వరంగల్ హక్కుల పెద్దదిక్కు

ఒక ఏడాది ఏడాదిన్నకాలంలో తెలుగునేల మీద హక్కుల ఉద్యమం చాలా విషాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. డాక్టర్ సి.ఆర్.రాజగోపాలన్, ఎస్.ఆర్. శంకరన్, కె .జి. కన్నబిరాన్ ఇంచుమించు నిండు జీవితాలు గడిపి పోయారనుకుంటే గొట్టిపాటి నరేంద్రనాథ్, కె.బాలగోపాల్‌లు అర్థాంతరంగా వెళ్ళిపోయారు. ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి హక్కుల ఉద్యమం కూడదీసుకుని గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమం బలం పుంజుకుంటున్న తరుణంలో ఇప్పుడు బుర్రా రాములు పోయారు.

డాక్టర్ బుర్రా రాములు మానవ హక్కుల సంఘం మొదటి అధ్యక్షుడు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు. బాల్‌గోపాల్, బుర్రా రాములు ఇద్దరూ ఒకే వయసులో 57వ ఏట పోయారు. 1953లో కాళోజీ 'నా గొడవ' ఆవిష్కరిస్తూ శ్రీ శ్రీ ఆయనను లూయీ ఆరగాన్‌తో పోల్చారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో ఫ్రాన్స్‌లో కవులందరూ యుద్దరంగానికి దూరంగా ఉంటే అరగాన్ ఒ క్కడూ నిలిచి పోరాడాడు. 1985లో రామనాథం హత్య తర్వాత ఇంచుమించు ఒక దశాబ్దంపాటు కొనసాగిన నిర్బంధంలో వరంగల్‌లో హక్కుల ఉద్యమంలో నిలబడి కలబడినవాడు బుర్రా రాములు. కాళోజీ ఉన్నంత కాలం ఆయనతోపాటు నిలబడినారు.

1989-90 నాటికి నర్రా ప్రభాకర్ రెడ్డి సాహసించి పౌరహక్కుల రంగంలోకి అభిమన్యునివలె దూకగానే ఆయనకు వెన్నుదన్నుగా నిలబడినాడు. టాడా వంటి దారుణ అణచివేత చట్టాలతో పోరాడుతూ నర్రా ప్రభాకర్ రెడ్డి పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుని వలె నే అమరుడయ్యాడు. రాజ్య హత్యకు డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల వలెనే గురయ్యాడు. అప్పుడు హక్కుల కాడిని బుర్రారాములే ఎత్తు కోవాల్సి వచ్చింది.

పైగా యువ కార్యకర్తలెవరూ వరంగల్ వంటిచోట రాజ్యం కన్నెర్రకు గురయితే నిలదొక్కుకోవడం క ష్టం గనుక బాలగోపాల్ నాయకత్వ బాధ్యతలు బుర్రా రాములుపైననే మోపుతుండేవాడు. ముఖ్యంగా కాళోజీ కూడా కన్నుమూసిన తర్వాత వరంగల్‌లో హక్కుల ఉద్యమానికి మిగిలిన పెద్ద దిక్కు బుర్రా రాములే అయ్యాడు. ఆ లోటు ఒక లాటిన్ అమెరికా నగరాన్ని తలపించే వరంగల్‌తో నాలుగు దశాబ్దాల సన్నిహిత పరిచయం చేయటమే తప్ప ఎంత పూడ్చుకోలేనిదో పోల్చుకోలేం.

బుర్రా రాములు వరంగల్‌లో పుట్టి అక్కడ సామాజిక ఉద్యమాలతో ఎదిగాడు. 1974లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూండెంట్స్ యూనియన్ ఏర్పడినప్పుడు దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సికెఎం కాలేజి విద్యార్థి సత్యనారాయణరావు ఎన్నికయ్యాడు. అప్పటికే సత్యనారాయణరావుతో వరంగల్ ప్రజాస్వామిక విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో చరుకుగా పాల్గొంటున్న బుర్రా రాములు పీడిఎస్‌యు జిల్లా నాయకుడయ్యాడు. 1980 నాటికే ఆయన పిడిఎస్‌యు రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వచ్చాడు. 1978 నుంచి 84 వరకు వరుసగా కాకతీయ యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాల ఐక్య సంఘటనయే ఎన్నికల్లో గెలిచింది.

1982లో బుర్రా రాములు అధ్యక్షుడుగా, పులి అంజయ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెయు విద్యార్థి సంఘం బహుశా యూనివర్సిటీ చరిత్రలో విప్లవ అక్షరాలతో లిఖించ దగినది. పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, లింగమూర్తి వంటి విప్లవ విద్యార్థుల సాహచర్యంలో బుర్రా రాములు ఆర్ఎస్‌యు, పిడిఎస్‌యుల సైద్ధాంతిక, మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ కూడా ఉజ్వలమైన ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాన్ని క్యాంపస్‌లో నిర్మాణం చేయడానికి దోహదం చేసినాడు.

బుర్రా రాములు అర్థ శాస్త్రంలో ఎంఏ చేసి ప్రొఫెసర్ శివరామకృష్ణ రావు దగ్గర పిహెచ్‌డి చేసి కాకతీయ అర్థశాస్త్ర విభాగంలోనే అధ్యాపకుడుగా చేది ప్రొఫెసర్ అయ్యాడు. పుట్టిన ఊళ్ళో జ్ఞానం తెలిసిన దగ్గర్నుంచీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చదువుతూ, సమాజాన్ని చదువుతూ పోరాడుతూ ఉన్నత విద్యలు పొందడమే కాకుండా నిరంతరం ఆ విద్యను సమాజపరం చేస్తూ తన ఊరికి, ప్రజలకు సేవ చేయడం కేంద్రంగా పెట్టుకొని దేశమంతా విస్తరించడం ఒక సార్థక జీవితం.

బాలగోపాల్ తర్వాత హక్కుల సంఘాల్లో అంతే విస్తృతంగా తిరిగిన హక్కుల కార్యకర్తలు చాల తక్కువగా ఉంటారు. కాశ్మీరు, మణిపూర్, ఛత్తీస్‌గడ్‌లలో ఎక్కడ రాజ్యహింస తన దమన నగ్న రూపంతో విరుచుకుపడితే అక్కడికి నిజనిర్ధారణ సంఘాల్లోనూ, పోరాట సంఘీభావ పర్యటనల్లోనూ రాములు వెళ్ళేవారు. అక్కడ ప్రజలపై రాజ్యహింసను ఇక్కడ వివరించి ఒక సమన్వయాన్ని, సంఘటన సంఘీభావాన్ని నిర్మించడానికి కృషి చేసిన హక్కుల ఉద్యమ నాయకుల్లో బుర్రా రాములు ఒకరు. రాములు ప్రయత్నపూర్వకంగా ప్రజల భాషలో ప్రజలతో మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నాడు.

ప్రజలకు సులభమయ్యే పద్ధతిలో, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు అర్థమయ్యే ఉపన్యాస ధోరణిని ఆలవోకగా అందిపుచ్చుకున్నాడు. బుర్రా రాములు సాహిత్య రంగంలో కూడా అరుదయిన కృషి చేశాడు. ఇటీవలి కాలంలో చాల కథలు రాసాడు. సైద్ధాంతిక, విశ్లేషణ వ్యాసాలు రాశాడు. రావిశాస్త్రి ఆరు సారా కథలకు కొనసాగింపుగా ఆయన రాసిన 'ఏడో సారా కథ' ఎంతో చర్చితమై ప్రచారాన్ని పొందింది. సాహిత్య సమవాకారం పేరుతో తేన్నేటి సూరి, స్వర్గంలో పాణిగ్రాహి పేదుతో శివసాగర్ రాసిన ఫ్యాంటసీల తర్వాత బుర్రా రాములు రాసిన ఏడో సారా కథయేనని బాలగోపాల్‌వంటి సాహిత్య విమర్శకులు అభిప్రాయపడ్డారు.

బుర్రా రాములు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంగా భావించి అందులో వరంగల్ జిల్లావరకు విస్తృతంగా పర్యటించాడు. వరంగల్ బయట చాలా ముఖ్యమైన మానవ హక్కుల వేదిక కార్యకలాపాలు లేని సమయమంతా ఆయన తెలంగాణ ఉద్యమానికే కేటాయించాడు.

పెదముప్పారంలో జరిగిన అటువంటి సభలో నాకు కూడా ఆయనతో పాటు పాల్గొనే అవకాశం కలిగింది. మిట్టుపల్లి సరేందర్ 'శంకరా' అని ఒక అమరునిపై రాసిన పాట అడిగి పాడించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజలకోసం ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి రంగంలో, హక్కుల రంగంలో కృషి చేస్తున్నా బుర్రా రాములు ఏకాకిగా తన కుటుంబపరంగా ఎంతో ప్రయాసను, కష్టాలను అనుభవించాల్సి వచ్చింది.

ఆయన సహచరి ఏడాది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయి నెలల తరబడి హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. అమె ఇంకా కోలుకోకుండానే జనవరి నెలలో బుర్రా రాములుకు క్యాన్సర్ అని బయటపడింది. క్యాన్సర్ వ్యవస్థతో పోరాడుతున్న వ్యక్తి బుర్రా రాములు తన అనారోగ్యాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

కానీ చాలా వేగంగా ఆయన శిథిలమవుతూ పోయాడు. మే 10వ తేదీన సికిందరాబాదు యశోదా ఆసుపత్రిలో ఆయనను ఆఖరి సారిగా చూడాలని వెళ్ళినపుడు శరీరం నిండా బంధనాలతో, కృత్రిమ శ్వాసతో ఉన్న ఆయనను 'గుర్తు పట్టారా?' అని అడిగాను. 'అయ్యో?!' అన్న ఆయన వ్యక్తీకరణ - అదేం ప్రశ్న అన్న ఆయన అలర్ట్‌నెస్-అదే ఆయన హక్కుల ఉద్యమంలో చూపిన అనవరత ప్రజాస్వామిక జాగరూకత! చిరకాల మిత్రునికి కన్నీటి వీడ్కోలు...

-వరవరరావు