కార్మిక చట్టాల అమలకు దేశ స్థాయిలో ఉద్యమం !
విజయనగరం,మేజర్‌న్యూస్‌ః కార్మిక చట్టాల అమలకు 5లక్షల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టి.నరసింహన్‌ తెలియజేశారు.ఆదివారం స్థానిక అమర్‌ భవన్‌లో జరిగిన పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా పీఏసీఎస్‌ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.కార్మిక చట్టాల 150కి పైగా ఉన్నప్పటికీ అవేవీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ధరలు అదుపు చెయ్యడంలేదన్నారు.కార్మిక చట్టాలను అమలు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నాయన్నారు. జట్లు,ముఠాల పేరుతో 46 కోట్ల మంది కార్మికులు దయనీయంగా జీవితాలు నెట్టుకొస్తున్నారన్నారు.2004 నుంచి పింఛన్లు ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.పింఛను ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.46 కోట్లలో 40 కోట్ల మంది అసంఘటిత రంగాలలో కార్మికులగా ఉన్నారన్నారు.కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కార్మికులగానే ఉద్యోగ,సామాజిక భద్రత కోల్పోయారన్నారు.

మన రాష్ట్రంలో 5లక్షల మంది అసంఘటిత రంగంలో కార్మికులగా ఉన్నారన్నారు. ఈ వ్యవస్థను రూపు మాపి సామాజిక భద్రత కల్పించాలని తాము అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలు అధికంగా ఉన్న, లాభాలు ఆర్జించే బీహెచ్‌ఈఎల్‌ లాంటి సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు పరం చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకునే పెట్రో ఉత్పత్తుల కంపెనీలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పి నేడు ప్రైవేటు రంగాలు చెప్పిన మాటను జవదాటలేని కేంద్ర ప్రభుత్వం తొమిది నెలల్లో ఎనిమిది దఫాలు ధరలు పెంచిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్‌ ధర 34 శాతం ఉంటే మన ప్రభుత్వాలు 75 శాతం ధరలు పెంచి మధ్య, సామాన్య తరగతులు జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నెలకు రూ. కోటి తీసుకున్న జీతగాళ్ళు ప్రైవేటు ఆర్గనైజేషన్లలో ఉన్నారన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకు రూ. లక్ష గౌరవ వేతనంగా పొందుతున్న నేపథ్యంలో సామాన్యునికి కనీసం రూ. 10వేలు జీతంగా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు.

వీటిపై ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించి ఉద్యమాలను తీవ్రతరం చేసి కార్మిక చట్టాలు అమలకు ముందుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆయన విలేకరులకు వివరించారు.
జీఓ 151 యధాతదంగా అమలు చెయ్యాలి ః రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 జూన్‌ నెలలో చేసిన 151 జీఓ నేటికీ అమలు కాకపోవడంపట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా జీఓలు ప్రటించడం ఆ తరువాత వాటిని అమలు చెయ్యకపోవడం జరుగుతోందన్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ జీఓ చేసి మూడేళ్ళు అయినప్పటికీ ఏదో ఒక వంకపెట్టి పీఏసీఎస్‌ సిబ్బందిని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సొసైటీలకు వచ్చిన లాభాలపై వీరి జీతాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు.

ఒకపక్క రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సబ్సీడీలు ప్రకటిస్తూ, ఉచిత విద్యుత్తు ఇస్తూవుంటే ఏ విధంగా సొసైటీలకు లాభాలు వస్తాయని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇచ్చిన రుణాలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలన్నారు. సొసైటీలకు వచ్చే లాభాలతో సిబ్బంది జీతాలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.ఆధాయంతో వీరి జీతాలకు ముడిపెట్టినట్లైతే.. ఆదాయం రాని పాఠశాలలు, పోలీసు, మెడికల్‌ తదితర శాఖలు ఏమి లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.. వీరికి నెలయ్యేసరికి జీతాలు ఖజానాల ద్వారా అందజేయడం లేదా అని ఆయన నిలదీశారు. నేడు పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 1000, రూ. 1,500లు, రూ. 2000లు జీతంతో మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారో అనేది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న దేశంలో యూపీఏ, ఇక్కడ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు.

రాష్ట్రంలో పీఏసీఎస్‌లలో 10వేల మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా వీరు అరకొర జీతాలతో జీవితాలు సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం జీఓలమీద జీఓలు చెయ్యడమే తప్ప అమలు చెయ్యడం లేదని ఆయన విమర్శించారు. గత నెలలో పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ రాష్ట ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు నిరాహార దీక్షకు పూనుకోగా.. ఆ శాఖ కార్యదర్శి, మినిస్టర్‌ కాసు కృష్ణారెడ్డి తదితరులు వచ్చి రాజీమంత్రంతో దీక్షను విరమింపజేశారన్నారు. నాబార్డు, ఆప్కాబ్‌ స్టేట్‌, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లతో సమీక్షించి జీఓను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇటీవల సహకార శాఖలో ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వం తలచిందన్నారు.

ఈ భర్తీలో ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఒడుదొడుకులకు, ఒత్తిళ్ళకు సతమతమై పనిచేస్తున్న సిబ్బందిలో సీనియర్లను, అర్హత ప్రాతిపదికగా ఈ ఉద్యోగాల్లో భర్తీ చెయ్యాలని తమ యూనియన్‌ డిమాండు చేస్తోందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో మిగిలిన సంఘాలతో కలిసి సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా పీఏసీఎస్‌ సిబ్బంది తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు, ఉపాధ్యక్షుడు సాగి రంగరాజు, పీఏసీఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. రామునాయుడు, కార్యదర్శి వర్రి. సన్యాసిరావు, ఉపాధ్యక్షుడు బి. బాస్కరరావు, ఏఐబీఈఏ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యదర్శి నల్లా బాబాజీ, పీఏసీఎస్‌ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్‌పై కొమురం విగ్రహం
KomaramBheemహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ సాయుధ పోరా ట యోధుడు కొమురం భీమ్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికోసం గిరిజన శాఖ రూ.8 లక్షలను విడుదల చేయ నుంది. కొమురం భీమ్‌ విగ్రహం నమూనా ఇప్పటికే తయారైందని, నిధులు విడుదలైన వెంటనే విగ్రహాన్ని నెలకొల్పే పనులను వేగవంతం చేస్తామని సాంస్కృతిక శాఖ మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి, డైరెక్టర్‌ కాంతారావు తెలిపారు. శనివారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై మొత్తం 33 విగ్రహాలు ఉన్నాయని, వాటికి అదనంగా అదే వరుసలో కొమురం భీమ్‌ విగ్రహాన్ని నెలకొల్పుతామని అన్నారు.

ధ్వంసమైన విగ్రహాల పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షలను మంజూరు చేసిందని, నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు. విగ్రహాల రూపురేఖలు, ఎత్తు వంటి అంశాలపై చర్చించడానికి ఈ నెల25న ప్రముఖ శిల్పాచార్యులతో సమావేశాన్ని ఏర్పా టు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశం అనంతరం సాంకేతిక, ఆర్థిక కమిటీలను వేర్వేరుగా ఏర్పాటు చేస్తా మని, ఈ రెండు కమిటీలు ఇచ్చే నివేదికలు, ప్రభుత్వం రూపొందించే నిబంధనల మేరకు విగ్రహాలను పునరు ద్ధరిస్తామని అన్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశ లో ఉన్నాయని అన్నారు.

23 నుంచి ‘శతరూప’
ఈ నెల 23నుంచి పది జిల్లాల్లో పది రోజులు చొప్పున ‘శతరూప’ కళా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఆయా జిల్లాల్లో పేరుపొందిన జానపద కళారూపాలతో ప్రదర్శనలను ఏర్పాటు చేస్తా మని అన్నారు. 23న విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం వచ్చేనెల 2న ఏలూరు, 14న నెల్లూరు, 22న చిత్తూరు, జులై 2న అనంతపురం, అదే నెల 12న కర్నూలు, 21న ఆదిలాబాద్‌, ఆగస్టు 1న నల్లగొండలో శతరూప కార్యక్రమాలు ఉంటాయని, ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌ ఆగస్టు 21 నుంచి 30 వరకు నిర్వహిస్తామని అన్నారు.

రూ.3 కోట్లతో రవీంద్రభారతి, తెలుగు లలిత కళా తోరణంలో మరమ్మతులు చేయనున్నట్లు రమణమూర్తి, కాంతారావు తెలిపారు. లలిత కళాతోరణంలో మినీ థియేటర్‌ను నిర్మించే యోచన ఉందని అన్నారు. ఎంపిక చేసిన 13 విభాగాలకు చెందిన 26 మంది కళాకారులకు కళారత్న హంస అవార్డులతో సత్కరించనున్నామని, దీన్ని వచ్చేనెల రెండవ వారంలో నిర్వహిస్తామని అన్నారు. హంస అవార్డులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దు తామని చెప్పారు.
రాజ నర్సింహకే డిప్యూటీ సీఎం?
కొలిక్కి వచ్చిన కసరత్తు
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: డిప్యూటీ సీఎం, స్పీకర్, పీసీసీ చీఫ్ పోస్టుల భర్తీ వ్యవహారం ఒక కొలిక్కివచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, తన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌తో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ జరిపిన సమావేశంలో ఈ పోస్టులపై కసరత్తు ముగించారని, వారంలోగానే వీటిని భర్తీ చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఆ వర్గాలు చెబుతున్న ప్రకారం... డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చారు.

స్పీకర్ పదవి విషయంలో ప్రస్తుత ఉపసభాపతి నాదెండ్ల మనోహర్, సీఎం సన్నిహితుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్న మంత్రి జె.గీతారెడ్డి పేరు కూడా లెక్కలోకి తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సారథ్యం విషయంలో ఐదు పేర్లను (కె.ఆర్.సురేశ్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ) పరిశీలించారు. సురేశ్‌రెడ్డికే ఈ పదవిని ఇవ్వాలని సీఎం కోరగా, మైనారిటీకి చెందిన షబ్బీర్ అలీకి ఇస్తే బాగుంటుందని ఆజాద్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.