భూ పోరాటాలకు మార్గదర్శి

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మన పాలకులు భూస్వామ్య విధానాన్ని రద్దు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు. అనేక చట్టాలు చేశారు. అయినా ఇప్పటికీ భూస్వామ్య విధానం అంతమవ్వలేదు. దున్నే వాడికి భూమి లభించలేదు. 1970లలో అమరజీవి కామ్రేడ్‌ సుందరయ్య భారతదేశం-భూసమస్య అన్న తన చిన్న పుస్తకానికి పరిచయం రాస్తూ పై మాటలు చెప్పారు. వాస్తవానికి భూసమస్యకి కామ్రేడ్‌ సుందరయ్య జీవితమే అద్దం పట్టింది. వ్యవసాయ సంబంధాలపై శాస్త్రీయ అవగాహనతో రూపొందించుకున్నది ఆయన వైఖరి.అసమాన త్యాగాలలతో, అకుంఠిత దీక్షతో రైతులు, భూమిలేని నిరుపేదలు, వ్యవసాయకార్మికులను, అర్ధబానిస పెట్టుబడిదారీ దోపిడీ నుండి విముక్తి చేయడానికి ఆయన కృషి సల్పారు. కామ్రేడ్‌ సుందరయ్య మరణించిన కొద్దిరోజులకు 'మెయిన్‌స్ట్రీమ్‌' పత్రికలో ఆ సంపాదకుడు నివాళులర్పిస్తూ సుందరయ్య 'కమ్యూనిస్టు ఋషి' అని పేర్కొన్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగంలో భూ యాజమాన్యం గురించి చూద్దాం. కామ్రేడ్‌ సుందరయ్య చెప్పిన పరిస్థితి 1970 దశకంలో ఏమైనా మార్పు చెందిందేమో పరిశీలిద్దాం. 1970-71లో చిన్న, సన్నకారు రైతులకు మొత్తం కమతాల్లో 65 శాతం ఉండగా, వారి ఆధీనంలో 12 శాతం భూమి మాత్రమే ఉంది. నాలుగు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 30 శాతం భూమి ఉంది. 1981లో చిన్న, సన్నకారు రైతులు 72శాతం ఉండగా, వారి ఆధీనంలో 29శాతం భూమి ఉంది. రెండు శాతంగా ఉన్న పెద్దరైతుల ఆధీనంలో 18 శాతం భూమి ఉంది. 1970 నుండి 1980 వరకు భూసంస్కరణల వల్ల పెద్దరైతుల పట్టు కొంత సడలినట్లు కాగితాలపై కనిపిస్తుంది. కానీ వాస్తవంలో వారి పట్టు ఏమాత్రం తగ్గలేదు.
ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ పార్థసారథి పరిస్థితిని చక్కగా క్లుప్తీకరించారు.

'సీలింగ్‌ చట్టాల కింద 1984 వరకూ 1.32లక్షల హెక్టార్ల భూమిని మాత్రమే పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 0.1శాతం మాత్రమే. పంపిణీ చేసిన దానిలో కూడా 93.7శాతం మెట్టభూమి. 1969 నుండి 12.62లక్షల బంజరు భూమిని చిన్న, సన్నకారు రైతులకు పంచారు. ఇది మొత్తం సాగుభూమిలో 8.7శాతం అని చెపుతున్నారు. చట్టాల్లోని లొసుగుల వల్ల భూమిలేని నిరుపేదలకు భూమిని పంచడం, కౌలుదార్లకు భూస్వాముల నుండి రక్షణ కల్పించడం అనే ప్రధాన ధ్యేయాలు నెరవేరలేదు. పేద రైతులకు రుణసౌకర్యం, మెరుగైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించి, ఉత్పాదకతను పెంచలేకపోయారు. వీటన్నింటికీ రాజకీయ చిత్తశుద్ధి లోపించడమే కారణం. ఇది గ్రామీణ ప్రాంతాలలో ధనిక, భూస్వామ్య పెత్తనంతో ముడిపడి ఉంటుంది. పాలకవర్గాలు తన స్వభావరీత్యా పేద, సన్నకారు రైతులకు లాభించే చర్యలు గైకొనడానికి ఇష్టపడవు. ఇది ప్రస్తుత వాస్తవ పరిస్థితి. పంటలు అధికం చేయడానికి చర్యలు గైకొన్నప్పటికీ వాటి ఫలితం కొద్దిమందిగా ఉన్న ధనిక, భూస్వామ్య వర్గాలకు మాత్రమే దక్కింది. చిన్న, సన్నకారు రైతులు అంతకంతకూ దివాళా తీసి, వ్యవసాయకార్మికుడిగా మారిపోవడం పెట్టుబడిదారీ విధానం సూత్రాల్లో ఒకటి. అడవుల పెంపకం, పండ్ల తోటల పెంపకం, కోళ్ల పెంపకం మొదలైనవి ఇటీవలి కాలంలో పెరగడాన్ని ఇదే సూచించిస్తోంది. ధనికరైతులు పనివారిని అధికంగా వినియోగించే పద్ధతులు లేకుండా పెట్టుబడి అధికంగా వినియోగించే పద్ధతులు వ్యాపార ప్రాతిపదికపై పండ్ల తోటల పెంపకం మొదలైనవాటికి మారుతున్నారు. సామాజిక పరిశీలకులకు ఇది ఆశ్చర్యం కలిగించదు.

గిరిజనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. 1970 నుండి పది సంవత్సరాల కాలంలో గిరిజనుల ఆధీనంలో ఉన్న అత్యధిక భూమి గిరిజనేతరుల చేతుల్లోకి మారింది. ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు, శాంతిభద్రతల సమస్యకు కారణమవుతుంది. భూ యాజమాన్యంలో అసమానత నీటిపారుదల సౌకర్యాల వినియోగం అసమానతలకు కూడా కారణమవుతున్నాయి. కమాండ్‌ ఏరియాలకు దగ్గరగా ఉన్న రైతులు సేద్యపు నీటి సౌకర్యాలను అధికంగా వినియోగించుకుంటున్నారు. ఫలితంగా భూ వసతి కలిగిన వారికి, భూమిలేని నిరుపేదలకు మధ్య వ్యత్యాసం మరింత అధికమైంది. ఐదవ ప్రణాళికాంతం నుండి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు తగ్గించడం వల్ల పేద ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నమైంది. పౌష్టికాహారలోపం, నిరక్షరాశ్యత, పసిబిడ్డల అధికచావులు ఇలాంటి రుగ్మతలకు గురయ్యే దశలో బలహీనవర్గాలే రాష్ట్రంలోని అత్యధిక ప్రజానీకమైన బడుగుజనాల స్థితికి ఇవే సూచికగా ఉన్నాయి.
మన విధాన నిర్ణేతలు పెద్ద పెట్టున ప్రచారం చేస్తున్న సమానత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడం, భూ యాజమాన్యం పరిస్థితిపై ఎంతో ఆధారపడుతుంది. ఉత్పత్తిశక్తులు ఉత్పత్తి సంబంధాలను సక్రమ పద్ధతిలో ఉంచాలంటే దున్నేవానికి భూమి లభించాలి. ఈ సమస్యను ఇంకెంతమాత్రం అలక్ష్యం చేయరాదు. లేనట్లయితే మొత్తం దేశ స్థితిగతులే విచ్ఛిన్నమౌతాయి. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి తగినంతగా కృషి చేయవచ్చు. ఈ విషయాన్ని పశ్చిమబెంగాల్‌, కేరళ, వామపక్ష ప్రభుత్వాలు రుజువు చేస్తున్నాయి. దానినే ఈ రాష్ట్రంలో కూడా సాధించుకోవచ్చు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేసే పురోగామి ప్రజాశక్తులన్నింటితో కూడిన ఉద్యమం అవసరం. ఇటువంటి ప్రజాతంత్ర ఉద్యమం కోసం మనం పునరంకితమవుదాం. ఇదే కామ్రేడ్‌ సుందరయ్య స్మృతికి మనం అర్పించగలిగిన నిజమైన నివాళి.ప్రజా శక్తీ దిన పత్రిక soujanyamutho
ముఖోపాధ్యాయ