డిప్యూటీ రాజా
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ
సీఎం సిఫారసు...గవర్నర్ ఆమోదం

దాదాపు 20 ఏళ్లకు మళ్లీ 'డిప్యూటీ' సీఎం
హోం శాఖ కూడా ఆయనకే?
పదువుల భర్తీలో అధిష్ఠానం బిజీబిజీ
తెలంగాణకు,పదవులకు సంబంధం లేదు
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా
నాకూ కులం ,ప్రాంతం,ప్రజల సెంటిమెంట్ ఉంది
'ప్రత్యేక' పరిష్కారంలో కిరణ్‌కు సహకరిస్తా
ఎస్సీ వర్గీకరణకు మా సోదరులకు ఒప్పిస్తా
'ఆన్‌లైన్'తో రాజనర్సింహ
కాంగ్రెస్‌లో రాజకీయం వేగంగా రంగులు మార్చుకుంటోంది. ఇన్నాళ్లూ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేసిన ఆ పార్టీ.. ఇప్పుడు 'సామాజిక న్యాయానికి' జై అంటోంది. అన్ని వర్గాలనూ దగ్గర చేసుకొనే దిశగా ప్రయాణం ప్రారంభించింది. పార్టీకి దూరమైన.. ఇన్నాళ్లూ దూరంగా ఉండిపోయిన వర్గాలను అక్కున చేర్చుకోవడమే లక్ష్యంగా పదవుల పంపిణీకి తెర తీసింది. ఒక్కో నియామకం జరుగుతున్న కొద్దీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్ఠానం మార్కు సామాజిక రాజకీయ వ్యూహం తేటతెల్లమవుతోంది. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌పై గురిపెట్టి.. త్వరలో అసలైన 'పునర్వ్యవస్థీకరణ'కు తెర తీయబోతోందన్నది తాజా సమాచారం!!

హైదరాబాద్, జూన్ 10 : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్రానికి మళ్లీ ఉప ముఖ్యమంత్రి వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సిలరాపు దామోదర రాజనర్సింహను ఈ పదవి వరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ సిఫారసుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాజముద్ర వేశారు. 'ఆపరేషన్ ఏపీ'లో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ కీలక పదవి భర్తీకి పచ్చ జెండా ఊపింది.

ముఖ్యమంత్రిగా కిరణ్.. పీసీసీ చీఫ్‌గా బొత్స సత్యనారాయణ.. స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్.. డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టివిక్రమార్క! తాజాగా, డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ!! కీలక నియామకాల ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. యువ రక్తం.. కుల సమీకరణం.. ప్రత్యామ్నాయ నాయకత్వమే తన విధానమని తేటతెల్లం చేస్తోంది. ఇక, ప్రత్యేకవాదిగా భావిస్తున్న.. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణను పీసీసీ చీఫ్‌గా నియమిస్తే.. సమైక్యవాదిగా ముద్ర పడిన తెలంగాణకు చెందిన రాజనర్సింహను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది.

అలాగే, సీఎం కిరణ్ తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి, దామోదర్ తండ్రి రాజనర్సింహ కూడా రాష్ట్రంలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారే కావడం మరో విశేషం. వాస్తవానికి, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్సీ నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదవి రేసులో గీతారెడ్డి, రాజనర్సింహ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వచ్చినా.. తొలి నుంచి రాజనర్సింహ ముందు వరుసలోనే ఉన్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి గీతారెడ్డి.. డిప్యూటీ సీఎం పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ అధిష్ఠానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయినా, అధిష్ఠానం మాత్రం రాజనర్సింహ పేరునే ఖరారు చేసింది. దీంతో, కీలకమైన పదవులన్నింటినీ చకచకా అధిష్ఠానం భర్తీ చేసినట్లు అయింది. వాస్తవానికి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే .. తెలంగాణ ప్రాంత నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న సంప్రదాయం 1992 వరకూ కొనసాగింది.

1992 నుంచి 1994 వరకూ కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పదవి నియామకం జరగలేదు. మళ్లీ 17 ఏళ్ల తర్వాత రాజనర్సింహ ఆ పదవిలో నియమితులయ్యారు. ఆయన తెలంగాణ ప్రాంతానికే చెందినా.. సమైక్యవాదిగా ముద్ర పడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన 1969లో దామోదర్ రాజనర్సింహ తండ్రి రాజనర్సింహ కూడా ఇదే పంథాలో పయనించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి లభిస్తే.. ఇప్పుడు రాజనర్సింహను ఏకంగా డిప్యూటీ సీఎం పదవే వరించింది.

ఆనవాయితీ ప్రకారం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనో.. ఆ లోగానో రాజనర్సింహకు హోం మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రితో సమానంగా ప్రోటోకాల్ దక్కేందుకు వీలుగా హోం శాఖను డిప్యూటీ సీఎంకు అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది.

పదవులకు, తెలంగాణకు సంబంధం లేదు: రాజనర్సింహ
ప్రత్యేక రాష్ట్రానికి, పదవులకు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తెలంగాణ అంశం ప్రత్యేకమైనదని.. ప్రజాకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటాయన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా నియమితులైన తర్వాత శుక్రవారం రాత్రి ఆయన తన తల్లితో కలిసి బేగంపేటలోని కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, 'ఆన్‌లైన్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే అరుదైన అవకాశాన్ని అధిష్ఠానం తనకు ఇచ్చిందని చెబుతూ.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, సీఎం కిరణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "వ్యక్తిగతంగా నాకు కొంత సామాజిక చిత్తశుద్ధి ఎక్కువ. ఏ పదవి వచ్చినా సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను. నా ప్రజలకు, నా ప్రాంతానికి, ప్రభుత్వానికి సేవలందిస్తాను. మా నాయకులతో కలిసి 'టీమ్ వర్క్'తో ముందుకు సాగుతాను. కిరణ్ నాయకత్వంలో సమష్టితత్వంతో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా. నాపై సమైక్య వాదినని, మరొకటని రకరకాల ముద్రలు ఉండవచ్చు.. కానీ, నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాడిని. నాకు కూడా ప్రాంతం, కులం, నా ప్రజలపై సెంటిమెంట్ ఉంది.

నా సామాజిక వర్గానికి మేలు చేయాలన్న కాంక్ష కూడా ఎక్కువే'' అని వివరించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోందని, అది తీసుకునే నిర్ణయం ప్రజా విశ్వాసం పొందుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో తనకు ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవిని.. ఈ ప్రత్యేక పరిస్థితుల పరిష్కారంలో సీఎం కిరణ్‌కు సహకరిస్తూ ముందుకు తీసుకెళతానని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పదవి అలంకారమేమీ కాదని.. తాను 30 రోజులో.. 100 రోజులో పరిపాలన చేశాక అలంకారప్రాయమో కాదో చెప్పాలని విమర్శకులకు సూచించారు.

తాను తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం కాకపోయినా ఆ ప్రాంతానికి చెందినవాడిగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టానన్న వాదన సరికాదన్నారు. తనకూ ప్రాంతీయ, సామాజిక, కుల అభిమానాలు ఉంటాయని చెప్పారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా తనకూ తెలంగాణపై అభిమానం ఉందని రాజనర్సింహ చెప్పారు. తెలంగాణ ఎంత ప్రత్యేకమైనదో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా అంతే ప్రత్యేకమైనదని చెప్పారు. ఈ రెండూ తీవ్రమైన అంశాలేనన్నారు. ఈ రెండింటినీ కాంగ్రెస్ అధిష్ఠానం పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తమ సోదరులను ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

విలక్షణ నర్సింహ
మెదక్ జిల్లా ఆంథోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనర్సింహది విలక్షణ వ్యక్తిత్వం. తన తండ్రి దివంగత మాజీ మంత్రి రాజనర్సింహ వారసునిగా 1989లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.

పేరు: సిలారపు దామోదర్ రాజనర్సింహ
సన్నిహితులు పిలిచే పేరు: 'దాము'
తల్లిదండ్రులు: జనాబాయి, రాజనర్సింహ
భార్య : పద్మిని, కూతురు : త్రిష
పుట్టిన తేదీ : 05-12-1958
విద్యార్హతలు: బీఈ సివిల్ (ఉస్మానియా)
విద్యాభ్యాసం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, న్యూసైన్స్ కాలేజి, ఉస్మానియా వర్సిటీ.
నిర్వహించిన పదవులు: 1989-94 వరకు ఎమ్మెల్యే, 1991-94 మధ్య రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, 2004లో ఎమ్మెల్యే, అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడు, 2007లో ప్రాథమిక విద్యా శాఖ మంత్రి. 2009లో తిరిగి ఎన్నిక. వైఎస్, రోశయ్యల మంత్రివర్గాల్లో మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి, కిరణ్ కేబినెట్‌లో ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి. అదనంగా వ్యవసాయ శాఖ. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా నియామకం.

ఇష్టమైన ఆటలు: క్రికెట్, ఫుట్‌బాల్, చెస్
రాజకీయ బలం: నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో గ్రామస్థులను పేర్లతో గుర్తుంచుకుని పిలిచే సాన్నిహిత్యం. జిల్లాలో బలమైన గ్రూపునకు (పవర్ గ్రూప్) నాయకత్వం, ఎప్పుడు ఎవరిని ఎలా పైకి తేవాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలిసిన అపర చాణక్యం, నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థులు లేకుండా ఏకఛత్రాధిపత్యం వహించడం.

విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ కళాశాలలు

హైదరాబాద్‌(వి.వి.) : రాష్ట్రంలోని కార్పొరేట్‌ కళాశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఇబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌కు 30 నుండి లక్ష రూపాయల వరకూ అవకాశాన్నిబట్టి ఫీజులను వసూలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా అడ్డుఅదుపూ లేకుండా కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను దోచుకుంటు న్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నా, కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నప్పటికీ ప్రభుత్వ విధానాలతో వాటికి ఆదరణ లభించడం లేదన్నారు. పేరెన్నికగ కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధికమొత్తం లో ఫీజులను గుంజుతున్నాయన్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మాత్రం కార్పొరేట్‌ విద్య మిద్యగా మారిందన్నారు. దీనికితగినట్లుగా అనుమతులు లేకుండానే గల్లీగల్లీలో బ్రాంచీలను ప్రారంభిస్తూ, లెక్కకుమించిన విద్యారు ్థలను చేర్చుకుంటున్నాయని చెప్పారు. కార్పొరేట్‌ కళాశాలలతో ప్రభుత్వం లాలూచీ పడడంతో వాటి అక్రమాలపై నిఘా, నియంత్రణ లేకపోతోందన్నారు.పలు కళాశాలల్లో మౌళిక వసతులు, తగినంత బోధనా సిబ్బంది, ఆటస్థలం లేకపోయినా భారీస్థాయిలో విద్యార్థుల నుండి ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి కార్పొరేట్‌కళాశాలల్లో ఫీజులను నియంత్రించి వాటి అక్రమాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
విద్యాహక్కు చట్టం అమలు ‘బడిబాట’ లో విద్యాభివృద్ధి పనులు
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన ‘బడిబాట’ కార్యక్రమంలో పలు విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పాఠశాల విద్యా శాఖ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. అందులో విద్యా హక్కు చట్టం అమలు, ఎన్‌రోల్‌ మెంట్‌ పెంచడం, అక్షర అభ్యాసం, ఉచిత దుస్తులు పంపిణి వంటి అనేక కార్య క్రమాలు చేపట్టుతున్నారు. అయితే విద్యా వారోత్సవాల పేరుతో 13 నుంచి 18 వర కు నిర్వహించనున్న బడిబాటలో భాగంగా ఏ రోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందనే షెడ్యూల్‌ను విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కార్యక్రమా లను తేదీల వారిగా అమలు చేయాలని ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండల విద్యాధికారులు, హెడ్‌ మాస్టర్లు ఈ కార్యక్రమ నిర్వ హణకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
జూన్‌ 13న:- విద్యా హక్కు చట్టం అమలతో పాటు ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం, అక్షరాభ్యాసం చేపించడం ఉచిత దుస్తుల పంపిణీ చేయడం. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ తీరు తెన్నులు. మధ్యాహ్న భోజన పథ కం అవగాహన కార్యక్రమాలు. అందులో భాగంగానే స్థానిక ప్రజలు, పెద్దలు. తల్లి దండ్రులు కూడా పాల్గొనే చర్యలు తీసుకోవడం. అన్ని స్కూళ్ళలో మంచి రుచికరమైన ఆహారాన్ని అందించడం.

జూన్‌ 14న:- మాధ్యమిక విద్య పటిష్ట పరచడానికి 1000 హైస్కూళ్ళలో అందు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులుచేత కాంపెక్స్‌లు ప్రారంభించడం. 500 హైస్కూళ్ళలో కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం. తొమ్మిదవ తరగతి చదువుతున్న వారికి భవిష్యతు ఉపాధి, ఉన్నత చదువుల గురించి విద్యావేత్తలతో, ఎంప్లాయిమెంట్‌ అధికారులతో కౌన్సెలింగ్‌ ఇప్పించడం.

జూన్‌ 15న:- ‘సబల’ పథకాన్ని ప్రారంభించడం. వారికి స్కాలర్‌ షిప్‌లు మంజూ రు చేయించడం. కస్తూరిభా గాంధీ విద్యాలయాలలో ప్రత్యేకమైన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించడం. మండల విద్యాధికారులు, హెడ్‌మాస్టర్లు స్థానిక కెజిబివీలలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ గుర్తించడం.

జూన్‌ 16న:- ప్రాథమిక విద్య పటిష్ట పరచడం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం.

జూన్‌ 17న :- ప్రజా ప్రతినిధులతో రాష్ట్రంలో 355 మోడల్‌ స్కూళ్ళ ఏర్పాటుకు శంకుస్థాపనలు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయడం.

జూన్‌ 18న :- పదవ తరగతి పరీక్షలో అధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి కృషి చేసిన టీచర్లను విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో గౌరవించడం. మెరుగైన ఫలి తాలు సాధించడంలో ఒకరి అభిప్రాయాలను మరోకరు పంచుకోవడం. 6వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం. మంచి మార్కులు సాధించిన విద్యార్థుల చేత మిగితా విద్యార్థులకు తమ అభిప్రాయాలు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టడం.