార్యులతో సమావేశాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశం అనంతరం సాంకేతిక, ఆర్థిక కమిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తా మని, ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలు, ప్రభుత్వం రూపొందించే నిబంధనల మేరకు విగ్రహాలను పునరు ద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశ లో ఉన్నాయని అన్నారు.

23 నుంచి ‘శతరూప’
ఈ నెల 23నుంచి పది జిల్లాల్లో పది రోజులు చొప్పున ‘శతరూప’ కళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయా జిల్లాల్లో పేరుపొందిన జానపద కళారూపాలతో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తా మని అన్నారు. 23న విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వచ్చేనెల 2న ఏలూరు, 14న నెల్లూరు, 22న చిత్తూరు, జులై 2న అనంతపురం, అదే నెల 12న కర్నూలు, 21న ఆదిలాబాద్‌, ఆగస్టు 1న నల్లగొండలో శతరూప కార్యక్రమాలు ఉంటాయని, ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌ ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అన్నారు.

రూ.3 కోట్లతో రవీంద్రభారతి, తెలుగు లలిత కళా తోరణంలో మరమ్మతులు చేయనున్నట్లు రమణమూర్తి, కాంతారావు తెలిపారు. లలిత కళాతోరణంలో మినీ థియేటర్‌ను నిర్మించే యోచన ఉందని అన్నారు. ఎంపిక చేసిన 13 విభాగాలకు చెందిన 26 మంది కళాకారులకు కళారత్న హంస అవార్డులతో సత్కరించనున్నామని, దీన్ని వచ్చేనెల రెండవ వారంలో నిర్వహిస్తామని అన్నారు. హంస అవార్డులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తామని చెప్పారు.
రాజ నర్సింహకే డిప్యూటీ సీఎం?
కొలిక్కి వచ్చిన కసరత్తు
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం, స్పీకర్, పీసీసీ చీఫ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ జరిపిన సమావేశంలో ఈ పోస్టులపై కసరత్తు ముగించారని, వారంలోగానే వీటిని భర్తీ చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం... డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.

స్పీకర్ పదవి విషయంలో ప్రస్తుత ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, సీఎం సన్నిహితుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న మంత్రి జె.గీతారెడ్డి పేరు కూడా లెక్కలోకి తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సారథ్యం విషయంలో ఐదు పేర్లను (కె.ఆర్.సురేశ్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ) పరిశీలించారు. సురేశ్‌రెడ్డికే ఈ పదవిని ఇవ్వాలని సీఎం కోరగా, మైనారిటీకి చెందిన షబ్బీర్ అలీకి ఇస్తే బాగుంటుందని ఆజాద్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
మహా పురుషుల విగ్రాలు వొద్దు అంటున్న దళిత నాయకులు  వరంగల్ జిల్లా పరకాల పట్టణములో మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని నెల కోలుపుటకు ఎటువొంటి చందాలు అడుగాకుంట నేరుగా విగ్రము తిశుకోచ్చి పరకాల బస్సు స్టాండ్ పరిదిలో ఒక ప్రక్కన ఉంచి జిల్లా నుండి మండలము నుండి పరకాల గ్రామము నుండి అన్ని అనుమతులు మాదిగ దండోరా జిల్లా ప్రతి నిధులు బోట్ల స్వామి మాదిగ జయక్క మాదిగ తీసు కున్నారు.ఇట్టి విగ్రమునకు ఇతర దళిత కుల సంఘాల నాయకులు ఇబ్బందులు సృష్టిస్తూ కొంత మంది కాంగ్రెస్ దళిత నాయకులు మేము బాబు జగ్జీవన్ రామ్ కాంస విగ్రాన్ని పెడుతము. కావున మాదిగ దండోరా సంక్షేమ సమితి తరుపున వొచ్చిన విగ్రము ఇక్కడ వొద్దు అంటున్నారు.వేరే మండలములో పెట్టండి.అంటూ వివిధ రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అంతేగాక వరంగల్లు MP సిరిసిల్ల రాజయ్య విగ్రము ఇస్తున్నాడు.  అంటూ ప్రచారము చేస్తూ పేపర్ ప్రకటనులు చేయు చేయుచున్నారు.ఇట్టి విషయాన్నీ మాదిగ దండోరా బోట్ల స్వామి మాదిగ సిరిసిల్ల రాజయ్య వోద్దకు తిసుకేల్లగా అట్టి కాంగ్రెస్ దళిత నాయకులను పిలిపించి మాట్లాడి ఇప్పుడు వొచ్చిన విగ్రాన్ని నెలకొలిపి తదుపరి కొద్ది రోజులకు కాంస విగ్రము పెడుదామని చెప్పారు.ఇట్టి మాటలు విన్నా కాంగ్రెస్ దళిత నాయకులు సరే అని తిరిగి వెళ్లారు.అందుకు బోట్ల స్వామి మాదిగ రాజయ్య గారికి ధన్యవాదాలు చెప్పి వొచ్చారు.18 -05 -2011 రోజునా బోట్ల స్వామి మాదిగ ఆధ్వర్యములో  భూమి  పూజ చేయగా అదేరోజు విగ్రము వొద్దు అని తెలిపిన కాంగ్రెస్ దళిత నాయకులు మరో బాబు జగ్జీవన్ రామ్ కమిటి వేశి అట్టి కమిటిలో మాదిగ దండోరా సంక్షేమ సమితి బోట్ల స్వామికు తెలుపకుండా బోట్ల స్వామిని కూడా అట్టి కమిటి లో మెంబరుగా ప్రకటించారు.ఇక్కడ ముఖ్య విషయము ఏమిటి అనగా గత ముప్పైదు ఏండ్లుగా దళితులే యి యొక్క నియోజక వర్గాన్ని పరిపాలించారు.కానీ నాటి  నుండి నేటి  వరకు పరకాల పట్టణములో ఎక్కడ బాబు జగ్జీవన్ రామ్ విగ్రాన్ని పెట్ట లేక పోయారు.ఇప్పుడు పెడుతున్న విగ్రమునకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు.ఇది ఎంత వరకు న్యాయము......మరో విషయము ఏమిటి అంటే మాదిగ దండోరా వారు తెచ్చిన విగ్రము ఎనిమిది ఫీట్ల ఎత్తు మూడు ఫీట్ల ఎడేలుపు కలదు.ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి అంటే ......ఇన్ని రోజుల నుండి కొంత మంది సీనియర్ దళిత నాయకులు ఇప్పుడు వొచ్చిన మాదిగ దండోరా తరుపు  విగ్రాన్ని యెరుపాటు చేస్తే మా బావిత్వ్యము ఏమిటి అనే ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది.వరంగల్ జిల్లలో మరో విషయము ఆస్వా రాయి పల్లి గ్రామము రఘునాధ పల్లి మండలము లో కూడా మాదిగ దండోరా సంక్షేమ సమితి నుండి ఎటువొంటి చందాలు వోసులు చేయకుండా  అంబేద్కర్ విగ్రాన్ని కూడా తెచ్చారు.ఇక్కడ ఇంకా మహా గోరము జరిగింది.ఇట్టి విగ్రాన్ని నేలా కోలుపటము చూసి జీర్ణించుకోలేని కొంత మంది దురుమర్గులు భారత రత్న అంబేద్కర్ విగ్రాన్ని కొద్దిగా ద్వంసము చేసారు.ఇట్టి కేసు వరంగల్ జిల్లా DSP  పరిదిలో ఉన్నది నేటికి అట్టి కిరాతకులను పట్టుకోలేక పోయారు.చివరకు అంబేద్కర్ విగ్రానికి వోరికోత మిషిని తగిలినది  అని చేతులు దులుపుకున్నారు.నేడు మహా పురుషులకే యిన్ని  అవమానాలు జరుగు తుంటే పట్టించు కోవటము లేదు యి ప్రబుత్వం మరి సాదారణ దళితులకు అన్యాయము జరిగితే దిక్కు ఎవరు..................ఓ దళిత జాతి మెదవులరా ఆలోచించండి ........................మన జాతి మహా పురుషుల విగ్రాలను పెడుదాం వారి అడుగుజాడలలో నడుద్దాం వారి ఆశయాలను సాదిద్దాం దళిత జాతిని అబివృద్ది చేద్దాం ...............................మాదిగ దండోరా సంక్షేమ సమితి

ఆస్తమించిన హక్కుల సూరీడు

హన్మకొండ, మే 14 : మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బుర్రా రాములు శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రాములు పరిస్థితి మరింత క్షీణించడంతో హన్మకొండలోని ప్రౖౖెవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సుమారు 1.20 గంటలకు కన్నుమూశారు. ప్రొఫెసర్ రాములు మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు, మానవహక్కుల కార్యకర్తలు, సహాద్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భోరున విలపించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఓరుగల్లు కోటలో పుట్టి: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రాములు స్వస్థలం వరంగల్ పడమర కోట. ఉద్యోగ రీత్యా ఆ యన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని క్వార్టర్‌లోనే పదేళ్లుగా ఉంటున్నారు. డాక్టర్ రాములుకు భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్ళు జన, రణ, తల్లి ఐల మ్మ, ఇద్దరు సోదరులు, అయిదుగురు చెల్లెళ్ళున్నారు. సోదరుడు బుర్రా రమేష్ భోపాల్‌లోని ఎన్‌సిఆర్‌టిలో ప్రొఫెసర్. మరో సోదరుడు భాస్కర్ బ్యాంక్ మేనేజర్.

రాజ్యహింసకు వ్యతిరేకంగా... ప్రొఫెసర్ రాములు తన యావజ్జీవితాన్ని మానవ హక్కుల పరిరక్షణ కోసమే వెచ్చించారు. ఎక్కడ హక్కులకు భంగం కలిగితే అక్కడ వాలేవా రు. నిజనిర్ధారణ జరిపేవారు. బాధితు ల పక్షాన గళం విప్పేవారు. రాజ్యాన్ని ప్రశ్నించేవారు. రాజ్యహింసను నిర్భయంగా నిలదీసేవారు. అణగారిన వర్గాల పక్షాన న్యాయం కోసం పోరాడేవారు. ఫ్రొఫెసర్ బుర్రా రాములు కేయూలో అధ్యాపకుడిగా కన్నా మానవహక్కుల నేతగానే సుపరిచితుడు. మొదట పౌర హక్కుల నాయకుడిగా, ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ఫోరం రాష్ట్ర నేతగా ఆయన ప్రస్థానం కొనసాగింది.

అంచెలంచెలుగా 1954 జూన్10వ తేదీన ఖిలా వరంగల్‌లో మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన ప్రొఫెసర్ రాములు ఉ న్నత విద్యావేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు. మానవహక్కుల హరణకు వ్య తిరేకంగా ప్రశ్నించు, నినదించు అని నిత్యం ప్రభోదించారు. పాఠశాల చదు వు ఖిలా వరంగల్‌లోనే సాగింది. 1978లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1980లో ఎంఏ, ఇదే విశ్వవిద్యాలయం నుంచి 1985లో ఎంఫిల్, 1990లో పిహెచ్‌డి పట్టాపుచ్చుకున్నారు. అగ్రికల్చరల్ ఎకనమిక్స్, పొలిటికల్ ఎకనమిక్స్‌లో నిష్ణాతులు. ఆయనకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రెండే.

విస్తృతంగా పరిశోధనలు విద్యాబోధనతో పాటు మరో ప్రక్క గ్రా మీణ జీవన స్థితిగతులపై పరిశోధనలను కూడా కొనసాగించారు. 1996లో యూజీసీ సహకారంతో తెలంగాణలో గ్రామీణ అనియత మార్కెట్లపై రెండేళ్ళే పరిశోధన చేశా రు. 2000 సంవత్సరంలో కేరళలోని తిరువనంతపురం సీడీసీ ఆర్ధిక సహకారంతో మూడేళ్ళ పాటు గ్రామాల సైద్ధాంతిక పునఃసర్వే-గ్రామీణ జీవనంపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. 2007 ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన సదస్సులో మానవ హక్కుల అభ్యసనానికి భోధనాపరమైన పాఠ్యాంశాల రూపకల్పన పై పరిశోధనా పత్రాన్ని సమర్పించా రు.

అధ్యాపకుడిగా... 1983 నుంచి 1994 వరకు యూనివర్సిటీ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1994 నుంచి 2008 వరకు యూనివర్సిటీ కళాశాల, పీజీ కళాశాలలో తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎస్‌డీఎల్‌సీ, తెలుగు అకాడెమికి అవసరమైన పాశ్యాంశాలను, పుస్తకాలను, ఇతర మెటీరియల్‌ను సమకూర్చారు. జాతీయ సాక్షరతా మిషన్ కింద సెంటర్ ఫర్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అక్టివిటీస్ ప్రొగ్రాం ఆఫీసర్‌గా రెండు సంవత్సరాలు పని చేశారు.

హక్కుల కోసం నిత్యం పోరు విద్యాబోధనతో పాటు చుట్టూ ఉ న్న సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ఆయన నిత్యం తీవ్రంగా స్పందించేవారు. హ క్కుల హరణను ఆయన ఏనాడు సహించేవారు కాదు. వాటి పరిరక్షణ కు ఎంతటి ప్రతిఘటననైనా, ఒత్తిళ్ళపైనా నిర్భయంగా ఎదుర్కొనేవారు. ఎంత దూరమైన వెళ్ళేవారు. రాజ్యం ఆయనను ఎంతగా భయపెట్టాలని చూసినా అంతకు రెండింతలు దానికే సింహస్వప్నంగా నిలిచారు. మానవహక్కుల రాష్ట్ర అధ్యక్షుడిగా అట్టడుగువర్గాలకు అండగా నిలిచారు. విద్యార్ధి దశలో కళాశాలలో, విశ్వవిద్యాలయంలోనూ విద్యార్ధి ప్రతినిధిగా వారి హక్కుల కోసం డా. రాములు పోరాడారు. అధ్యాపకుడిగా కూడా తన వం తు సేవలను అందించారు.

సాంస్కతిక రంగంలోనూ.. సాంస్కృతిక, క్రీడా తదితర కమిటీల్లో సభ్యునిగా కీలక పాత్రలు పోషించారు. పలు సంస్ధలతో అయనకు అనుబంధం ఉంది. ఇండియన్ పొలిటికల్ ఎకనమి, ఎపిఈఏలలో ప్రొఫెసర్ రాములు సభ్యుడు. మహిళా అధ్యయానాలపై ముద్రించిన కాకతీయ యూనివర్సిటీ జర్నల్‌కు సంపాదకత్వం కూడా వహించారు.

రచయితగా.. ప్రొ.రాములు సామాజిక అంశాలు నేపధ్యంగా పలు పుస్తకాలను రాశారు. 1995లో ఇదో సారాకథ, 2005లో ప్రాచీన భారత రాజకీయ ఆర్ధిక నిర్మాణాలను ప్రతిబింబించిన మహిళల జీవితం, స్వాతంత్య్రానంతర భారత దేశం-స్త్రీల స్థితిగతులు, నమూనా రూపాంతరం- మానవ అభివృద్ధి-జీవితం వీటిలో కొన్ని. మానవ జీవితంతో ముడిపడిన వివిధ అంశాలను స్పృషిస్తూ అయన రాసిన అనేక వ్యాసాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

వరంగల్ హక్కుల పెద్దదిక్కు

ఒక ఏడాది ఏడాదిన్నకాలంలో తెలుగునేల మీద హక్కుల ఉద్యమం చాలా విషాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. డాక్టర్ సి.ఆర్.రాజగోపాలన్, ఎస్.ఆర్. శంకరన్, కె .జి. కన్నబిరాన్ ఇంచుమించు నిండు జీవితాలు గడిపి పోయారనుకుంటే గొట్టిపాటి నరేంద్రనాథ్, కె.బాలగోపాల్‌లు అర్థాంతరంగా వెళ్ళిపోయారు. ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి హక్కుల ఉద్యమం కూడదీసుకుని గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమం బలం పుంజుకుంటున్న తరుణంలో ఇప్పుడు బుర్రా రాములు పోయారు.

డాక్టర్ బుర్రా రాములు మానవ హక్కుల సంఘం మొదటి అధ్యక్షుడు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు. బాల్‌గోపాల్, బుర్రా రాములు ఇద్దరూ ఒకే వయసులో 57వ ఏట పోయారు. 1953లో కాళోజీ 'నా గొడవ' ఆవిష్కరిస్తూ శ్రీ శ్రీ ఆయనను లూయీ ఆరగాన్‌తో పోల్చారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో ఫ్రాన్స్‌లో కవులందరూ యుద్దరంగానికి దూరంగా ఉంటే అరగాన్ ఒ క్కడూ నిలిచి పోరాడాడు. 1985లో రామనాథం హత్య తర్వాత ఇంచుమించు ఒక దశాబ్దంపాటు కొనసాగిన నిర్బంధంలో వరంగల్‌లో హక్కుల ఉద్యమంలో నిలబడి కలబడినవాడు బుర్రా రాములు. కాళోజీ ఉన్నంత కాలం ఆయనతోపాటు నిలబడినారు.

1989-90 నాటికి నర్రా ప్రభాకర్ రెడ్డి సాహసించి పౌరహక్కుల రంగంలోకి అభిమన్యునివలె దూకగానే ఆయనకు వెన్నుదన్నుగా నిలబడినాడు. టాడా వంటి దారుణ అణచివేత చట్టాలతో పోరాడుతూ నర్రా ప్రభాకర్ రెడ్డి పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుని వలె నే అమరుడయ్యాడు. రాజ్య హత్యకు డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల వలెనే గురయ్యాడు. అప్పుడు హక్కుల కాడిని బుర్రారాములే ఎత్తు కోవాల్సి వచ్చింది.

పైగా యువ కార్యకర్తలెవరూ వరంగల్ వంటిచోట రాజ్యం కన్నెర్రకు గురయితే నిలదొక్కుకోవడం క ష్టం గనుక బాలగోపాల్ నాయకత్వ బాధ్యతలు బుర్రా రాములుపైననే మోపుతుండేవాడు. ముఖ్యంగా కాళోజీ కూడా కన్నుమూసిన తర్వాత వరంగల్‌లో హక్కుల ఉద్యమానికి మిగిలిన పెద్ద దిక్కు బుర్రా రాములే అయ్యాడు. ఆ లోటు ఒక లాటిన్ అమెరికా నగరాన్ని తలపించే వరంగల్‌తో నాలుగు దశాబ్దాల సన్నిహిత పరిచయం చేయటమే తప్ప ఎంత పూడ్చుకోలేనిదో పోల్చుకోలేం.

బుర్రా రాములు వరంగల్‌లో పుట్టి అక్కడ సామాజిక ఉద్యమాలతో ఎదిగాడు. 1974లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూండెంట్స్ యూనియన్ ఏర్పడినప్పుడు దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సికెఎం కాలేజి విద్యార్థి సత్యనారాయణరావు ఎన్నికయ్యాడు. అప్పటికే సత్యనారాయణరావుతో వరంగల్ ప్రజాస్వామిక విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో చరుకుగా పాల్గొంటున్న బుర్రా రాములు పీడిఎస్‌యు జిల్లా నాయకుడయ్యాడు. 1980 నాటికే ఆయన పిడిఎస్‌యు రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వచ్చాడు. 1978 నుంచి 84 వరకు వరుసగా కాకతీయ యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాల ఐక్య సంఘటనయే ఎన్నికల్లో గెలిచింది.

1982లో బుర్రా రాములు అధ్యక్షుడుగా, పులి అంజయ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెయు విద్యార్థి సంఘం బహుశా యూనివర్సిటీ చరిత్రలో విప్లవ అక్షరాలతో లిఖించ దగినది. పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, లింగమూర్తి వంటి విప్లవ విద్యార్థుల సాహచర్యంలో బుర్రా రాములు ఆర్ఎస్‌యు, పిడిఎస్‌యుల సైద్ధాంతిక, మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ కూడా ఉజ్వలమైన ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాన్ని క్యాంపస్‌లో నిర్మాణం చేయడానికి దోహదం చేసినాడు.

బుర్రా రాములు అర్థ శాస్త్రంలో ఎంఏ చేసి ప్రొఫెసర్ శివరామకృష్ణ రావు దగ్గర పిహెచ్‌డి చేసి కాకతీయ అర్థశాస్త్ర విభాగంలోనే అధ్యాపకుడుగా చేది ప్రొఫెసర్ అయ్యాడు. పుట్టిన ఊళ్ళో జ్ఞానం తెలిసిన దగ్గర్నుంచీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చదువుతూ, సమాజాన్ని చదువుతూ పోరాడుతూ ఉన్నత విద్యలు పొందడమే కాకుండా నిరంతరం ఆ విద్యను సమాజపరం చేస్తూ తన ఊరికి, ప్రజలకు సేవ చేయడం కేంద్రంగా పెట్టుకొని దేశమంతా విస్తరించడం ఒక సార్థక జీవితం.

బాలగోపాల్ తర్వాత హక్కుల సంఘాల్లో అంతే విస్తృతంగా తిరిగిన హక్కుల కార్యకర్తలు చాల తక్కువగా ఉంటారు. కాశ్మీరు, మణిపూర్, ఛత్తీస్‌గడ్‌లలో ఎక్కడ రాజ్యహింస తన దమన నగ్న రూపంతో విరుచుకుపడితే అక్కడికి నిజనిర్ధారణ సంఘాల్లోనూ, పోరాట సంఘీభావ పర్యటనల్లోనూ రాములు వెళ్ళేవారు. అక్కడ ప్రజలపై రాజ్యహింసను ఇక్కడ వివరించి ఒక సమన్వయాన్ని, సంఘటన సంఘీభావాన్ని నిర్మించడానికి కృషి చేసిన హక్కుల ఉద్యమ నాయకుల్లో బుర్రా రాములు ఒకరు. రాములు ప్రయత్నపూర్వకంగా ప్రజల భాషలో ప్రజలతో మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నాడు.

ప్రజలకు సులభమయ్యే పద్ధతిలో, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు అర్థమయ్యే ఉపన్యాస ధోరణిని ఆలవోకగా అందిపుచ్చుకున్నాడు. బుర్రా రాములు సాహిత్య రంగంలో కూడా అరుదయిన కృషి చేశాడు. ఇటీవలి కాలంలో చాల కథలు రాసాడు. సైద్ధాంతిక, విశ్లేషణ వ్యాసాలు రాశాడు. రావిశాస్త్రి ఆరు సారా కథలకు కొనసాగింపుగా ఆయన రాసిన 'ఏడో సారా కథ' ఎంతో చర్చితమై ప్రచారాన్ని పొందింది. సాహిత్య సమవాకారం పేరుతో తేన్నేటి సూరి, స్వర్గంలో పాణిగ్రాహి పేదుతో శివసాగర్ రాసిన ఫ్యాంటసీల తర్వాత బుర్రా రాములు రాసిన ఏడో సారా కథయేనని బాలగోపాల్‌వంటి సాహిత్య విమర్శకులు అభిప్రాయపడ్డారు.

బుర్రా రాములు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంగా భావించి అందులో వరంగల్ జిల్లావరకు విస్తృతంగా పర్యటించాడు. వరంగల్ బయట చాలా ముఖ్యమైన మానవ హక్కుల వేదిక కార్యకలాపాలు లేని సమయమంతా ఆయన తెలంగాణ ఉద్యమానికే కేటాయించాడు.

పెదముప్పారంలో జరిగిన అటువంటి సభలో నాకు కూడా ఆయనతో పాటు పాల్గొనే అవకాశం కలిగింది. మిట్టుపల్లి సరేందర్ 'శంకరా' అని ఒక అమరునిపై రాసిన పాట అడిగి పాడించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజలకోసం ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి రంగంలో, హక్కుల రంగంలో కృషి చేస్తున్నా బుర్రా రాములు ఏకాకిగా తన కుటుంబపరంగా ఎంతో ప్రయాసను, కష్టాలను అనుభవించాల్సి వచ్చింది.

ఆయన సహచరి ఏడాది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయి నెలల తరబడి హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. అమె ఇంకా కోలుకోకుండానే జనవరి నెలలో బుర్రా రాములుకు క్యాన్సర్ అని బయటపడింది. క్యాన్సర్ వ్యవస్థతో పోరాడుతున్న వ్యక్తి బుర్రా రాములు తన అనారోగ్యాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

కానీ చాలా వేగంగా ఆయన శిథిలమవుతూ పోయాడు. మే 10వ తేదీన సికిందరాబాదు యశోదా ఆసుపత్రిలో ఆయనను ఆఖరి సారిగా చూడాలని వెళ్ళినపుడు శరీరం నిండా బంధనాలతో, కృత్రిమ శ్వాసతో ఉన్న ఆయనను 'గుర్తు పట్టారా?' అని అడిగాను. 'అయ్యో?!' అన్న ఆయన వ్యక్తీకరణ - అదేం ప్రశ్న అన్న ఆయన అలర్ట్‌నెస్-అదే ఆయన హక్కుల ఉద్యమంలో చూపిన అనవరత ప్రజాస్వామిక జాగరూకత! చిరకాల మిత్రునికి కన్నీటి వీడ్కోలు...

-వరవరరావు

ఆకలితో ఎవరూ చనిపోరాదు

  • 150 పేద జిల్లాలకు అదనపు ఆహార ధాన్యాలు
  • కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • బిపిఎల్‌ నిబంధనల సవరణకు సూచన
దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తాము నియమించే కమిటీ పర్యవేక్షణలో దేశంలోని 150 పేద జిల్లాలకు అదనంగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్‌ డిపి వాద్వా కమిటీ మార్గదర్శకంలో సమాజంలోని పేదలకు ఈ వేసవిలో అదనంగా ఆహార ధాన్యాలు పంచాలని జస్టిస్‌ దల్వీర్‌ భండారి, దీపక్‌ వర్మతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ఈ కమిటీ కేంద్రంతో చర్చించి, బలహీన సెక్షన్ల ప్రజలను గుర్తిస్తుందని, లక్ష్యిత లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను సిఫార్సు చేస్తుందని కూడా ధర్మాసనం చెప్పింది. కేంద్రం తమకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగా వినియోగించుకోవాలని, తర్వాత అదనంగా కేటాయించిన వాటిని పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా కోర్టు ఆదేశించింది. ఆకలి చావులతో దేశంలో ఎక్కువ మంది మరణించడంపై ఈ నెల 10న కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రెండు వారాల్లో 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదాములు నిండిపోతే లేదా ఆహార ధాన్యాలు పాడైపోతుంటే దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్‌) కుటుంబాలకు, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కుటుంబాలకు వాటిని సబ్సిడీ ధరలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని కోర్టు మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌లో తరచూ భారీ సంఖ్యలో ఆహార ధాన్యాలు పాడైపోతున్నాయని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియుసిఎల్‌) అనే సంస్థ చేసిన ఫిర్యాదుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. 'పేదలకు వాటిని సబ్సిడీ ధరలపై ఎందుకు సరఫరా చేయకూడదు' అని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించింది. 'మేము మిమ్మల్ని మళ్లీ కోరుతున్నాం. వాటిని పంపిణీ చేయండి. భారీ ఖర్చుతో మీరు ఆహార ధాన్యాలను సేకరిస్తున్నారు. అయితే కొత్త పంటల ద్వారా వచ్చే ధాన్యాన్ని నిల్వ చేయడానికి మీకు తగిన సామర్థ్యం లేదు. పంటల దిగుబడి బాగా వచ్చిన ప్రతిసారీ ఇలాంటి సందర్భాలే ఎదురవుతున్నాయి. దేశంలో మూడు వేల మంది ఆకలితో చనిపోయి ఉండొచ్చు. మూడు వేలు కాదు, మనలాంటి దేశంలో ఆకలితో కనీసం ముగ్గురు చనిపోయినా అది తీవ్ర ఆందోళనకరం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బిపిఎల్‌ నిబంధనలు సవరించాలి..
దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్‌) వారిని నిర్ణయించేందుకు ప్రస్తుతమున్న తలసరి నిబంధనలను సవరించాల్సిందిగా ప్రణాళిక సంఘానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. మార్చి 2011 లేదా తదనంతర తేదీలను పరిగణనలోకి తీసుకొని నిబం ధనల్లో మార్పులు చేయాలని సూచించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా దల్వీర్‌ భండారి, దీపక్‌ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ప్రణాళిక సంఘం ప్రకారం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.15, పట్టణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.20. 'బిపిఎల్‌కు దిగువనున్న వారెవరు?' అనే దానికి కొలబద్ద ఇదేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల దినసరి తలసరి ఆహారం కంటే తక్కువ తినేవారు బిపిఎల్‌ పరిధిలోకి వస్తారని నిర్వచించారు. దీన్ని ప్రస్తావిస్తూ .. టెండూల్కర్‌ కమిటీ ప్రకారం 2011 ధరలను బట్టిచూస్తే గ్రామాల్లో రూ.15కు 2100 కేలరీలు, పట్టణాల్లో రూ.20కు 2400 కేలరీల ఆహారం లభించడం అసాధ్యమని సుప్రీం పేర్కొంది. పట్టణాల్లో రూ.20 కంటే ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్లు, గ్రామాల్లో రూ.15 కంటే ఎక్కువ దినసరి ఆదాయం వచ్చే వాళ్లలో చాలా మంది సబ్సిడీ ధరలకు ఆహారాన్ని పొందేందుకు అర్హులని సుప్రీం తెలిపింది.

కుల దురహంకార హత్యలు


రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలూ, అమానుషాలూ, దాడులూ, దౌర్జన్యాలూ ప్రతి ఒక్కరి మనసునూ కదిలించేలా వున్నాయి. కారణాలు-కాలాలు, ప్రాంతాలు-పాత్రలు వేరైనా ఈ దారుణ దృశ్యాలన్నిట్లోను బాలికలు, మహిళలే సమిధలు కావడం విషాదం. పురుష దురహంకారము, కుల క్రౌర్యమూ వేయి చేతులు చాచి అమాయక మహిళలను బలితీసుకోవడం నవ నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖండనలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం బాధ్యతారాహిత్యానికి, రాజకీయ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం మినహా మరోటి కాదు. అపురూపంగా చూసుకోవాల్సిన ఆడపిల్లలు, మహిళల ప్రాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పురుషాహంకారానికి, కుల దురహంకారానికి గాల్లో దీపాల్లా కొండెక్కిపోతున్నాయి. సర్కారు వైద్యుల నిర్లక్ష్యమూ, అత్యవసర ఔషధాలను అందుబాటులో వుంచాల్సిన ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమూ ర్యాబిస్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అనూష ప్రాణాలను బలిగొంది. 'కాపాడలేవా అమ్మా' అన్నట్టు తననే దీనంగా చూస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన కూతురును మరవలేని ఆ నిరుపేద తల్లి ఆవేదన అర్థమయ్యేదెందరికి? తననే ప్రేమించాలని, పెళ్లాడాలని వేధించి, నిరాకరించిన పాపానికి పాఠశాల ఉపాధ్యాయిని సుందరమ్మ ప్రాణాలు తీశాడో విశాఖ మృగాడు. ప్రేమించడానికి అవసరం లేని కట్నం పెళ్లి చేసుకోడానికి మాత్రం తప్పనిసరట! ఇదెక్కడి న్యాయమని అడిగితే కట్నమే పరిష్కారమని తెగేసి చెప్పాడో ఆదిలాబాదీ. నాడు తియ్యతియ్యటి ప్రేమ పాఠాలు వల్లించి వలలో వేసుకుని నేడు తిరస్కరణ అస్త్రాన్ని సంధించేసరికి తట్టుకోలేక ఆరిపోయిందో అమాయక జ్యోతి. చట్టాన్ని, న్యాయాన్ని అనుక్షణం కాపాడాల్సిన కానిస్టేబులే ప్రేమ పేర వంచించి మరో యువతిని పెళ్లాడాడు. పెద్దల ఆశీస్సులతో అతగాడి జీవితం సెటిలై పోయినా...సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుచుకుతినే లోకుల మధ్య ఒంటరైంది మాత్రం ఒక మహిళే. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతకు ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే కష్టనష్టాలు, చేదు అనుభవాలు ఎన్నెన్నో?! తక్కువ కులాల వారిని పెళ్లాడిన అమ్మాయిలకు మన రాష్ట్రంలోనూ ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతున్నాయి. కని, పెంచి, పెద్దచేసిన అమ్మానాన్నలే కుటుంబ గౌరవం పేరిట యమకింకరుల అవతారమెత్తి ప్రాణాలు హరించడం కలవరపెడుతోంది. మహబూబ్‌నగర్‌ మాధవి, శ్రీకాకుళం లల్లి చేసిన నేరమల్లా దళిత యువకులను ప్రేమించడమే. నిర్దయగా కన్నవారే వారిద్దరినీ కాటికి సాగనంపేశారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని పరువు తక్కువగా భావించిన ఓ తండ్రి ఏకంగా గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకోవడం వంటి దృశ్యాలు నోట మాట రాకుండా చేస్తున్నాయి. సామాజిక అసహనం ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతలా విభ్రాంతి కలిగించే స్థాయిలో వుందో తెలుస్తోంది. ఇక్కడ కూడా మొదటగా బలవుతోంది మహిళలే.
పరువు పేరిట కుల దురహంకారంతో మహిళలను మట్టి చేసే సంస్కృతి ఉత్తరాదికే పరిమితమని ఎవరైనా భావిస్తుంటే ఈ దారుణ ఉదంతాలు వారికి కనువిప్పు కల్గించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరువుహత్యలపై జరిగే క్రతువును ఖండించడానికి ప్రజాప్రతినిధులు సైతం ముందుకు రారు. ఓట్లకోసం చూసీచూడనట్టు నటిస్తుంటారు. మన రాష్ట్రంలో ఈ విషయంలో ఏవైనా భిన్న పరిస్థితులున్నాయా? అని ప్రశ్నించుకుంటే ఒళ్లు గగుర్పొడిచే సమాధానమే లభిస్తుంది. మహిళాసంఘాలు, అభ్యుదయకాముక శక్తులు అరచిగీపెట్టినా, పార్లమెంటులో చర్చ లేవదీసినా ప్రయోజనం స్వల్పం. వామపక్షాలు మరీ ముఖ్యంగా సిపిఎం మినహా మరెవరూ ఈ సమస్య పరిష్కారానికి, చర్చకు, చట్టరూపకల్పనకు కదలలా! కంఠం విప్పలా! ప్రస్తుతం కుల రాజకీయాలు క్రియాశీలమౌతున్న మన రాష్ట్రంలో కులదురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలకు యువతీ యువకులు ముందుకు రావడం సంతోషకరం. అయితే అలాంటి పెళ్లిళ్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిలదొక్కు కోవాలంటే దళితులు, ఇతర కిందికులాల ఆర్థిక స్థితిలోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలు ఇందుకు పూనుకోవాలి. పూనుకొనేలా చేసే ఉద్యమాలు రావాలి. కుల దురహంకారంతో జరిగే హత్యలను హానర్‌ కిల్లింగ్స్‌గా ఇంగ్లీషు మీడియా అభివర్ణించడం కూడా విస్మయం కలిగించేదే. తెలుగులో కిల్లింగ్‌ను హత్యగా పేర్కొనడం సముచితమే. అయితే దురహంకారాన్ని పరువుగా పేర్కొనడ మెందుకన్నది ఓ ప్రశ్న. పరువుప్రతిష్టలే ప్రాణంగా భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలు తక్కువ కులం వారిని వివాహమాడ్డాన్ని తట్టుకోలేక బలితీసుకున్నట్టు అభివర్ణించే ధోరణి నిస్సందేహంగా తప్పుడు ధోరణే. కులదురహంకారంతో జరిగే హత్యలను అరికట్టడంపై మన ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించాలి. ఈ హత్యాకాండలో పాల్పడినవారికి కఠినశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి
  ప్రపంచ అమ్మ దినోత్సవ శుభాకాంక్షలు

ఎస్సీ, ఎస్టీల గోడు పట్టని సర్కార్‌                                                                          కమిషన్‌కు ఛైర్మన్‌ కరువు

  • 19,413 కేసులు పెండింగ్‌
  • హామీలు బుట్టదాఖలు
దళితులు, గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాస్తోంది. వారి సమస్యలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం, ఎక్కడైతే దళితులు అణచివేతకు గురువుతున్నారో అక్కడ చైతన్యం తీసుకురావడం, వారి హక్కులను కాపాడటం, వివక్షతకు గురైతే తగిన న్యాయం చేయడం తదితర బాధ్యతలను కమిషన్‌ నిర్వర్తిస్తుంది. ఈ కమిషన్‌కు రిటైర్డ్‌ న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించాల్సి ఉంది. వివిధ దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు కూడా న్యాయమూర్తినే ఛైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వానికి సూచించారు. కానీ, ప్రభుత్వం ఈ నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్‌ మెరుగు నాగార్జునను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారు.
నాగార్జున ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కిందనే కాకుండా వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 23,773 కేసులు నమోదయ్యాయి. వీటిలో కేవలం 4,360 (19 శాతం) కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలినవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నాగార్జున తన వ్యక్తిగత కారణాలతో ఛైర్మన్‌ పదవికి 2009లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించలేదు. ఛైర్మన్‌ను నియమించకపోవడానికి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఆందోళన కూడా ఒక కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులత్లో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించినా ఇబ్బందులెదురవుతాయనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దళితుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే సమయంలో దళిత, గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులో నారాయణవనం మండలం, బొప్పరాజుపాళ్యంలోని లక్షీపురం గిరిజన కాలనీలో దాదాపు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు స్వాతంత్య్రం రాకముందు నుంచి 278 సర్వే నెంబరులోని 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. సజ్జలు, జొన్నలు, కందులు, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు ఆ భూములకు సంబంధించిన పట్టాలను ప్రభుత్వం ఇవ్వలేదు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారికి పట్టాలివ్వాలి. ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
మరోవైపు దళిత, గిరిజనులపై అనేక రకాలుగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌ మండంలోని దళితులు భూములను అమ్ముకోకుండా వ్యవసాయం చేసుకుంటున్నారనే అక్కసుతో నలుగురిని సజీవదహనం చేశారు. సజీవదహనం సంఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. కమిషన్‌ ఉన్నట్లయితే ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుంటుందని ఎస్సీ,ఎస్టీ సంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు. బాణామతి. చేతబడులు చేస్తున్నారనే నెపంతో పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.
దీక్షతో దిగొచ్చినా...
దళిత, గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, ఆ పార్టీ ఇతర నేతలు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మార్చి 17న దీక్ష చేపట్టారు. ప్రధాన ప్రతిపక్షం నుంచి మొదలుకొని ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. శాసనసభలో రెండు రోజలుపాటు చర్చ జరిగింది. ఎట్టకేలకు దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాకుండా రాఘవులు పెట్టిన డిమాండ్లలో సాధ్యమైనన్ని పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. దాదాపు రెండు నెలలు పూర్తికావస్తున్నా ఏ ఒక్క సమస్యనూ ప్రభుత్వం పరిష్కరించలేదు.

హైకమాండ్‌కు మూడ్ వచ్చింది
త్వరలో మూడు కీలక పదవుల భర్తీ
డిప్యూటీ సీఎం రేసులో రాజనర్సింహ ముందంజ

నాదెండ్లకే స్పీకర్‌గా పదోన్నతి!
ఇంకా తేలని కొత్త పీసీసీ చీఫ్
నేడు ఢిల్లీకి డీఎస్.. ఆజాద్‌తో భేటీ
కడప ఫలితాల తర్వాత ఢిల్లీకి సీఎం
న్యూఢిల్లీ, హైదరాబాద్, మే 7 : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. చాన్నాళ్లుగా నాన్చుతూ వస్తున్న డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవుల భర్తీతో పాటు పీసీసీ సారథ్య బాధ్యతలను కొత్త నేతకు అప్పగించే దిశగా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు మొదలెట్టింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాం«ధీని శనివారమిక్కడ కలిశారు. పార్టీ వ్యవహారాలు, తెలంగాణ అంశాలపై ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ వంటి కోర్‌కమిటీ సభ్యులతో శుక్రవారం చర్చించిన సీఎం.. సోనియాతో జరిపిన సమావేశంలోనూ ఆ అంశాలను ప్రస్తావించేందుకు యత్నించారు.

ఉప ఎన్నికల తరువాత పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడదామని సీఎంకు సోనియా ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే.. సీఎంతో సమావేశానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగర్వాల్‌లు సోనియాతో సమావేశమయ్యారు. గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన ఎన్ఎండీసీ వివాదం పరిష్కారంలో అలసిపోయిన సోనియా.. సీఎం కిరణ్‌తో జరిగిన భేటీలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కూలంకషంగా మాట్లాడలేకపోయారు.

ఈ భేటీలో కడప ఉప ఎన్నికల గురించే ప్రస్తావనకు వచ్చిందని.. ఇతర అంశాలపై పెద్దగా చర్చ జరగలేదని పార్టీ వర్గాల వివరించాయి. కడప ఫలితాల తర్వాత సీఎం కిరణ్ మరో మారు ఢిల్లీ వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సందర్భంగా.. సంస్థాగత అంశాలపై అధిష్ఠానం దృష్టి సారించనుంది. కాగా.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాం నబీ ఆజాద్ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ భేటీలో వీరు రాష్ట్ర వ్యవహారాలపై సమగ్రంగా చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం రేసులో అగ్రస్థానంలో రాజనర్సింహ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇన్నాళ్లూ తనమునకలైన కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటుండడంతో.. రాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ అంశంపై అటో ఇటో తేల్చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అధిష్ఠానానికి ఇచ్చిన అల్టిమేటం.. దానిపై మే రెండో వారంలో మళ్లీ భేటీ అవుదామంటూ ఢిల్లీ పెద్దలు ఇచ్చిన హామీలపై అధిష్ఠానం దృష్టిసారించనున్నది. స్పీకర్, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయం తీసుకోవాలన్న దృఢ నిర్ణయంలో అధిష్ఠానం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలో అప్పటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ.. తెలంగాణ ప్రాంతానికి చెందినవారికి డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి లభిస్తుందనీ స్పష్టం చేశారు. దీంతో.. ఈ పదవిలో మంత్రులు జె.గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహల పేర్లు నాడు ప్రముఖంగా విన్పించాయి. అయితే.. వీరిలో రాజనర్సింహ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందని సమాచారం.

నాదెండ్ల లేదా ఉత్తమ్‌కుమార్‌కు స్పీకర్‌గా అవకాశం
ఇక శాసనసభాపతి విషయంలోనూ అధిష్ఠానం తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. సీఎం కిరణ్ మాత్రం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదే సమయంలో పీసీసీ అధ్యక్షపదవి విషయంలోనూ అధిష్ఠానం ఒక ఆలోచనకు వచ్చిందని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షునిగా మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పట్ల సీఎం సానుకూలంగా ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం ఉంది. కాగా.. ఈ పదవిలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేరు కూడా గట్టిగానే విన్పిస్తోంది. ఇక వీటితో పాటు.. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవుల భర్తీపై కూడా అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే వీలుంది

కూతుళ్లను చంపిన కుల దురహంకారం

  • తెలుగు గడ్డపై రెండు హత్యలు
  • సజీవ దహనం చేసిన తల్లి, మేనమామలు
  • మరో కేసులో గొంతు నులిమిన తండ్రి
  • దళితులను ప్రేమించటం, పెళ్లి చేసుకోవడమే కారణం
హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ఆటవిక చర్యలు... తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ జరిగాయి. ఆధునిక సమాజంలో ఈ అనాగరిక చేష్టలు ఏంటని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీవ్రంగా స్పందించడానికి కారణమైన కుల దురహంకార హత్యలకు ప్రస్తుతం మన రాష్ట్రం కూడా వేదికగా నిలిచింది. తక్కువ కులం వ్యక్తిని (దళితున్ని) పెళ్లి చేసుకున్న కారణంగా కూతురిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబ సభ్యులు దారుణంగా ఉసురు తీశారు. గర్భిణిగా ఉన్నా ఏ మాత్రం కనికరం లేకుండా పాశవికంగా దాడి చేసి, హత్య చేశారు. మైనార్టీ తీరిన ఆ యువతి, తాను భర్తతోనే ఉంటానన్నా ససేమిరా అన్నారు. బలవంతంగా నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లిన ఆమె తల్లి, మానమేమలు... రాళ్లతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. అటు మానవత్వానికి, ఇటు మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఇదిలావుండగా, దళతున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు శ్రీకాకుళంలోని ఒక తండ్రి. కుల పంచాయతీలు (ఖాప్‌ పంచాయతీలు) లేని తెలుగు గడ్డపైనా రెండు ఘోరాలు జరిగిపోయాయి. ఆడబిడ్డల నిండు ప్రాణాలను కన్నవారే నిలువునా తీసేశారు.
తమను కాదని... దళిత యువకున్ని పెళ్లాడిన కన్న బిడ్డను కాల్చి చంపిన కసాయిమూకల ఘోరకలి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాలానగర్‌ మండలం రాజాపూర్‌ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్‌ చేశాడనే ఆరోపణతో బాలానగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్‌ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్‌ మెజిస్ట్రేట్‌, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్‌ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం ఉదయం ఆరు గంటలకు కాకునూరు గ్రామానికి వెళ్లారు. 'నువ్వు గర్భవతివి కదా.. మనింటికి పోదాం బిడ్డా'' అని మాధవికి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆ సమయంలో లింగం ఇంట్లో కూడా లేడు. ఎంతకూ పుట్టింటికి వెళ్లడానికి ఇష్టపడని మాధవిని బంధువులంతా బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. పెద్దరేవల్లి ఏడు గుట్టల మధ్య చుట్టూ ముళ్ల కంపలు, రాళ్లూ పేరుకుపోయిన ప్రదేశానికి మాధవిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాకునూరుకు, సంఘటన జరిగిన పెద్దరేవల్లి గ్రామాలకూ ఎలాంటి సంబంధం లేదు. అటువంటి మారుమూల ప్రాంతానికి మాధవిని తీసుకెళ్లి చంపేశారు. ఈ విషయాన్ని పెద్దరేవల్లి గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు లింగం సొంత ఊరికి వెళ్లి విచారించగా, చుట్టుపక్కల వాళ్లు మాధవిని ఆమె బంధువులే బలవంతంగా ఆటోలో తీసుకెళ్లడం చూశామని చెప్పారు. నిందితులైన తల్లి శంకరమ్మ, మేనమామలుగా భావిస్తున్న కోడె ముత్యాలు, కోడె రాములు, మరో ఇద్దరు బంధువులు కుంచె రామయ్య, చెన్నయ్య పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా... ఉదయం బయటికెళ్లిన మాధవి భర్త లింగం సాయంత్రం వరకు భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడని, పోలీసు స్టేషన్లో తమ రక్షణలోనే అతను ఉన్నాడని షాద్‌నగర్‌ సిఐ షాకీర్‌ హుస్సేన్‌, బాలానగర్‌ ఎస్‌ఐ శంకర్‌ పత్రికల వారికి తెలిపారు. లింగం ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మాధవి దళితున్ని వివాహం చేసుకున్నందునే తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్‌ షాద్‌నగర్‌ డివిజిన్‌ కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్‌ చేశారు.
దళితున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రట్టిణికి చెందిన లలిత్‌ కుంటియా, గొల్లపు కుంటియా ఉపాధి కోసం చెన్నై వలసవెళ్లారు. వారి కుమార్తె లల్లి కుంటియా (19) అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఒడిషాలోని ఒడ్రు కులానికి చెందిన ఆమె దళిత కులానికి చెందిన అలజండి మోహనరావును ప్రేమించింది. ఈ నెల 20న టిటిడి ఆధ్వర్యాన నిర్వహించనున్న కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన సర్టిఫికెట్లు, బంగారం, డబ్బులు ఇవ్వాలని లల్లి కుంటియా బుధవారం ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగింది. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి లలిత్‌ కుంటియా బుధవారం రాత్రి గొడవపడి, పీక నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని గురువారం గ్రామస్తులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న పాలకొండ డిఎస్పీ బిడివి సాగర్‌ ఆధ్వర్యాన పాతపట్నం, రాజాం సిఐలు ఎ.రవికుమార్‌, ఎస్‌.శశిభూషణరావు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లిదండ్రులను ప్రశ్నించారు. దళిత యువకున్ని పెళ్లి చేసుకుంటుందని తానే కుమార్తెను హత్య చేశానని లలిత్‌ అంగీకరించాడు. మెళియాపుట్టి ఎస్‌ఐ సూరినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షించండి

న్యూఢిల్లీ, మే 3: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని, అందుకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇప్పటికీ మనుషులతో కొనసాగిస్తున్న పాకీ పనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా గత నెలలో జరిగిన నేరాల ప్రస్తుత పరిస్థితిపై నివేదికను ఆ శాఖ పరిశీలించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు దేశీయ వ్యవహారాల శాఖ పలు సూచనలను జారీ చేసింది.

దాని ప్రకారం.. పోలీసు లు, శాంతిభద్రతలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అం శం కాబట్టి నేరాలు జరగకుండా నిరోధించడానికి అవి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వా లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరింది. ఇండియాలో ఇంకా మనుషు ల చేత పాకీ పని చేయించడం దారుణమని, దాన్ని నిషేధిస్తూ చట్టం తెచ్చి 17 ఏళ్లయినా ఎవరూ శిక్షింపడలేదని ఆ శాఖ సూచనల్లో పే ర్కొంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూ ర్తిగా దానిని నిర్మూలించడానికి అత్యవసర కృషి చేయాలని తెలిపింది.