గందరగోళపరిచే రాతలు

గందరగోళపరిచే రాతలు
జాహ్నవి వ్యాస పరంపరస్వోత్కర్ష, పరనింద, అబద్ధాలమయంగా ఉన్నది. మార్క్సిజం మీద రాళ్లువేసే కార్యక్రమం ప్రారంభించారు. కొండను ఢీకొట్టే పొట్టేలులాగా ఎందుకీ దుస్సాహసం? వీరికి మార్క్సిజం గిట్టకపోవచ్చు. ఎంతైనా విమర్శించవచ్చు. కానీ మార్క్స్ చెప్పనివి చెప్పినట్టు, చెప్పినవి చెప్పనట్టు అబద్ధాలు వల్లించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఎవరి కోసమీ తప్పుడు రాతలు? క్యాపిటల్ గ్రంథాన్ని, గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని కాచి వడపోశానని చెప్పుకుంటున్న జాహ్నవి కారల్‌మార్క్స్ గానీ, ఏంగెల్స్ గానీ వర్గాలంటే ఏమి టో, ఉత్పత్తి శక్తుల నిర్వచనం ఏమిటో చెప్పలేదంటున్నారు.

సహజ వనరుల పాత్ర గురించి కూడా మార్క్స్ విస్మరించారట. సోషలిస్టు సమాజంతో చరిత్ర పరిసమాప్తమవుతుందని, దానితో మానవ సమాజ పరిణామ క్రమం ఆగిపోతుందని మార్క్స్ చెప్పని మాటలు చెప్పినట్టు రాశారు. చరిత్ర పరిణామ క్రమం అంతటితో ఆగిపోతుంద ని మార్క్స్ ఏనాడు చెప్పలేదు. ప్రజాస్వామ్య పార్టీలు చేపట్టే సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు కమ్యూనిస్టులకు పెట్టి బూర్జువా ఎత్తుగడలుగా కనబడతాయట. ఇదెప్పుడు కలగన్నారో చెప్పలేదు.

ప్రపంచ చరిత్రలో ప్రజలకు మేలు చేసే ప్రతి చిన్న సంస్కరణనూ ఆహ్వానించింది కమ్యూనిస్టులేనన్న వాస్తవాన్ని జాహ్నవి కావాలనే కప్పిపుచ్చుతున్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో సంఘ సంస్కకర్తల గురించి ప్రచారంలో పెట్టిన వారిలో కమ్యూనిస్టులే ముందున్నారన్న విషయం విస్మరించారు. మార్క్స్, ఏంగెల్స్ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో ఎన్నో వైరుధ్యాలున్నాయట! నాటి నుంచి నేటి వరకు ఎంత మంది ఎత్తి చూపినా ఆ చిక్కుముడులు వీడలేదట.

ఆ చిక్కుముడులు విప్పే పని తనే చేయగలుగుతున్నట్టు చెప్పుకున్నారు. అదనపు శ్రమ సిద్ధాంతాన్ని నమ్మే వారందరికీ ఇంతకాలం తట్టనిది, పట్టనిదొక రహస్యం తనకు మాత్రమే బోధపడిందట. ఉత్పత్తి సరళమైన పద్ధతి నుంచి ప్రావీణ్యతల ద్వారా ఎలా ఎందుకు మారుతుందో, పని విభజన ఎలా విస్తరించిందో తనకు మాత్రమే అర్థమయిందట. ఈ విషయం ఒబామాకు తెలిసి, అర్జెంటుగా ఆహ్వానించి, నోబెల్ బహుమతి ఇప్పించుగాక.

గత మూడేళ్లుగా తమ కలల సౌధాలైన పెట్టుబడిదారీ వర్గాలు కుప్పకూలుతున్నాయి. అభివృద్ధి బాటలో పరుగులు తీసిన అమెరికా, జపాన్, ఫ్రాన్స్ తదితర ఆర్థిక వ్యవస్థలు అంతర్గత వైరుధ్యాలతోనే కుప్పగూలాయి. ఐస్‌లాండ్‌ను అమ్ముకుంటే తప్ప తీరనంత అప్పులో కూరుకుపోయామని ఆ దేశ అధ్యక్షుడు బహిరంగంగానే ప్రకటించాడు. పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలు సంక్షోభంతో, కార్మికవర్గ పోరాటాలతో ఉడికిపోతున్నా యి.

జర్మనీ, బ్రిటన్‌లలో కూడా ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మధ్య జి-20 దేశాల సమావేశం నుంచి బయటకు రాగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ సంక్షోభం నుంచి ఎలా బయట పడాలో అర్థం కావడం లేదనీ, అర్జెంటుగా తనకు క్యాపిటల్ గ్రంథం ఇవ్వండని విలేకరుల ముందే వాపోయిన విషయం ప్రపంచమంతా గమనించింది. మన దేశంలో కూడా ఒకవైపు స్థూల జాతీయోత్పత్తి ఉరకలేస్తుంటే, ప్రపంచ ధనికుల లిస్టు లో చేరుతున్న భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతుంటే మరోవైపు దారిద్య్రం, రైతుల ఆత్మహత్యలు, శిశుమరణాలు, పౌష్ఠికాహారలోపం వెంటాడుతూనే ఉన్నాయి.

ఈ మధ్య మన దేశంలో కొందరికి అభివృద్ధి జబ్బు పట్టుకున్నదని, అభివృద్ధినే సర్వంగా భావిస్తున్నారని నోబెల్ గ్రహీత డా.అమర్త్యసేన్ అందుకే అన్నారు. అగ్రరాజ్యాలన్నీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ చైనా, భారత్‌లు మాత్రం ఇందుకు భిన్నంగా ఎందుకున్నాయనే చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాలన్నీ ప్రజానీకాన్ని మరోసారి మార్క్సిజం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. సోవియట్ పరిణామలు మార్క్సిజానికి కాలం చెల్లిపోయిందని భ్రమించిన వారికి ఇది మింగుడు పడడం లేదు. గందరగోళపరిచే రాతలన్నీ ఇందుకే. జాహ్నవి నిజరూపాన్ని ఏమీ దాచుకోలేదు.

పొదుపు చేసి మదుపు చేయాలన్న పాత సిద్ధాంతాన్ని కొత్తగా చెప్పారు. శ్రమ ద్వారా సృష్టించిన సంపదంతా తిని కూర్చుంటే ఇంకా అడవుల్లోనే ఉండేవాళ్లమన్నారు. సంపద సృష్టిస్తున్న వారెవరో, తిని కూర్చుంటున్న వారెవరో చెప్పలేదు. అనూహ్యమైన సౌకర్యాలు అనుభవిస్తూ రేయింబవళ్లు జల్సాల్లో తేలియాడే పారిశ్రామికవేత్తలు ఎవరూ బికారులుగా కాకపోగా ఫోర్బ్స్ లిస్టులో చోటు సంపాదిస్తున్నారు. ఐదు వేళ్లూ నోట్లోకిపోవడమే గగనంగా ఉన్న పేదలను మాత్రం పొదుపు చేయమంటున్నారు.

ఒక వ్యక్తిని మరొక వ్యకి, ఒక జాతిని మరొక జాతి, ఒక వర్గాన్ని మరొక వర్గం దోచుకునే వ్యవస్థ చిరకాలం వర్ధిల్లాలని వీరి కోరిక!' పెట్టుబడిదారీ సమాజం పరిపక్వమైన తర్వాతనే కదా విప్లవం సాధ్యం, విప్లవం కోరుకునే వారంతా క్యాపిటల్ వృద్ధి చెంది త్వరగా పరిపక్వ దశకు చేరడానికే ప్రయత్నించాలి కదా' అంటున్నారు. అంటే ఇక జాహ్నవి బాటలో అందరూ చేరి పెట్టుబడిదారీ విధానానికి భజన చేయాలన్న మాట.

ప్రపంచీకరణ వేగంతో పరుగులు తీసిన పెట్టుబడిదారీ వ్యవస్థ బోర్లా పడుతు న్న దశలో, దానిని కాపాడడానికి ఎంతో మంది పెట్టుబడిదారీ పండితులు అవసరమే మరి! వేటాడుతూ బతికే పూర్వయుగాల నుంచి మనిషిని ఇంత దూరం రమ్మని ఎవరు బలవంతం చేశారని జాహ్నవి ప్రశ్నిస్తున్నారు. నిజ మే! ఎవరూ బలవంతం చేయలేదు. సహజ పరిణామ సూత్రాలకనుగుణంగానే అది జరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థను ఎవరూ బలవంతంగా కాపాడలేరని, సహజ సూత్రాల ఫలితంగానే కుప్పగూలుతుందన్న విషయం జాహ్నవి గుర్తించడం మంచిది.
-ఎస్.వీరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు