మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం

మే తర్వాత మహిళా బిల్లుపై చర్చలు
త్వరలో అన్ని పార్టీలతో స్పీకర్ సమావేశం
లోక్‌సభలో చర్చ సందర్భంగా నిర్ణయం

న్యూఢిల్లీ, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కల్పనకు రాజకీయ పార్టీలు ఓటేశాయి. అయితే, వారికి ఎంత కోటా కల్పించాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. లోక్‌సభలో మంగళవారం చర్చ జరిగింది. అయితే, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రస్తుత రూపంలోనే బిల్లును ప్రవేశపెడితే ఒప్పుకొనేది లేదని సమాజ్‌వాదీ, ఆర్జేడీ, జేడీయూలు హెచ్చరించాయి.

తొలుత ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీపక్ష నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. "16 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఏకాభిప్రాయాన్ని తీసుకురావాల్సిన సమయం ఇదే'' అని స్పీకర్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో, సుష్మా స్వరాజ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని లోక్‌సభాపక్ష నేత ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా మీరాకుమార్‌ను కోరారు. దీంతో, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమావేశం ఏర్పాటు చేసేందుకు స్పీకర్ అంగీకరించారు.