తూతూ మంత్రం

తూతూ మంత్రం
- సంపాదకీయం

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇన్ని తక్కువ రోజులు జరగడం ఇటీవలి కాలం లో ఎప్పుడూ లేదు. గడచిన శీతాకాలపు సమావేశాల మాదిరిగా పూర్తిస్థాయి సభాస్తంభనలు జరగలేదు కానీ, ఈ సమావేశాలు కూడా సజావుగా సాగాయని చెప్పలేము.

సభలో ప్రవేశపెట్టవలసిన బిల్లుల్లో అత్యధికం పెండింగ్‌లో పడిపోయా యి. పన్నెండున్నర లక్షల కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించిన భారీ బడ్జెట్‌ను ప్రజాప్రతినిధులు నిశిత పరిశీలన చేయకుండానే ఆమోదించవలసి వచ్చింది. అయితేనేమి, రైల్వే బడ్జెట్‌ను, కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదింపజేసుకోగలిగింది. ఐదు రాష్ట్రా ల్లో త్వరలో జరగనున్న ఎన్నికల దృష్ట్యా, ప్రతిపక్షాలు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని పొందగలిగాయి.

బడ్జెట్ సమావేశాల మధ్యలో కొద్దిరోజులు విరామం ఇచ్చి మరో విడత సమావేశా లు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ నెలలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, మలివిడతను విరమించుకున్నారు. మార్చి 25 వరకే సమావేశాల ను కుదించారు. ఫిబ్రవరి21న ప్రారంభమైన బడ్జెట్ సెషన్స్‌లో పార్లమెంటు మొత్తం 23సార్లు సమావేశమైంది.

శీతాకాల సమావేశాల స్తంభనకు కారణమైన సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం ఈసారి అంగీకరించింది. అయినాసరే, సమావేశాలు సజావుగా సాగలేదు. తెలంగాణ ఎంపీలు వరుసగా సభలో చేసిన ఆందోళన, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు, వికీలీక్స్ ద్వారా వెల్లడయిన 'ఓటుకు నోటు'-పార్లమెంటును కుదిపివేశాయి. టిఆర్ఎస్ సభ్యు లు ఇద్దరు లోక్‌సభలో తెలిపిన నిరసన, మొదటిరోజు నుంచి కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు చేసిన నినాదాలు, వారికి భారతీయజనతాపార్టీ నాయకత్వం తెలిపిన మద్ద తు- సభా కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గ విశేషాలు.

2జి స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రతిష్ఠ దిగజారిన యుపిఎ ప్రభుత్వం, విజిలెన్స్ కమిషనర్ థామస్ నియామకంపై సుప్రీంకోర్టు వేసిన అక్షింతల కారణంగా మరోసారి బోనెక్కవలసి వచ్చింది. జరిగినదానికి తాను బాధ్యత వహించడం ద్వారా ప్రభుత్వాన్ని సంకట స్థితినుంచి గట్టెక్కించాలనుకున్న ప్రధాని ప్రతిపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. తెలిసితెలిసీ చేసిన నియామకం అది. ఇతరులు హెచ్చరించినా ఖాతరు చేయక థామస్‌కు ప్రధాని ఆ పదవిని అందించారు.

యుపిఎ ప్రభుత్వాన్ని అప్రదిష్ట నుంచి రక్షించడానికి ఇక మన్మోహన్ సింగ్ దగ్గర మిగిలిన ప్రతిష్ఠ ఏమీ ఉన్నట్టు లేదు. 2008లో అణుఒప్పం దం వివాదం నేపథ్యంలో యుపిఎ-1 ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి కోట్లు వెచ్చించి ఓట్లు కొన్నారని వికీలీక్స్ ద్వారా వెల్లడయిన సమాచారం ప్రభుత్వాన్ని, ప్రధానిని మరీ ఇరకాటంలో పెట్టింది. వికీలీక్స్ సమాచారాన్ని నమ్మనక్కరలేదని, విదేశీయులు చెప్పినదాన్ని ప్రమాణంగా తీసుకోనక్కరలేదని-ఏవేవో సమర్థనలు చెప్పారు.

కానీ, ప్రజలలో ఏర్పడవలసిన అపనమ్మకం ఏర్పడిపోయింది. దేశసార్వభౌమాధికారాన్ని పణం పెట్టి అణు ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ఒకపక్కన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో, అవసరమైన మద్దతును అవినీతిమార్గాల ద్వారా సమకూర్చుకోవడం ద్రోహపూరితమని అర్థం చేసుకోవడానికి పెద్ద రాజకీయజ్ఞానం అక్కరలేదు. నీతిపరుడిగా కీర్తిగడించిన ప్రధానికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయని నమ్మడానికి వీలులేని సందర్భాలు ఇవి.

శీతాకాల సమావేశాల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభనను చూసి, ఎప్పటికైనా ఈ పార్లమెంటు సక్రమంగా సాగుతుందా, మధ్యంతర ఎన్నికలు రాక తప్పదా అన్న అనుమానాలు కలిగాయి. జెపిసి విషయంలో కేంద్రం సుముఖంగా మారడంతో బడ్జె ట్ సమావేశాలు అర్థవంతంగా సాగుతాయన్న ఆశ మొదట కనిపించింది. ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి కూడా ఈసారి సభా కార్యక్రమాలను సాధ్యమైనంతగా అనుమతించాలనే భావించింది.

ఆనవాయితీగా జరగవలసిన తప్పనిసరి ఆమోదాలను, చర్చలను అనుమతిస్తూనే, ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నంలో సఫ లం అయ్యాయి. సంచలనాత్మకమైనవీ, రాజకీయంగా తక్షణం లాభదాయకమైనవీ అయిన అంశాలు ప్రాధాన్యం పొంది, సాధారణమైనవీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవీ అయిన అంశాలు అప్రధానమై అన్యాయమైపోవడం- ఈసారి సమావేశాల్లో నూ కనిపిస్తుంది.

మొత్తం ఈసారి 37 బిల్లులు ప్రవేశపెడదామనుకున్నారు. వాటిలో మహిళారిజర్వేషన్ల బిల్లు, భూసేకరణ సవరణబిల్లుతో సహా అత్యధికం పెండింగ్‌లోనే ఉండిపోయాయి. పెన్షన్ రెగ్యులేటరీ అథారిటీ బిల్లు వంటి ఒకటి రెండు మాత్ర మే సభ ఆమోదాన్ని పొందాయి. బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద చేసిన కేటాయింపులను మదింపు వేసి, చర్చించడానికి సమయమే దొరకలేదు.

అసెంబ్లీ ఎన్నికల పేరు తో పార్లమెంటరీ స్థాయిసంఘాలు మంత్రిత్వ శాఖల వారీగా చేయవలసిన కేటాయింపుల సమీక్షలను రద్దు చేశారు. ఇక సమావేశాల సందర్భంగా పార్లమెంటు సమీపంలోను, రాజధానిలోనూ వివిధ ప్రజాసమస్యలపై జరిగే ఆందోళనలకు, ప్రదర్శనలకు సభలో పెద్దగా సంఘీభావం లభించలేదు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఢిల్లీదాకా వెళ్లిన మాదిగ పోరాటకారులను ఆలకించేవారే లేకపోయారు.

అయితే, నిత్యరణరంగంగా ఉండిన పార్లమెంటు సమావేశాలు, ఒకరకంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ప్రతిబింబించాయి. సర్వత్రా వ్యాపించిన ఆర్థిక అకృత్యాలు, అవినీతి, నైతికమైన డొల్లతనం దేశనాయకత్వాన్ని హీనస్థాయిలో నిలుపుతున్నాయి. పాలకపక్షాన్ని నిలదీయడమే తప్ప స్వయంగా ప్రత్యామ్నాయం కాలేని బలహీనతలో ప్రతిపక్షం కూరుకుపోయి ఉంది. కాంగ్రెస్‌పార్టీ స్వయంగా అంతర్గత జాడ్యాలతో ఉక్కిరిబిక్కిరిగా ఉన్నది.

2జి స్కామ్‌లో ప్రధాన దోషిగా ఉన్న పార్టీని బెదిరించి నాలుగుసీట్లు ఎక్కువ సంపాదించుకోవడం తప్ప, దాన్ని దూరం పెట్టగలి గే శక్తి కాంగ్రెస్‌కు లేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవిభజన సమస్య పార్టీనే రెండు గా చీల్చింది. శ్రీకృష్ణ కమిటీ ద్వారా సంపాదించిన ఏడాది గడువు తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా సమస్య మిగిలిపోయింది. వైఎస్ హయాం లో అధిష్ఠానం అనుసరించిన వైఖరి కారణంగా జగన్ ఏకు మేకై కూర్చున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ చొరవను కోల్పోయి, తానే వేసుకున్న చిక్కుముడులను విప్పలేక సతమతమవుతున్నది.andhra jyothi soujanyamutho

గ్రామాల్లోనూ సభలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం : మాణిక్యవరప్రసాద్

హైదరాబాద్, మార్చి 26 : అసెంబ్లీ సమావేశాలు ఆరునెలలు హైదరాబాద్‌లోనూ, మరో ఆరునె లలు గ్రామీణ ప్రాంతాల్లోను నిర్వహించాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన సరికొత్త ఆలోచనలతో ముందుకువచ్చారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఒకసారి తెలంగాణలోని మారుమూల పల్లెల్లో నిర్వహిస్తే, మరోసారి ఆంధ్రా ప్రాంతంలోని ఓ గ్రామంలో, ఇంకోసారి రాయలసీమలోని ఇలా సభలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే బాగుంటదనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చిస్తామని, ప్రతిపక్షానికి , ప్రభుత్వానికి లేఖ రాస్తానని మంత్రి పేర్కొన్నారు. సభ నిర్వహణకి పెద్ద భవనాలే అవసరం లేదని, టెంట్ల కింద కూడా నిర్వహించవచ్చని అన్నారు. స్పీకర్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా గ్రామాలకు చేరుకుని ప్రజా సమస్యలను స్వయంగా అడిగి త్వరగా పరిష్కరించ వచ్చని మాణిక్యవరప్రసాద్ అభిప్రాయ పడ్డారు.

విద్యాబిల్లు ఆమోదం పొందకపోవడంపై కపిల్‌ సిబల్‌ అసంతృప్తి

న్యూఢిల్లీ : విద్యా హక్కు చట్టం పరిధిలో అంగవైకల్యం కలిగిన పిల్లలను అననుకూల బృందాలుగా పరిగణించాలని పేర్కొంటూ ప్రవేశ పెట్టిన బిల్లును శుక్రవారం రాజ్యసభ ఆమోదం పొందక పోవడంతో మానవ హక్కుల శాఖమంత్రి కపిల్‌ సిబల్‌ నిరుత్సాహానికి గురైనట్లు కనిపిస్తున్నది. పిల్లలకు సంబంధించిన ఉచిత, నిర్బంధ విద్యాహక్కు(సవరణ) 2010 బిల్లు శుక్రవారం చర్చించాల్సిన అంశాల జాబితాలో ఉన్నందున కపిల్‌ సిబల్‌ దానికి సిద్ధమై వచ్చారు. అయితే సభ ప్రారంభం కావడానికి కొన్ని నిముషాల ముందు ఈ బిల్లును సభలో చర్చించడం లేదని తెలుసుకున్న సిబాల్‌ నిరుత్సాహానికి గురయ్యారు. కాగా బిల్లు ఆమోదానికి సంబంధించి వామపక్ష సభ్యులు అనుకూలంగా ఉన్నప్పటికీ దీనిపై చర్చించడానికి తగినంత సమయం కావాలని బిజెపి కోరింది. ఈ బిల్లుపై కనీసం నాలుగు గంటలపాటు చర్చ జరగాలని బిజెపి పేర్కొంది. ఆ తరువాత ఈ విషయమై బృందాకారత్‌ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బిజెపిలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్వాహకులు, బిజెపి మొండితనం వలన బిల్లు ఆమోదం పొందలేకపోయిందని ఆమె అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పి.కె. బన్సాల్‌ సరైన ప్రయత్నం చేయలేదన్నారు. పెన్షన్‌ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి సహకరించిన బిజెపి ఈ విద్యా బిల్లు ఆమోదం పొందడంలో సహకరించలేదన్నారు.