ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్మన్‌ను నియమించాలి

రాష్ట్రంలో దళితుల కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వెంటనే చైర్మన్‌ను నియమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్‌ చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం నియమించిన నోడల్‌ ఎజెన్సీకి చట్టబద్ధత కల్పించాలన్నారు. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చు కోసం నిపుణుల కమిటీని నియమించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సిపిఎం రాష్ట్ర నాయ కులు సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు దళితుల సమస్య లపై వినతిపత్రం ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్రకార్యదర్శి రాఘవులుతోపాటు కేంద్రకమిటీ సభ్యులు పి. మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి. రాములు ఉన్నారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ గతంలో దళితుల సమస్యలపై సిపిఎం పోరాటం చేయగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందన్నారు. రెండు సంవత్సరాలుగా కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను నియమించలేదన్నారు. దళితులకు జరిగే అన్యాయాలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదన్నారు. వెంటనే కమిషన్‌కు చైర్మన్‌, సభ్యులను నియమించాలని డిమాండ్‌ చేశారు. 2007లో తమ నిరాహార దీక్షా ఫలితంగా దళితులకోసం నోడల్‌ ఎజెన్సీని ఏర్పాటు చేసిందన్నారు. అది ఇపుడు చెత్తకాగితంలాగే ఉంది తప్ప దాని ద్వారా ఎలాంటి ఉపయోగం దళితులకు జరగలేదన్నారు. వెంటనే నోడల్‌ ఎజెన్సీకి చట్టబద్ధత కల్పించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న సబ్‌ప్లాన్‌ నిధులను దళితులకే ఖర్చు చేసేలా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ప్రజాసంఘాలు ఈ నెల 22న చేపట్టనున్న ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తమపార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని బడ్జెట్‌ సమావేశాలలోనే ప్రవేశ పెట్టాలన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో 10 వేల కోట్లు కేటాయించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. అంటరానితనం, కులవివక్ష నిర్మూలనకు తాహసీల్దారు, ఎస్‌.ఐ.లు వారంలో ఒకరోజు గ్రామాల్లో సదస్సు నిర్వహించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకానికి 500 కోట్లు కేటాయించి, బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలివ్వాలని కోరారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలన్నారు. 15 వేల దళిత గ్రామాల్లో శ్మశాన స్థలాలు లేవని, వెంటనే గ్రామానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని 13 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. మంచినీటి సౌకర్యంలేని 11 వేల దళిత వాడల్లో మంచినీటి సౌకర్యం కోసం రూ. 300 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

4 వేల దళితవాడలలో విద్యుత్‌ సౌకర్యం కోసం రూ.23 కోట్లు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకం పనిదినాలను దళితులకు 200 రోజులకు పెంచాలని, రోజు వేతనం రూ. 150 ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలయజ్ఞానికి కేటాయించిన బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ ప్రకారం దళితులకు రావాల్సిన రూ. 2432 కోట్లను వారి భూములకు సాగునీరందించడానికి ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్రంలోని లెదర్‌పార్కులు పనిచేయడానికి 100 కోట్లు కేటాయించాలన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల అమలును సమీక్షించి, వాటి అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌బాడీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ప్రజా శక్తీ సౌజన్యముతో