ఎస్సీ, ఎస్టీ కాలనీలకు మట్టి పనులే!

  • అనుసంధానంపై అనుమానాలు
  • ఆసక్తి చూపని ఎంఎల్‌ఏలు
ఎస్సీ, ఎస్టీ కాలనీలపై సర్కారు వివక్ష ఇది. మౌలిక వసతుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆధునిక హంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాత్రం మట్టి పనులతో సరిపెట్టనుంది. దళిత గిరిజన ఆవాసాల అభివృద్దికోసం ఇటీవల వ్యవసాయ కార్మికసంఘం, కెవిపిఎస్‌ తదితర సంఘాలతో పాటు సిపిఎం నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలతో దిగివచ్చిన ప్రభుత్వం ఉపాధిహామీ నిధులతో, శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధులను అనుసంధానం చేసి ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేయను న్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈ ప్రకటనపైనే అనుమానాలు వ్యక్తమవ ుతున్నాయి. ఉపాధి హామీ చట్టం నిబంధనల ప్రకారం ఆ పథకం కింద చేపట్టే పనులకు ఏ ఇతర నిధులను అనుసంధానం చేసినా మట్టిపనులకే పరిమితం చేయాల్సిఉంది. దీనికి భిన్నంగా జరిగితే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశమే లేదని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే ఉప ప్రణాళిక కింద కేటాయించిన నిధులనే దీనికోసం ప్రభుత్వం వినియోగించేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కేటాయించిన నిధులే 2009-10 ఆర్థిక సంవత్సరంలో మూడువేల కోట్లరూపాయల దాకా మిగిలిఉంది.

ఆ మొత్తంలో దాదాపుగా 2662 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్లించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. 2010-11 ఆర్థిక సంవత్సరలో ఎస్సీ ఉపప్రణాళిక నిధులు దాదాపుగా 4వేల కోట్లు మిగిలినట్టు అంచనా. సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన మొత్తాలను ఇతర పథకాలను మళ్లిస్తున్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉపాధి హామీ నిధులతో దళిత,గిరిజన ఆవాసాల అభివృద్ధిని ముడిపెడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొలుత ఉపాధిహామి పథకంతో మట్టి పనులు చేసినప్పటికి ఆ తరువాత వీటినుండి శాశ్వత ప్రయోజనం పొందాలన్నా ఇతర నిధులను వినియోగించాల్సిఉంది. ఆ దశలో కూడా సబ్‌ప్లాన్‌ నిధులను వినియోగించడానికి సర్కారు సిద్దపడక పోవడం గమనార్హం. దీంతో చివరకు ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో మట్టిపనులు మాత్రమే మిగలనున్నాయి. ఉపాధి హామీతో నేరుగా అనుసంధానానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో మట్టి పనులు చేసిన తర్వాత కాంక్రీటును వేసేందుకు నియోజవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 22జిల్లాల్లో 1500 ఎస్సీ, ఎస్టీ ఆవాస ప్రాంతాలో ఈ పనులు చేస్తామని వారు తాజాగా చెబుతున్నారు. అయితే ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే సంబంధిత ఎమ్మెల్యేలు అనుమతి తప్పనిసరని తెలిసిందే. అయితే ఈ పనులపట్ల ఎంఎల్‌ఏల నుండి పెద్దగా ఆసక్తి వ్యక్తం కాకపోవడం గమనార్హం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగేటప్పుడే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాంబర్‌లో జిల్లాల వారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉపాధిహామీ పథకంపై అవగాహన సమావేశం జరిపారు.

కానీ ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు శాతం నామమాత్రమే. ఈసమావేశాల్లో హాజరైన ప్రజా పతినిధులు కూడా పలు అనుమానాలను వ్యక్తపర్చినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి వందశాతం ఉపాధిహామీ నిధులనే ఖర్చుపెడితే బాగుంటుందని వారు సూచించినట్లు సమాచారం. పైగా తమ నిధులను కేటాయించేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. వారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తున్న కూడా నియోజకవర్గ నిధులను ప్రభుత్వం పెద్దగా మంజూరు చేయలేదు. పైగా అరకొర నిధులతో తమ కార్యకర్తలను సంతృప్తి పర్చడమే కష్టమని, ఇక ఉపాధిహామీకి నిధులను కేటాయించడమేమిటని బాహాటంగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఉపాధిహామీకి కేంద్రప్రభుత్వం వేల కోట్ల నిధులను ఇస్తున్నప్పుడు తమ నిధులకు ముడిపెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల నిధుల ఉపాధిహామీకి కేటాయించే పరిస్థితి లేదని అర్థమవుతుంది. ఎంపీ లాడ్స్‌ పరిస్థితి ఇంతే. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు సంబంధిత గ్రామ పంచాయతీలను గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి అనంతరం తప్పకుండా ఎమ్మెల్యేల ఆమోదం పొందాలి. అంతేకాకుండా మెటిరియల్‌ కంపోనెంటు కింద 5శాతం పూర్తయిన గ్రామ పంచాయతీల్లోనే రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గ్రామాలను గుర్తించడంలో పలు ఇబ్బందికర పరిస్థితులున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఎస్‌సి ఉపప్రణాళిక ఖర్చు ఇలా (ప్రభుత్వ లెక్కల ప్రకారం ... కోట్ల రూపాయల్లో)
సంవత్సరం కేటాయింపు ఖర్చు మిగులు
2007-08 4355.90 3830.16 525.74
2008-09 7630.42 3511.44 4118.98
2009-10 5243.16 2764.79 2478.37
2010-11 6131.39 2521.82 3609.57