ఆస్తమించిన హక్కుల సూరీడు

హన్మకొండ, మే 14 : మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బుర్రా రాములు శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రాములు పరిస్థితి మరింత క్షీణించడంతో హన్మకొండలోని ప్రౖౖెవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సుమారు 1.20 గంటలకు కన్నుమూశారు. ప్రొఫెసర్ రాములు మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు, మానవహక్కుల కార్యకర్తలు, సహాద్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భోరున విలపించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఓరుగల్లు కోటలో పుట్టి: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రాములు స్వస్థలం వరంగల్ పడమర కోట. ఉద్యోగ రీత్యా ఆ యన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని క్వార్టర్‌లోనే పదేళ్లుగా ఉంటున్నారు. డాక్టర్ రాములుకు భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్ళు జన, రణ, తల్లి ఐల మ్మ, ఇద్దరు సోదరులు, అయిదుగురు చెల్లెళ్ళున్నారు. సోదరుడు బుర్రా రమేష్ భోపాల్‌లోని ఎన్‌సిఆర్‌టిలో ప్రొఫెసర్. మరో సోదరుడు భాస్కర్ బ్యాంక్ మేనేజర్.

రాజ్యహింసకు వ్యతిరేకంగా... ప్రొఫెసర్ రాములు తన యావజ్జీవితాన్ని మానవ హక్కుల పరిరక్షణ కోసమే వెచ్చించారు. ఎక్కడ హక్కులకు భంగం కలిగితే అక్కడ వాలేవా రు. నిజనిర్ధారణ జరిపేవారు. బాధితు ల పక్షాన గళం విప్పేవారు. రాజ్యాన్ని ప్రశ్నించేవారు. రాజ్యహింసను నిర్భయంగా నిలదీసేవారు. అణగారిన వర్గాల పక్షాన న్యాయం కోసం పోరాడేవారు. ఫ్రొఫెసర్ బుర్రా రాములు కేయూలో అధ్యాపకుడిగా కన్నా మానవహక్కుల నేతగానే సుపరిచితుడు. మొదట పౌర హక్కుల నాయకుడిగా, ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ఫోరం రాష్ట్ర నేతగా ఆయన ప్రస్థానం కొనసాగింది.

అంచెలంచెలుగా 1954 జూన్10వ తేదీన ఖిలా వరంగల్‌లో మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన ప్రొఫెసర్ రాములు ఉ న్నత విద్యావేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు. మానవహక్కుల హరణకు వ్య తిరేకంగా ప్రశ్నించు, నినదించు అని నిత్యం ప్రభోదించారు. పాఠశాల చదు వు ఖిలా వరంగల్‌లోనే సాగింది. 1978లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1980లో ఎంఏ, ఇదే విశ్వవిద్యాలయం నుంచి 1985లో ఎంఫిల్, 1990లో పిహెచ్‌డి పట్టాపుచ్చుకున్నారు. అగ్రికల్చరల్ ఎకనమిక్స్, పొలిటికల్ ఎకనమిక్స్‌లో నిష్ణాతులు. ఆయనకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రెండే.

విస్తృతంగా పరిశోధనలు విద్యాబోధనతో పాటు మరో ప్రక్క గ్రా మీణ జీవన స్థితిగతులపై పరిశోధనలను కూడా కొనసాగించారు. 1996లో యూజీసీ సహకారంతో తెలంగాణలో గ్రామీణ అనియత మార్కెట్లపై రెండేళ్ళే పరిశోధన చేశా రు. 2000 సంవత్సరంలో కేరళలోని తిరువనంతపురం సీడీసీ ఆర్ధిక సహకారంతో మూడేళ్ళ పాటు గ్రామాల సైద్ధాంతిక పునఃసర్వే-గ్రామీణ జీవనంపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. 2007 ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన సదస్సులో మానవ హక్కుల అభ్యసనానికి భోధనాపరమైన పాఠ్యాంశాల రూపకల్పన పై పరిశోధనా పత్రాన్ని సమర్పించా రు.

అధ్యాపకుడిగా... 1983 నుంచి 1994 వరకు యూనివర్సిటీ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1994 నుంచి 2008 వరకు యూనివర్సిటీ కళాశాల, పీజీ కళాశాలలో తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎస్‌డీఎల్‌సీ, తెలుగు అకాడెమికి అవసరమైన పాశ్యాంశాలను, పుస్తకాలను, ఇతర మెటీరియల్‌ను సమకూర్చారు. జాతీయ సాక్షరతా మిషన్ కింద సెంటర్ ఫర్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అక్టివిటీస్ ప్రొగ్రాం ఆఫీసర్‌గా రెండు సంవత్సరాలు పని చేశారు.

హక్కుల కోసం నిత్యం పోరు విద్యాబోధనతో పాటు చుట్టూ ఉ న్న సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ఆయన నిత్యం తీవ్రంగా స్పందించేవారు. హ క్కుల హరణను ఆయన ఏనాడు సహించేవారు కాదు. వాటి పరిరక్షణ కు ఎంతటి ప్రతిఘటననైనా, ఒత్తిళ్ళపైనా నిర్భయంగా ఎదుర్కొనేవారు. ఎంత దూరమైన వెళ్ళేవారు. రాజ్యం ఆయనను ఎంతగా భయపెట్టాలని చూసినా అంతకు రెండింతలు దానికే సింహస్వప్నంగా నిలిచారు. మానవహక్కుల రాష్ట్ర అధ్యక్షుడిగా అట్టడుగువర్గాలకు అండగా నిలిచారు. విద్యార్ధి దశలో కళాశాలలో, విశ్వవిద్యాలయంలోనూ విద్యార్ధి ప్రతినిధిగా వారి హక్కుల కోసం డా. రాములు పోరాడారు. అధ్యాపకుడిగా కూడా తన వం తు సేవలను అందించారు.

సాంస్కతిక రంగంలోనూ.. సాంస్కృతిక, క్రీడా తదితర కమిటీల్లో సభ్యునిగా కీలక పాత్రలు పోషించారు. పలు సంస్ధలతో అయనకు అనుబంధం ఉంది. ఇండియన్ పొలిటికల్ ఎకనమి, ఎపిఈఏలలో ప్రొఫెసర్ రాములు సభ్యుడు. మహిళా అధ్యయానాలపై ముద్రించిన కాకతీయ యూనివర్సిటీ జర్నల్‌కు సంపాదకత్వం కూడా వహించారు.

రచయితగా.. ప్రొ.రాములు సామాజిక అంశాలు నేపధ్యంగా పలు పుస్తకాలను రాశారు. 1995లో ఇదో సారాకథ, 2005లో ప్రాచీన భారత రాజకీయ ఆర్ధిక నిర్మాణాలను ప్రతిబింబించిన మహిళల జీవితం, స్వాతంత్య్రానంతర భారత దేశం-స్త్రీల స్థితిగతులు, నమూనా రూపాంతరం- మానవ అభివృద్ధి-జీవితం వీటిలో కొన్ని. మానవ జీవితంతో ముడిపడిన వివిధ అంశాలను స్పృషిస్తూ అయన రాసిన అనేక వ్యాసాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.